సాగునీటి ప్రాజెక్టులలో మూడు రకాలున్నాయి. 10 వేల హెక్టార్ల సిసిఎ (కమాండబుల్ కల్చరబుల్ ఏరియా) కలిగిన ప్రాజెక్టులను భారీ ప్రాజెక్టులుగా, 2వేల హెక్టార్ల నుంచి 10 వేల హెక్టార్ల సిసిఎ కలిగిన ప్రాజెక్టులను మధ్యతరహా ప్రాజెక్టులుగా, 2 వేల హెక్టార్లకన్న తక్కువ సిసిఎ కలిగిన ప్రాజెక్టులను చిన్నతరహా ప్రాజెక్టులుగా వ్యవహరిస్తుంటారు. అంతర్రాష్ట్ర అంశాలు కలిగిన భారీ ప్రాజెక్టులు, మధ్యతరహా ప్రాజెక్టులను కేంద్రానికి పరిశీలన నిమిత్తం పంపవలసి ఉంటుంది. అంతర్రాష్ట్ర అంశాలు లేని భారీ ప్రాజెక్టులు, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ నిర్ణయం తీసుకోవచ్చు. ప్రతి రాష్ట్రం కొన్ని అభివృద్ధి పథకాలను తమ పంచవర్ష ప్రణాళికలోనూ, వార్షిక ప్రణాళికలోనూ సూచిస్తూ ఉంటుంది. ఈ పథకాలను ప్రణాళికా సంఘం (ప్లానింగు కమిషన్) ఆమోదించవలసి ఉంటుంది. ప్రణాళిక సంఘం ఆమోదం పొందాలీ అంటే ఆయా రంగాలకు సంబంధించిన మంత్రిత్వశాఖలు ఏర్పాటుచేసే సలహాసంఘాలు ముందుగా ప్రాజెక్టులకు తమ ఆమోదం తెలపాలి. ప్రణాళికా సంఘం ఆమోదించిన ప్రాజెక్టులనే రాష్ట్రం తమ వార్షిక / పంచవర్ష ప్రణాళికల్లో చేర్చ వీలవుతుంది. ఆ ప్రాజెక్టుల ఆధారంగానే కేంద్రం రాష్ట్రానికిచ్చే గ్రాంటుని నిర్ణయిస్తుంది. అంతేకాక ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రపంచబ్యాంకు లేక ఏ ఇతర ఆర్థిక సంస్థలను అప్పు అడిగినా అవి ముందు అసలు ఆ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఉందా? లేదా? అన్న అంశం పరిశీలిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్రాష్ట్ర అంశాలున్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి తప్పనిసరి. ‘కేంద్రం పర్మిషన్ ఇచ్చేదేంటి. మా నీటిని మా డబ్బుతో అభివృద్ధి చేసుకుంటాం’ అని కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాజెక్టులను చేపట్టిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అది వేరే విషయం.
ఇకపోతే జలవనరుల రంగం విషయానికి వస్తే కేంద్రం నుండి అనుమతి మూడు దశలలో పొందాల్సి ఉంటుంది. 1. జలవనరుల మంత్రిత్వశాఖ వారి సాంకేతిక సలహా సంఘం ఆయా ప్రాజెక్టులకు అనుమతినివ్వాలి. 2. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వశాఖ నుండి అనుమతి పొందాలి. 3. సంక్షేమ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాలి. ఈ మూడు శాఖల నుంచి అనుమతి పొందాకే ప్రణాళికా సంఘం ఆ ప్రాజెక్టును సంబంధిత రాష్ట్రం తమ అభివృద్ధి పథకంగా చూపుకోవచ్చన్నమాట.
అంతర్రాష్ట్ర అంశాలు కలిగిన అంతర్రాష్ట్ర నదులపైన కట్టే భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ కూడా అంతర్ రాష్ట్ర అంశాలు కలిగి ఉన్నట్టే. ఈ ప్రాజెక్టులు కేంద్రం నుండి అనుమతులు పొందాలంటే విధిగా పాటించవలసిన నియమాలు ఉన్నాయి. ముందస్తుగా ఒక ప్రాథమిక నివేదికను కేంద్ర జలసంఘానికి సమర్పించవలసుంటుంది. ఆ నివేదికలో ప్రాజెక్టుపై జరిపిన క్షేత్ర అధ్యయన వివరాలు అంటే సర్వే, ఇన్వెస్టిగేషన్లు, అంతర్ జాతీయ లేక అంతర్ రాష్ట్ర అంశాలు, నీటి లభ్యత, వరదలకు సంబంధించిన హైడ్రాలజీ, సాగునీటి ప్రణాళిక, సంక్షిప్త పర్యావరణ అంశాలు, ప్రాజెక్టు నుండి కలిగే లాభాల వివరాలు వగైరా పొందుపరచవలసి ఉంటుంది. ఈ ప్రాథమిక నివేదిక ప్రాజెక్టు ప్రతిపాదన పరిపుష్టతను ధృవీకరిస్తుంది. ఈ నివేదిక అంగీకారమవుతే కేంద్రజలసంఘం సూత్రప్రాయ (In Principle). అంగీకారాన్ని తెలియచేస్తూ సవివరమైన ప్రాజెక్టు నివేదికను సమర్పించవలసిందిగా సలహా ఇస్తుంది. ఆ సవివరమైన నివేదికను కేంద్ర జలసంఘం రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి రూపొందించాలి. సమాంతరంగా పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక (EIA) నిర్వాసితుల పునరావాసం కోసం తయారుచేసే R&R ప్లాను, పర్యావరణ మరియు విపత్తు నిర్వహణ ప్రణాళికలతో ప్రాజెక్టు వ్యయ అంచనాలను కూడా సిద్ధం చేసుకుని పంపవలసుంటుంది. అటవీ మంత్రిత్వ శాఖ నుండి అవసరమైన అనుమతులకోసం కూడా చర్యలు చేపట్టవలసుంటుంది. అదేవిధంగా ప్రాజెక్టు మూలంగా షెడ్యూల్ తెగలకు చెందినవారు నిర్వాసితులయేట్టు ఉంటే వారికి సంబంధించిన పునరావాస ప్రణాళికలు (R&R ప్లానులు) భారీ సాగునీటి ప్రాజెక్టు లేక బహుళార్థక ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం రిపోర్టును కేంద్ర జలసంఘం ప్రధాన కార్యాలయానికి పంపవలసుంటుంది. ఆ రాష్ట్రంలో డిజైన్ మరియు ప్లానింగు సంస్థలు ఉన్నట్టవుతే (ఆ మేరకు ధృవీకరణ పత్రం జతపరచాలి) ప్రాజెక్టు రిపోర్టును ముందు రాష్ట్రస్థాయి సాంకేతిక సలహాసంఘం, పర్యావరణ సంఘం పరిశీలించవలసుంటుంది. కేంద్ర జలసంఘం పరిశీలన కేవలం అంతర్రాష్ట్ర అంశాలు, బేసిక్ ప్లానింగు, హైడ్రాలజీ, ఆర్థిక పరిపుష్టత వంటి అంశాలకే పరిమితమై ఉంటుంది.
డిజైన్ మరియు ప్లానింగు సంస్థలు లేని రాష్ట్రం పంపే ప్రాజెక్టు రిపోర్టును సమూలంగా కేంద్ర జలసంఘం సంబంధిత నిపుణులు, జలవనరుల మంత్రిత్వశాఖ, వ్యవసాయ మంత్రిత్వశాఖ, కేంద్ర భూగర్భజలమండలి ఇంకా ఇతర సంబంధిత కేంద్ర సంస్థలు పరిశీలించడం జరుగుతుంది. పరిశీలన అనంతరం ప్రాజెక్టు నివేదిక సాంకేతికంగా ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సాంకేతిక సలహా సంఘం ఈ నివేదికకు అనుమతి ఇస్తుంది. మామూలుగా ఈ తతంగం పూర్తవడానికి ఆరు నెలల నుండి 12 నెలలు పడ్తుంది.
ఇదంతా ఒక ఎత్తయితే, ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీశాఖల అనుమతి పొందడం మరోఎత్తు. ప్రాజెక్టు ఏదైనా అటవీ ప్రాంతాన్ని ముంపునకు గురిచేస్తుందా? ఆ ముంపునకు గురయ్యే ప్రాంతంలో అరుదైన వనమూలికలు, పక్షి, జంతుసంతతి వుందా? కేంద్రం ప్రకటించిన అభయారణ్యం వుందా? అసలు అడవిని ముంపునకు గురిచేయడం తప్పనిసరా? ప్రత్యామ్నాయం ఉందా? ఇవన్నీ పరిశీలించి, అనివార్యమనిపించినప్పుడు ఆ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలనుకుంటే కోల్పోయిన అడవికి బదులుగా కొత్తగా అడవిని పెంచే ప్రణాళికని పరిశీలించడం జరుగుతుంది. కేరళలోని సైలెంట్ వాలీ అనే ప్రాజెక్టుకు ఆమోదం తెలపక పోవడానికి కారణం ఆ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు తలపెట్టిన అడవిలో సింహం తోకతో ఉన్న అరుదైన కోతులు ఉండటమే కారణం అన్నది తెలుసుకోదగ్గ అంశం. ఇక పర్యావరణశాఖ పరిశీలించే అనేక విషయాల్లో ప్రాజెక్టు మూలంగా నిర్వాసితులయ్యే వారి సంఖ్య? వారి పునరావాసం ఎలా? అనేవి ముఖ్యమైనవి. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అంశాలన్నిటినీ అధ్యయనం చేసి ఒక పట్టికను / నివేదికను తయారుచేయాలి. దీనితోపాటు పర్యావరణ నిర్వహణ ప్రణాళిక తయారు చేయాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుండి అనుమతి లభిస్తుంది. ప్రాజెక్టు మూలంగా గిరిజనులెవరైనా నిర్వాసితులయ్యేట్లయితే, ఆ రిపోర్టును కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిశీలించి, తమ ఆమోదం తెలియజేస్తుంది. అంటే ప్రాజెక్టునుబట్టి జలవనరుల, పర్యావరణ, అటవీ, సంక్షేమ మంత్రిత్వ శాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. వీటి అనుమతి లభించాకే ప్రణాళికా సంఘం తమ ఆమోదాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రాజెక్టులో సాగునీరు కాకుండా విద్యుత్తు ఉత్పాదన కూడా ఉంటే ఆ రిపోర్టు ప్రతిని కేంద్ర విద్యుత్ అథారిటీకి పంపి వారి ఆమోదం పొందే బాధ్యత కేంద్ర జలసంఘానిదే.
ఒక ప్రాజెక్టుకు కేంద్రం అంగీకారం పొందాలంటే ఇంత తంతు ఉందన్నమాట. కాగా వాస్తవంలో, రాష్ట్రాలు చాలా లోపభూయిష్టంగా నివేదికలు తయారుచేసి కేంద్రజలసంఘానికి పంపటం, వారు సంతృప్తి చెందక వాటిని వాపసు చేయడం, ఇలా చాలా కాలంగా జరుగుతూ వస్తోంది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రాలు జాప్యాన్ని కేంద్రంపై నెట్టివేయడం మామూలైపోయింది.