నదీ రవాణా
జనవరి 24th, 2006 by డిస్కవర్ తెలంగాణ
ఒకానొక కాలంలో మన దేశంలో అన్ని రవాణా వ్యవస్థల్లోకెల్లా నదీరవాణా అగ్రగామిగా ఉండేది. అయితే రైలుమార్గాలు అధునాతన సాంకేతికతో రహదార్లు పుంజుకోవడంతో దీనికితోడు నదీరవాణా సేవ నిర్వహణ లోపాలు తోడయ్యి నదీరవాణా తన ప్రాధాన్యతను కోల్పోయింది. ఇప్పటికీ అంతో ఇంతో మెరుగ్గా నదీరవాణా నిర్వహిస్తున్న రాష్ట్రాలుగా గోవా, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళలను చెప్పుకోవచ్చు.
మన దేశంలో నదులు, కాలువలు, భూభాగంలోకి చొచ్చుకవచ్చిన సముద్ర ప్రాంతాలు మొదలైన ప్రాంతాలన్నిటిని కలిపితే రవాణాకనువైన దూరం 14500 కిలోమీటర్లు. ఇందులో యంత్రాల సాయంతో నడిచే పడవలు, ప్రధాన నదులలో 5200 కిలోమీటర్లు, కాలువలలో 485 కిలోమీటర్లు మాత్రమే అని తేలింది. రవాణా కోసం అవసరమైన కనీస లోతుతోపాటు, రవాణా మార్గాల నిర్వహణ, వసతులు సరిగ్గా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ లోపాల మూలంగానే నదీరవాణా ద్వారా కదిలే సరకు కేవలం 1 లక్షా 60 వేల టన్నులకే పరిమితమైంది. అన్ని రవాణా మార్గాల ద్వారా కదిలే సరుకుతో పోలిస్తే నదీరవాణా చేరవేస్తున్న సరుకు కేవలం 0.1 శాతం మాత్రమే అని తెలిస్తే వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతుంది. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం దృష్టి నదీరవాణా వ్యవస్థను మెరుగుపరచే దిశపైన పడింది. నదీరవాణా మిగిలిన రవాణా మార్గాలతో పోలిస్తే కారు చవకయే కాకుండా పర్యావరణం దృష్ట్యా ఎంతో అనుకూలమైనది కావడం కూడా ఇందుకు ప్రబలమైన కారణం.
రైలు, రోడ్డు, రవాణాతో పోలిస్తే నదీరవాణా ఎంత మేలైనదో ఈ క్రింది పట్టిక తెలియచేస్తుంది.
వంద టన్ను మైళ్లలో విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు పౌండ్లలో
మార్గం – ఇంధన వ్యయం (టన్ను కిటోమీటర్కి హెచ్.ఎస్.డి.లీటర్లలో) - ఇంధన సామర్థ్యం (గ్యాలన్కి టన్ను కి.మీ.) - హైడ్రో కార్బన్ - కార్బన్ మోనాక్సైడ్ - నైట్రస్ ఆక్సైడ్
రైలు – 0.011 – 202 – 0.46 – 0.64 – 1.83
రోడ్డు – 0.04 – 59 0.63 – 1.90 – 10.17
నదీరవాణా – 0.0056 – 514 – 0.09 – 0.20 – 0.53
ఇటీవలే ఈశాన్య ప్రాంతంలో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం నదీరవాణాకోసం అవసరమైన పెట్టుబడి టన్ను కిలోమీటర్కు రూ.1.37 కాగా, రైలుపైన రెండు రూపాయలు 25 పైసలు, రోడ్డుపైన రెండు రూపాయలని తేలింది. నదీరవాణాకున్న అనేక రకమైన ఇబ్బందులను తొలగించి నిర్వహణను మెరుగుపరచేందుకు ప్రభుత్వం 1986 లో ఇన్లాండ్ వాటర్వేస్ అథార్టీ ఆఫ్ ఇండియా (IWWA) అనే సంస్థను ఏర్పాటు చేసింది. తొలి ప్రయత్నంగా ఈ సంస్థ మన దేశంలో మూడు జాతీయ నదీరవాణా మార్గాలను గుర్తించింది. మొదటిది గంగానదిపైన.
గంగా-భాగీరథీ-హుగ్లీ నదీవ్యవస్థలోని అలహాబాద్-హల్దియా భాగాన్ని (సుమారు 1620 కిలోమీటర్ల దూరం) గుర్తించి అవసరమైన పనులు చేపట్టడం జరిగింది. రెండవ జాతీయ రవాణా మార్గం బ్రహ్మపుత్ర నదిపైన ధుబ్రినుంచి సదియా వరకు గల 891 కిలోమీటర్ల దూరాన్ని జాతీయ మార్గంగా గుర్తించి తదుపరి చర్యలను చేపట్టారు. మూడవ జాతీయ రవాణా మార్గం (వెస్ట్ కోస్ట్ కాలువ) కేరళలోని కొట్టాపురం నుంచి కొల్లం వరకు గల వెస్ట్కోస్ట్ కాలువను మూడవ జాతీయ మార్గంగా గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది.
పైన చెప్పిన మూడు మార్గాలే కాక సుందర్బన్స్, గోదావరి, కృష్ణ, మహానది, నర్మద మొదలైన నదులను కూడా భవిష్యత్తులో జాతీయ నదీరవాణా మార్గాలుగా గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశముంది.
పదవ పంచవర్ష ప్రణాళికలో నదీరవాణా కోసం 864.73 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటివరకు అంటే మూడేళ్లలో 239.76 కోట్లను ఖర్చు చేసారు. తొలి రెండేళ్లలో హల్దియా పాట్నా మధ్య గల నదిలో 2 మీటర్ల లోతు కనీసంగా ఉండేలా పనులు చేపట్టారు. అలాగే ధుబ్రి. నీమతి మధ్య, కొచ్చి, ఆలప్పుజా మధ్య కూడా ఈ పనిని పూర్తి చేసారు. కోలకత్తా ఫరక్కాలమధ్య అస్సాంలోని ధుబ్రీ-జోగి గొప్పా మధ్య రాత్రిపూట రవాణా వీలయ్యే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేసారు.
పూర్తిగా కేంద్రం ఇచ్చే నిధులతో పూర్తయ్యే పనులతో పాటు 90 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు సమకూర్చి వివిధ రాష్ట్రాల్లో నదీరవాణా సౌకర్యం పెంచే పథకాన్ని కేంద్రం అమలులో పెట్టింది. ఈ పథకాన్ని చేపట్టడానికి అస్సాం, బీహార్, హిమాచల్ప్రదేశ్, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ ముందుకు రావడం హర్షణీయం.





