నదీ బేసిన్లు
జనవరి 24th, 2006 by డిస్కవర్ తెలంగాణ
నది అనేది హైద్రాలాజికల్ సిస్టంలో సహజమైన ఉనికి గల ఒక వివేషం (Entity). దానికి భౌగోళికపరమైన సరిహద్దులుంటాయి. నదిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పథకాలు చేపట్టడమనేది శ్రేష్ఠమైన పని. కాని దురదృష్టవశాత్తూ రాజకీయం కారణంగా అది సాధ్యమయ్యే పని కాదు.
మన దేశంలో ఆయా రాష్ట్రాలు, తమ సరిహద్దుల్లోని నదులపై అభివృద్ధి పథకాలను రూపొందించి కేంద్ర జల సంఘానికి పంపటం రివాజు. అంతేగాని నదీబేసిన్పై సమగ్ర అభివృద్ధి పథకాలను (ఏ రాష్ట్రం, ఎంత నీరు అన్నది పట్టించుకోకుండా) రూపొందించి, వాటిని అమలు చేసే వ్యవస్థ మనకు లేదు. అంతర్ రాష్ట్ర నదుల సమగ్ర వికాసం నదీబేసిన్ సంస్థలు లేక నదీ బేసిన్ అథారిటీల ద్వారానే సాధ్యమని గత కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 1988లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సలహా సంప్రదింపుల సంఘం ఏర్పరచిన ఉప సంఘం నదీబేసిన్ సంస్థలు (సౌలభ్యంకోసం ఆర్బిఓ అని వ్యవహరిద్దాం) ఏర్పడాలని, వాటి స్వభావ స్వరూపాలు కూడా సూచించింది. ఇపుడు చెలామణిలో ఉన్న రివర్ బోర్డ్ యాక్ట్ 1956, అంతర్ రాష్ట్ర నదుల అభివృద్ధి, క్రమబద్ధీకరణ విషయంలో కేంద్రానికెలాంటి అధికారం ఇవ్వలేదని, ఆ బోర్డులు కేవలం సలహా ఇచ్చే సంస్థలుగా మాత్రమే మిగిలాయని, కనుక రాజ్యాంగంలోని 246 అధికరణం కింద నదీబేసిన్ సంస్థలను ఏర్పరచాలని ఆ ఉపసంఘం సూచించింది. ఆ సూచనల ప్రకారం నదీ బేసిన్ సంస్థలు కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో పని చేస్తాయి. ఆ నదిపై ఎక్కడ, ఏ సైజులో కట్టడం నిర్మించాలి, ఎక్కడ్నుంచి ఎక్కడికి నీటిని సరఫరా చేయాలి తదితర సమస్త విషయాలు ఆ ఆర్బిఓలే చూసుకుంటాయి. ఆ నదికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ఆర్బిఓలే చేస్తాయి. ఆ నదికి సంబంధించిన రాష్ట్రాలు ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాయి. వివాదమేదైనా వస్తే కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన ఏర్పడే సమీక్షా సంఘం పరిష్కరిస్తుంది.
ఇదిలా వుండగా, భారత ప్రభుత్వం 1990లో, కేంద్ర జలవరుల మంత్రిత్వ కార్యదర్శి అధ్యక్షతన, కేంద్ర జలసంఘం అధ్యక్షుడు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కూడిన, జాతీయ జలమండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలి చేయవలసిన ముఖ్యమైన పని ‘జాతీయ జలవిధానం’ చేసిన వివిధ సిఫారసులు ఏ విధంగా అమలు అవుతున్నాయో సమీక్షించి ప్రధానమంత్రి అధ్యక్షతన, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న జాతీయ జల వనరుల సమితి (National Water Resources Council)కి నివేదించడం. ఈ అత్యున్నత జాతీయ జలవనరుల సమితి 1987లో ఆమోదించిన జాతీయ జలవిధానంలో ‘నదీబేసిన్లపై సమగ్ర అభివృద్ధి పథకాలను రూపొంచాలని, నిర్వహణ చేపట్టాలని, ఇందుకోసం సరైన సంస్థలను స్థాపించాలని’ సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు జాతీయ జలమండలి నదీబేసిన్ సంస్థలపై విధానపత్రం తయారు చేయవసలిందిగా ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆదేశించింది.
ఆర్బిఓల గురించి జలమంత్రిత్వశాఖ పార్లమెంటరీ సలహా సంప్రదింపుల సంఘం యొక్క ఉపసంఘం చేసిన సిఫారసులు జాతీయ జల మండలి ఉపసంఘం చేసిన సిఫారసులు ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉన్నాయి. చట్టం ద్వారా ఆర్బిఓలను ఏర్పాటు చేయాలని మొదటి ఉపసంఘం సిఫారసు చేస్తే, అక్కర్లేదు ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా సరిపోతుంది’ అని రెండో ఉపసంఘం చెప్తోంది. డ్యాంలు కట్టడం, నిర్వహణ సమస్త విషయాలు కేంద్ర అధీనంలో పనిచేసే ఆర్బిఓలు చేస్తాయని మొదటి ఉపసంఘం చెప్తే అబ్బెబ్బే కేవలం డేటా సేకరించడం, అంతర్ రాష్ట్ర ప్రాజెక్టుల అమలును సమీక్షించి సమన్వయ బాధ్యతలు ఆర్బిఓలు చేపడ్తే చాలని రెండో ఉపసంఘం చెప్పింది. ఆర్బిఓల స్థాపనపై కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే, అన్ని రాష్ట్రాలు బాహాటంగా వ్యతిరేకించడంతో ఈ ప్రసక్తి మూతబడిపోయింది.
అయిదేళ్ళ క్రితం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జాతీయ జల కమిషన్ ‘నదీబేసిన్ సంస్థ’ల గురించి సవివరంగా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చింది. ‘నదీబేసిన్ సంస్థ’ కేంద్ర ప్రభుత్వం విభాగం అని, ఆ సంస్థ ద్వారా కేంద్రం తన నిర్ణయాలను తమపై బలవంతాన రుద్దాలని యత్నిస్తోందని, అంతర్ రాష్ట్ర నదీ జలాల్లోని తమ వాటా నీటిని తమ ఇష్టమొచ్చినట్లుగా అభివృద్ధి చేసుకునేందుకు వీలుపడకుండా చేయాలని కేంద్రం పన్నిన పన్నాగమని రాష్ట్ర ప్రభుత్వాలు భయపడి ఆర్బిఓల స్థాపనకు తమ అసమ్మతి తెలియచేశాయని కమిషన్ అభిప్రాయపడింది. ఈ భయం పోగొట్టడానికి నదీబేసిన్ సంస్థలు కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు అంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, నీటి వినియోగదారులతో ఏర్పాటు చేస్తే ఆర్బిఓలు చక్కగా పని చేయగలవన్న ఆశాభావాన్ని కమిషన్ వ్యక్తం చేసింది. కమిషన్ ప్రతిపాదించిన ప్రతి అంతర్ రాష్ట్ర నదీ బేసిన్ సంస్థలో రెండు విభాగాలుంటాయి. 1. జనరల్ కౌన్సిల్, 2. స్థాయీ సంఘం.
ఆర్బిఓల పనిని స్థాయీ సంఘం చూస్తుంది. స్థ్థాయీ సంఘాలు చేసిన చర్చలపై జనరల్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్బిఓలు డేటాను సేకరించడం, వాటిని ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసి ప్రజలకు చేరవేయడం, వివిధ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి సమీకృత ప్రణాళికను రచించడం, భారీ ప్రాజెక్టుల అమలును సమీక్షించే పనులు చేపడ్తాయి. అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటే భారీ ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆర్బిఓలు చేపట్టవచ్చని కమిషన్ సూచించింది. ఆయా రాష్ట్రాల మద్య తలెత్తిన వివాదాలను ఆర్బిఓయే పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అలా సాధ్యం కానపుడే ఆ వివాదాన్ని జాతీయ జలవనరుల సమితికి గాని, ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకై కేంద్రానికి గాని ఆయా రాష్ట్రాలు పంపవచ్చు అని కమిషన్ అభిప్రాయపడింది.
ఆర్బిఓలపై సిఫారసులు చేసేముందు జాతీయ జల కమిషన్ పలు దేశాల్లోని నదీబేసిన్ సంస్థల గురించి అధ్యయనం చేసింది. ఇందులో ముఖ్యమైనవి రెండు: 1. ఫ్రాన్స్లోని నదీబేసిన్ సంస్థలు 2. ఆస్ట్రేలియాలోని మర్రే-డార్లింగు బేసిన్. ఫ్రాన్స్లో ఆరు నదీబేసిన్ సంస్థలున్నాయి. జాతీయ స్థాయిలో ఈ ఆరుసంస్థలను సమన్వయపరిచే మంత్రివర్గసంఘం ఉంటుంది. ప్రతి సంస్థకూ ఒక బేసిన్ కమిటీ, ఒక వాటర్ బోర్డు ఉన్నాయి. ఈ బేసిన్ కమిటీని ‘వాటర్ పార్లమెంటు’గా వ్యవహరించవచ్చు. ఇందులో ప్రజా ప్రతినిధులు, వినియోగదారుల సంస్థల ప్రతినిధులు ఉంటారు. ఆ బేసిన్కు సంబంధించిన అన్ని సమస్యలను చర్చించి బేసిన్ కమిటీ నిర్ణయాలు చేస్తుంది. ఆ నిర్ణయాలు అమలు చేసే బాధ్యత వాటర్ బోర్డ్ది. ప్రపంచంలో అతి సమర్థవంతంగా పనిచేస్తున్న నదీబేసిన్ సంస్థల ఉదాహరణగా ఫ్రెంచి మోడల్ని చెప్పుకుంటారు. ఇక ఆస్ట్రేలియాలోని మర్రే డార్లింగు బేసిన్ విషయానికి వస్తే ఈ బేసిన్లోని భూమి, నీరు, పర్యావరణంకు సంబంధించిన అన్ని రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులతో కూడిన మంత్రివర్గ సమితి ఒకటి స్థాపితమైంది. బేసిన్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న సలహా సంఘమొకటి ఈ మంత్రివర్గ సమితికి తగు సలహాలు అందచేస్తుంది. మంత్రివర్గ సమితి చేసే నిర్ణయాలను మర్రే డార్లింగు బేసిన్ కమిషన్ అమలు చేస్తుంది. ఈ నదిలోని నీటిని ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేయడం, నీటి నాణ్యతను పర్యావరణాన్ని కాపాడడం మొదలైన అన్ని పనులను ఈ బేసిన్ సంస్థ చేపడ్తుంది.
ఫ్రాన్స్లో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అంటూ లేవు. ఒకే ప్రభుత్వం. ఆస్ట్రేలియాలో మనలాగే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మన దేశంలో కూడా రాష్ట్రాలు ఒప్పుకుంటే ప్రతి అంతర్ రాష్ట్ర నదిపై ఒక నదీబేసిన్ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంస్థలో కేవలం ఆయా రాష్ట్ర ప్రతినిధులు ఉండి, ఆ బేసిన్కు సంబంధించిన అన్ని నీటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. కేంద్ర ప్రమేయం లేకుండా నదీబేసిన్ సంస్థ అన్ని బేసిన్ల్లోని నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో, ఏఏ ప్రాజెక్టులను చేపట్టవచ్చో వగైరా విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆయా రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించవచ్చు. ఒక బేసిన్లో అవసరాలకు మించిన నీరుంటే, నీరు అవసరమైన మరో బేసిన్కి ఏ షరతులపై నీటిని మళ్ళించాలి అన్న విషయాన్ని ఇచ్చిపుచ్చుకునే పద్ధతిపై ఆ ఇరు నదీ సంస్థలు చర్చించి నిర్ణయించవచ్చు. కేంద్రం తన అధికారాన్ని రాష్ట్రాలపై రుద్దకుండా వాటిని ప్రోత్సహించి తమంతట తామే నీటి సమస్యలను పరిష్కరించుకునేందుకై నదీబేసిన్ సంస్థలను ఏర్పాటు చేయగలిగితే, నదుల వికాసం సత్వరం జరుగుతుంది. అయితే, ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాష్ట్రం, మరొక రాష్ట్రాన్ని నమ్మకపోవడం, ఏ రాష్ట్రం కూడా కేంద్రాన్ని విశ్వసించకపోవడం, ఏ పరిస్థితుల్లోను తమ హక్కును వదులుకోకపోవడానికి సిద్ధమవకపోవడంతో ‘జాతీయ సమైక్యత’ అనేది కేవలం నినాదంగా మారింది. ఈ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర నదులపై ‘నదీబేసిన్ సంస్థలు’ ఏర్పడడం అనేది ఒక భ్రమగానే మిగిలిపోక తప్పదు!





