అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఒక కొత్త బిల్లును పార్లమెంటు మార్చి 11, 2002 న ఆమోదించింది. కృష్ణానదీ వివాదాలతో సతమతమవుతున్న మన రాష్ట్రంపై దీని ప్రభావం గణనీయగా ఉండబోతున్నది.
పార్లమెంటు 1956వ సంవత్సరంలో ఆమోదించిన అంతర్-రాష్ట్ర జల వివాద చట్టానికి కొన్ని సవరణలు చేసి 2001 పార్లమెంట్లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టారు. లోక్సభ ఆమోదించిన ఈ బిల్లు 11 మార్చి, 2002న రాజ్యసభ ఆమోదం కూడా 6 ఆగస్టు 2002నాడు పొంది చట్టం రూపం దాల్చింది. రాజ్యాంగంలోని 262 అధికరణాన్ని అనుసరించి పార్లమెంట్ 1956లో అంతర్రాష్ట్ర జల వివాద చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం అంతర్ రాష్ట్రనది బేసిన్కు సంబంధించిన ఏ రాష్ట్రమైనా నీటి తగాదాను కేంద్రం దృష్టికి తెస్తే, ఆ తగాదా పరిష్కార నిమిత్తం కేంద్రం ఒక న్యాయపీఠాన్ని (ట్రిబ్యునల్) ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అయితే కేంద్రం ఎంత వ్యవధిలో ఈ న్యాయపీఠాన్ని ఏర్పాటు చేయాలి అన్నది ఇందులో లేదు. అదే విధంగా ట్రిబ్యునల్ తన తీర్పుని వెల్లడించడానికి, వెల్లడించిన ఆ తీర్పుపై ఏవైనా వివరణలు కోరితే అవి ఇవ్వడానికి, వెల్లడించిన తీర్పును అమలు చేయడానికి నిర్ణీత కాలపరిమితులు చట్టంలో లేవు. మరో ముఖ్యమైన విషయమేమంటే ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పుకు ఉన్న చట్టపరమైన బలమేమిటి, వాటిని అమలు చేసే యంత్రాంగం ఏమిటి అన్న విషయం కూడా ఎక్కడా పొందుపరచబడలేదు. చట్టంలో ఈ లొసుగులు, బలహీనతలను ఆధారం చేసుకుని న్యాయపీఠాల నియామకంలోనూ, అవి తీర్పునివ్వడంలోనూ, ఆ తీర్పును అమలుచేయడం లోనూ అనంతంగా కాలయాపన జరుగుతోంది.
కేంద్ర రాష్ట్రాల సంబంధాలను అధ్యయనం చేసేందుకు నియమించిన ‘సర్కారియా కమీషన్’ ఈ చట్టాన్ని కూలంకషంగా తన నివేదికలో చర్చించి కొన్ని సిఫారసులు చేసింది. అవి ఈ విధంగా ఉన్నాయి.
- రాష్ట్రం కోరిన తేది నుండి ఏడాదిలోపు ట్రిబ్యునల్ ఏర్పాటు కావాలి.
- ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగాక అయిదేళ్ల వ్యవధిలో అవార్డు (తీర్పు) నివ్వాలి.
ఈ సిఫారసులను పరిశీలించిన అంతర్రాష్ట్ర మండలి, దాని స్టాండింగు కమిటీ ‘ట్రిబ్యునల్ ఏర్పాటయ్యాక, మూడేళ్ల వ్యవధిలోనే అవార్డు ఇవ్వాలని, ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే మరో రెండేళ్ల గడువు ఇవ్వవచ్చునని, అవార్డు ప్రకటించిన తేదీ నుంచి రెండేళ్ల లోపు ఆ తీర్పును అమలు చేయాలి’ అని సిఫారసులు చేసాయి.
సమీకృత జలవనరుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ కమీషన్ ఈ సందర్భంగా మరో సిఫారసు చేసింది. ‘ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిన ఆరు నెలల లోపు ప్రభుత్వం ఆ అవార్డుని ప్రకటించాలన్న’ది ఆ కమీషన్ సిఫారసు. ఇదిలా వుండగా ‘ఫలానా టైములో అవార్డు ఇవ్వమని న్యాయమూర్తులపై వత్తిడి తేవడం ఏ మాత్రం సమంజసం కాదని’ కొన్ని రాష్ట్రాలు వాదించాయి. అయితే వారి వాదనలలో ప్రజా శ్రేయస్సు కన్న తమ స్వప్రయెజనాలు కాపాడుకోవాలన్న తపనే కొట్టవచ్చినట్టు కనిపించింది.
ఏదేమైనా, విజ్ఞత ప్రదర్శించి ప్రభుత్వం 1956 చట్టంలో కొన్ని సవరణలు చేసింది. అవి ఇవి:
- నీటి తగాదా విషయంలో సంబంధిత రాష్ట్రం నుండి కేంద్రానికి అభ్యర్థన వస్తే, ఆ అభ్యర్థన వచ్చిన రోజు నుండి సంవత్సరం లోపు కేంద్రం ఆ తగాదా పరిష్కార నిమిత్తం న్యాయపీఠాన్ని ఏర్పాటు చేయాలి. (ఇది సర్కారియా కమీషన్ చేసిన సిఫారసు). అయితే, ‘ఈ సవరణలతో కూడిన కొత్త చట్టం అమలుకు రాకపూర్వం ట్రిబ్యునల్ పరిష్కరించిన వివాదాన్ని తిరిగి తోడటానికి వీలవదు’ అన్నది కొత్తగా చేర్చిన అంశం.
- 1956 చట్టం ప్రకారం ట్రిబ్యునల్ కార్యకలాపాలలో సలహా ఇవ్వడానికి ఇద్దరు లేక ఎక్కువ మందిని అసెస్సర్స్గా నియమించే అధికారం ట్రిబ్యునల్కుంది. ప్రతిపాదిత కొత్త చట్టంలో ఈ అధికారం ట్రిబ్యునల్కు బదులుగా కేంద్ర ప్రభుత్వానికి మార్చారు. అయితే నియామకం చేసే ముందు ట్రిబ్యునల్ని సంప్రదించవలసి ఉంటుంది.
- ట్రిబ్యునల్ తమ తీర్పుని మూడు సంవత్సరాలలోపు ఇవ్వాలి. ఒకవేళ ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి ట్రిబ్యునల్ తమ అవార్డుని మూడేళ్లలోపు ప్రకటించలేకపోతే ఆ గడువును మరో రెండేళ్లదాకా పొడిగించే అధికారం కేంద్రానికుంది. (ఈ సిఫారసులు అంతర్ రాష్ట్ర కౌన్సిలింగు, దాని స్టాండింగు కమిటీ చేసినవే).
- ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై, కేంద్రం లేక సంబంధిత రాష్ట్రమేదైనా తీర్పు ఇచ్చిన మూడు నెలలలోపు వివరణ కోరితే, ఆ వివరణపై ట్రిబ్యునల్ తమ నివేదికను/వివరణను సంబంధిత రాష్ట్రం/కేంద్రం కోరిన ఏడాదిలోపు ఇవ్వవలసిన ఉంటుంది. అయితే ఈ ఏడాది గడువును కూడా అవసరమైతే పొడిగించే అధికారం కేంద్రానికుంది. (పొడిగించిన గడువు ఎంత అన్నది ఈ కొత్త చట్టం స్పష్టపర్చలేదు).
- 1956 చట్టం ప్రకారం ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం అధికార పత్రం (గెజిట్)లో ప్రకటించాలి. ఆ తీర్పుకు వివాదానికి సంబంధించిన పార్టీలన్నీ కట్టుబడి ఉండాలి. ఆ తీర్పుని మార్చడానికి వీలులేదు. ఆ పార్టీలు తీర్పుని విధిగా అమలుచేయవలసి ఉంటుంది. అయితే పాత చట్టంలోని ఈ నిబంధనలకు చట్టబద్ధత లేదు. పైగా కాస్త బలహీనంగా, అస్పష్టంగా ఉంది. ఈ లొసుగును కొత్త చట్టంలో తొలగించారు. వాస్తవానికి చట్టంలో ప్రవేశపెడ్తున్న అన్ని సవరణలోకెల్లా ఇదే అతి ముఖ్యమైనది. ఇంతకాలం రాష్ట్రాలు ఏవో సాకులు చెప్పి ట్రిబ్యునల్ తీర్పుని అమలు చేయకుండా కాలక్షేపం చేస్తున్నాయి. కొత్త చట్టంలో ట్రిబ్యునల్ తీర్పుకు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమైన ప్రతిపత్తి కలిగించడం విప్లవాత్మకమైన మార్పుగానే చెప్పుకోవచ్చు.
- ట్రిబ్యునల్, తన కవసరమైన ఎలాంటి సమాచారాన్నైనా అడిగి తెప్పించుకోవచ్చు (ఇది కొత్తగా చేర్చిన అంశం) కోడ్ ఆఫ్ సివిల్ ప్రోసీజర్, 1908 క్రింద సివిల్ కోర్టు అధికారాలను ట్రిబ్యునల్కు కొన్ని విషయాలలో కట్టబెట్టారు. వాటిలో ఈ సమాచారం తెప్పించుకునే విషయాన్ని కూడా ఇప్పుడు చేర్చారు.
- సర్కారియా కమీషన్ చేసిన సిఫారసు ఆధారంగా సవరణలతో కూడి కొత్త చట్టంలో డ్యాటా బ్యాంకు గురించి కొన్ని అంశాలు చేర్చారు. అవి ఏమంటే:
- ప్రతి నదీ బేసిన్ విషయంలో జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక డేటా బ్యాంకును, సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ డేటా కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా నిర్దేశించిన జలవనరులు, భూమి, వ్యవసాయం తత్సంబధిత అంశాలకు సంబంధించి ఉంటుంది. ఈ డేటాను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వానికి, లేక కేంద్రం నియమించిన సంస్థకు గాని, కోరినప్పుడు అందివ్వాలి.
- రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన డేటాని తనిఖీ చేసే అధికారం కేంద్రాని కుంది. ఈ విషయంలో ఎవరినైనా నియమించే అధికారం, ఆ తర్వాత అందుకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికుంది. కేంద్రం నియమించిన వ్యక్తులకు అవసరమైన రికార్డులు, సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్నుండి అడిగి తెప్పించుకునే అధికారం ఉంది.
టూకీగా చెప్పాలంటే కొత్త చట్టానికి ఈ సవరణలతో ఊపిరిపోసినట్ట యింది. ట్రిబ్యునల్ నియామకం నుండి అది తీర్పు చెప్పే వరకు కాలపరిమితులను కొత్త చట్టం నిర్దేశిస్తోంది. ట్రిబ్యునల్ తీర్పుకు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమైన హోదా కల్పించడం వల్ల రానున్న కాలంలో ట్రిబ్యునల్ అవార్డులతో చెలగాటాలాడుకునే పరిస్థితి మారుతుంది. డేటా బ్యాంకు విషయంలో కూడా ఈ చట్టం విశేషమైన బరువు బాధ్యతలను కేంద్రానికి కట్టబెట్టింది. తప్పుడు సమాచారమిచ్చి రాష్ట్రాలు తమ పబ్బం గడుపుకునే రోజులు ఇక ముగిసినట్టే. సవరణలతో కూడిన అంతర్ రాష్ట్ర జల వివాదం చట్టం 2002లో అవతరించడంతో జలవివాదాలకు పట్టిన గ్రహణం వీడినట్టయింది. ఇక ‘జలవివాదాల్లో సత్వర పరిష్కారం’ లభిస్తుంది. ఇప్పటిలా చీటికి మాటికి ఏదో నెపంతో సుప్రీంకోర్టు గడప తొక్కవలసిన అవసరం రాదని భావించవచ్చు.