విద్యుత్ సంపద
జనవరి 24th, 2006 by డిస్కవర్ తెలంగాణ
మన దేశంలో అపారమైన జల విద్యుత్ సంపద ఉంది. 1987 సంవత్సరంలో కేంద్ర విద్యుత్ సంస్థ (సిఇఎ) వారు చేపట్టిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 వేల 44 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం (60 శాతం లోడ్ ఫ్యాక్టర్ ప్రాతిపదికన) ఉంది. చిన్న చిన్న విద్యుత్ పథకాలు, పంప్ స్టోరేజి పథకాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును కూడా కలుపుకుంటే మన దేశంలో సుమారు 94 వేల మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం (60 శాతం ఎల్ఎఫ్) ఉంది. సామర్థ్యం ఉంది అన్నంత మాత్రాన మనకీ పరిమాణంలో విద్యుత్తు అందుబాటులో ఉందని కాదు.
పెద్ద ప్రాజెక్టుల 84,044 మెగావాట్ల పూర్తి జలవిద్యుత్ సామర్థ్యంతో పోలిస్తే మనం 31.3.2002 వరకు కేవలం 26,269 మెగావాట్ల (31 శాతం) విద్యుత్తును ఉత్పత్తి చేయగల వసతులు ఏర్పాటు చేసుకున్నాం. పదవ పంచవర్ష ప్రణాళికలో మరో 10,800 (13 శాతం) మెగావాట్ల సామర్థ్యం పెరిగే అవకావం ఉంది. 31.3.2007 నాటికి మనం 37,069 మెగావాట్లు అంటే సుమారు 44 శాతం జల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించుకోగలుగుతాం. అంటే ఇంకా 56 శాతం జలవిద్యుత్తును మనం సాధించవలసి ఉంది. అయితే ఈ ‘అపారమైన సంపద’ ఎక్కడ ఉంది? దాన్ని మనం ఎందుకు సాధించలేక పోతున్నాం? ప్రతిబంధకాలేమిటి? అన్న విషయాలను చర్చించుకునేముందు స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఇప్పటివరకు ఈ దిశలో మనం ఎంత ప్రగతిని సాధించగలిగాం అనేది తెలుసుకోవాలి.
మన దేశంలో వెలసిన ప్రప్రథమ మినీ జలవిద్యుత్ కేంద్రం డార్జిలింగులోని ‘సిడ్రపాంగు’. దీని స్థాపిత సామర్థ్యం (Installed Capacity) కేవలం 130 కిలోవాట్లు. దీన్ని నెలకొల్పింది 1897వ సంవత్సరంలో. ఆ తరువాత 50 ఏళ్ళలో మన జలవిద్యుత్ కేంద్ర స్థాపిత సామర్థ్యం 508 మెగావాట్లకు పెరిగింది. స్వాతంత్య్రం నాటికి మన మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యం 1362 మెగావాట్లు. ఆ నాటికి జలవిద్యుత్తు, థర్మల్ విద్యుత్తుతో పోలిస్తే దాని వాటా 37.3 శాతం ఉండేది. అది క్రమంగా పెరుగుతూ 1963లో అత్యధికంగా 50.62 శాతం స్థాయికి చేరింది. ఆ తరువాత జల విద్యుత్ స్టేషన్లు అధోగతిన పయనించాయి. జల విద్యుత్ కేంద్రాల స్థాపనకు తీవ్రమైన అభ్యంతరాలు, అవరోధాలు ఎదురయ్యి, పాలకులు థర్మల్ స్టేషన్లు, అణువిద్యుత్ స్టేషన్ల వైపు మొగ్గుచూపారు. ఫలితం, ఆగస్ట్ 98 నాటికి దేశంలోని అన్ని రకాల విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 88,543 మెగావాట్లు కాగా, జలవిద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 22 వేల 56 మెగావాట్లు మాత్రమే ఉంది. అంటే మొత్తంలో సుమారు 25 శాతం అన్నమాట.
పదవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యం 105046 మెగావాట్ల స్థాయికి చేరింది. ఇందులో జల విద్యుత్తు వాటా 26,269 మెగావాట్లు, థర్మల్ విద్యుత్వల్ల 76057 మెగావాట్లు కాగా అణువిద్యుత్తు సామర్థ్యం 2720 మెగావాట్లు. పదవ పంచవర్షం ప్రణాళిక కాలం అంతం నాటికి మొత్తం విద్యుత్ సామర్థ్యం 1,36,336 మెగావాట్లు. అయితే అందులో జలవిద్యుత్తు 37,069 మెగావాట్లు, థర్మల్ విద్యుత్తు 95,247 మెగావాట్లు, అణువిద్యుత్తు 4020 మెగావాట్లుగా అంచనా వేసారు.
1963 వరకు ఊర్ధ్వ ముఖాన పయనించిన జలవిద్యుత్ కేంద్రాల స్థాపన ఆ తరువాత ఎందుకు దిగజారిందీ అంటే అప్పటిదాకా మనం సాగునీటికోసం అనేక బహుళార్థసాధక ప్రాజెక్టులను చేపట్టాం. ఆ తరువాత మనం పారిశ్రామికీకరణం వేగంగా సాధించే లక్ష్యం పెట్టుకోవడంతో తక్కువ సమయంలో విద్యుత్తును సమకూర్చగల బొగ్గుతో తయారయ్యే థర్మల్ కేంద్రాలపై దృష్టి నిలిపాం. ఏ రకంగా చూసినా థర్మల్ పవర్ స్టేషన్లకన్నా జలవిద్యుత్ కేంద్రాలు మెరుగైనవి. ‘పీక్ డిమాండ్’కి అవసరమైన విద్యుత్తును చవకగా, సమర్థంగా, అతి తక్కువ సమయంలో అందివ్వగల గుణం జలవిద్యుత్ కేంద్రానికుంది. థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా వెలువడే కాలుష్య పదార్థాలు, పర్యావరణానికి హానిని కలిగిస్తాయి. జలవిద్యుత్ని ‘పర్యావరణానికి దోస్త్’ (eco- friendly) గా చెప్పుకుంటారు. థర్మల్ ప్రాజెక్టు కన్నా జలవిద్యుత్ పథకాలు ఎక్కువకాలం మన్నుతాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులను సర్వసాధారణంగా కొండ ప్రాంతాల్లో దుర్గమ క్షేత్రాల్లో నెలకొల్పుతారు. కనుక ఆయా ప్రాంతాలకు రోడ్డు/రైలు సౌకర్యం, విద్యు ద్దీకరణ, పారిశ్రామికీకరణ, ఉపాధి మొదలైన వసతులు కలిగి ఆ క్షేత్ర అభివృద్ధికి వీలవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమైమంటే థర్మల్ విద్యుదుత్పా దనకు అవసరమయ్యే బొగ్గు తరిగిపోయే ఖనిజం. నీరు తరిగిపోని పెన్నిధి. ఏటా ప్రకృతి ప్రసాదించే వరం. అయితే ఇన్ని సుగుణాలున్న జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి కొన్ని అవరోధాలు ప్రతిబంధకాలున్నాయి. ప్రాజెక్టు మూలంగా అడవులు మునిగే ప్రమాదముంది. ఎందరో నిర్వాసితులయ్యే అవకాశముంది. ఈ ప్రతికూల సమస్యలను సమర్థంగా పరిష్కరించగలిగితే ప్రత్యామ్నాయ విద్యుత్ మార్గాలన్నిటికన్నా జలవిద్యుత్తు పథకం శ్రేష్ఠమైంది. అన్నింటికన్నా జలవిద్యుత్తు చవక. నిర్వహణ ఖర్చే తప్ప ముడిసరుకు (నీరు) ఉచితంగా లభిస్తుంది.
సమర్థవంతమైన విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో జలవిద్యుత్తు 40 శాతం ఉండాలని, థర్మల్ విద్యుత్తు 60 శాతం ఉండాలని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మన దేశంలో ఈ నిష్పత్తి 25:75లో కొనసాగుతోంది. అంటే మనం జలవిద్యుత్తు ఉత్పాదనను తక్షణం పెంచవలసిన అవసరముందని స్పష్టమవుతోంది. మన దేశంలో జలవిద్యుత్ ఉత్పాదనకు చాలా అవకాశాలున్నాయి.
బేసిన్ల వారీగా జలవిద్యుత్ సామర్థ్యం (60 శాతం ఎల్ఎఫ్) ఇంతవరకు సాధించిన నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా లభించే జలవిద్యుత్ సామర్థ్య స్థితి పట్టికలోని విధంగా ఉంది.
బేసిన్ నది - మొత్తం జల విద్యుత్ సామర్థ్యం (మెగావాట్లు) - 31.3.99 వరకు సాధించిన జ.వి సామర్థ్యం (మె.వా.) - నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా లభించే జ.వి. సామర్థ్యం (మె.వా.)
ఇండస్ - 19988 - 2935.85 - 1372.83
గంగా - 10715 - 1860.33 - 1137.55
మధ్యభారత నదులు - 2740 - 634.33 - 1528.00
పశ్చిమ దిశగా ప్రవహించే నదులు - 6149 - 3517.50 - 683.97
తూర్పు దిశగా ప్రవహించే నదులు - 9532 - 3663.25 - 699.48
బ్రహ్మపుత్ర - 34920 - 452.67 - 366.72
మొత్తం - 84044 - 13063.93 - 5748.55
ప్రాంతాల వారీగా చూస్తే జలవిద్యుత్ సామర్థ్య స్థితి ఈ రకంగా ఉంది.
(31.8.98 నాటి స్థితి)
ఉత్తర రాష్ట్రాలు - 30155 - 4313.23 - 2468.67
పశ్చిమ రాష్ట్రాలు - 5679 - 1826.17 - 1519.38
దక్షిణ రాష్ట్రాలు - 10763 - 5545.75 - 879.50
తూర్పు రాష్ట్రాలు - 5590 - 962.26 - 611.78
ఈశాన్య రాష్ట్రాలు - 31857 - 332.50 - 323.22
మొత్తం - 84044 - 12979.93 - 5832.55
పట్టికలోని గణాంకాలను పరిశీలిస్తే మొత్తం జలవిద్యుత్తులో 38 శాతం ఈశాన్య రాష్ట్రాలలో నిక్షిప్తమై ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రాలలో సాధించిన జలవిద్యుత్తు దాదాపు శూన్యమని చెప్పాలి. మన రాష్ట్రంలో 31.3.2004 నాటికి స్థాపించిన జలవిద్యుత్ సామర్థ్యం 3588 మెగావాట్లుంది. మొత్తం స్థాపించిన విద్యుత్తు 6560.86 మెగావాట్లు. దేశ పరిస్థితులకు భిన్నంగా మన రాష్ట్రంలో జల విద్యుత్ 55 శాతం, థర్మల్ విద్యుత్తు 45 శాతం ఉంది.
పుష్కలంగా ఉన్న జలవిద్యుత్ను మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? ఇందుకు ప్రధానమైన కారణం జలవిద్యుత్తు ప్రాజెక్టుల కారణంగా ముంపుకు గురయ్యే నిర్వాసితులు, అటవీ పరమైన సమస్యలు. ఇవి కాకుండా అవరోధంగా నిలిచిన సమస్యలలో అంతర్ రాష్ట్ర సంబంధమైనవి, నిధుల కొరత, ఆయా రాష్ట్రాలలోని శాంతిభద్రతల సమస్యతోపాటు సమగ్ర ప్రాజెక్టుల నివేదిక తయారీలో జాప్యం, సంబంధిత అధికారులనుండి అనుమతి లభించడంలో కలిగే ఆలస్యం కూడా ఉన్నాయి. దేశంలో జలవిద్యుత్ వికాసానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో కేంద్ర స్థాయిలో జలవిద్యుత్ సంస్థల ఏర్పాటు, రాష్ట్ర, కేంద్ర ఉమ్మడి సంస్థల ఏర్పాటు, నిధుల కొరత ఏర్పడకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, ప్రైవేట్ భాగస్వామ్యానికి అవసరమైన ప్రోత్సాహకాలను అందచేయడం, పురాతన జలవిద్యుత్ కేంద్రాల ఆధునీకరణ, పునరుద్ధరణ మొదలైనవి చోటు చేసుకున్నాయి.
ఆగస్టు 1998లో భారత ప్రభుత్వం జలవిద్యుత్ వికాస దిశలో అడ్డుకుంటున్న అవరోధాలను తొలగించే లక్ష్యంతో ఓ విధానాన్ని ప్రకటించింది. కొండ ప్రాంతాల్లో దూరంగా విసిరివేసినట్టున్న ప్రాంతాల్లో చిన్న చిన్న విద్యుత్తు కేంద్రాలను నెలకొల్పాలన్న సంకల్పంతో 25 మెగావాట్లకు తక్కువ ఉన్న పథకాలను ‘సాంప్రదాయేతర విద్యుత్ పథకాల మంత్రిత్వ శాఖకు అప్పగించింది. ప్రపంచబ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రంగానికి అవసరమైన నిదులు సమకూరుస్తూ ప్రోత్సాహం కలిగిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం విద్యుత్ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రోత్సాహకాలు ఇవ్వవలసిన అవసరముంది. మరీ ముఖ్యంగా జలవిద్యుత్ అభివృద్ధికోసం జలవిద్యుత్ నిధిని ఏర్పాటు చేయవలసిన అవసరముంది. జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవరోధంగా నిలిచిన పర్యావరణ, అంతర్ రాష్ట్ర సమస్యలను తొందరగా పరిష్కరించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. పథకాల నిర్మాణం కోసం ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర సంయుక్త సంస్థలు ముందుకు వచ్చే విధంగా వసతులు కలిగించాలి. నిర్వాసితుల కొరకు ఆకర్షణీయమైన విధానాలను రూపొందించి అమలు చేయాలి. ఇంతవరకు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి గురైన జలవిద్యుత్ రంగంవైపు దృష్టి సారించి త్వరితగతిన ఈ రంగం అభివృద్ధికి పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేసిననాడే ఆకాశాన్నంటుతున్న కరెంట్ చార్జీలను మనం అదుపు చేయగలం.





