ప్రణాళికా కాలం అంటే 1951వ సంవత్సరంలో మొదలయిన మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నుంచి 1996-97 సంవత్సరం వరకు (96-97 ధరల స్థాయిని అనుసరించి), భారీ, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులపైన ప్రభుత్వం 1,32,390 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. వరద నియంత్రణ, ఆయకట్టు (command area) అభివృద్ధి, చిన్నతరహా ప్రాజెక్టులు కూడా కలుపుకుంటే 2,31,387 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అయితే మొదటి ప్రణాళికా కాలంలో సాగునీటి పథకాలపైన 22.5 శాతం డబ్బు వెచ్చిస్తే తొమ్మిదో ప్రణాళికా కాలంనాటికి అది 6.5 శాతానికి పడిపోయింది. వివిధ ప్రణాళికా కాలాల్లో మొదలయిన 388 భారీ మరియు మధ్యతరహా ప్రాజెక్టులు నిధులు లేక ఇంకా పూర్తి కాకుండా మిగిలిపోయాయి. వీటిని పూర్తి చేయాలంటే పదవ ప్రణాళికలో నీటి రంగానికి కేటాయించిన 71 వేల కోట్ల రూపాయలు (డబ్బంతా ఈ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టినా కూడా) చాలవు. ఇంకా సుమారు 24 వేల కోట్ల రూపాయలను పదకొండవ ప్రణాళికా కాలంలో కూడా కేటాయించవలసి ఉంటుంది. పెండింగు ప్రాజెక్టులు పూర్తి కావడానికి అవసరమయిన మొత్తం ద్రవ్యోల్బణం మూలంగా బాగా పెరగవచ్చు అని నిపుణుల అభిప్రాయం.
పాత స్కీంలను పూర్తి చేయడానికి డబ్బు లేనపుడు కొత్త స్కీంలను తలపెట్టడమెందుకు అన్నది సహేతుకమైన ప్రశ్న. ఇది చాలామటుకు రాజకీయ లబ్దికోసమే అన్నది నిర్వివాదాంశం. ప్రజలను నమ్మించి మోసగించడం తప్ప మరోటి కాదు. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం (1951-56)లో ప్రారంభమయిన తుంగభద్ర డాం ఎడమ గట్టు కాలవ తొమ్మిదవ ప్రణాళికా కాలం నాటికి కూడా ఇంకా అసంపూర్తి ప్రాజెక్టులుగానే రికార్డుల్లో ఉంది. అలాగే రెండవ పంచవర్ష ప్రణాళికలో మొదలయిన నాగార్జునసాగర్ ఈనాటికీ అసంపూర్తి ప్రాజెక్టుగానే చూపబడుతోంది (ఈ ప్రాజెక్టులు పూర్తయినా కూడా ప్లాన్ ఫండ్స్ని కేంద్రం నుంచి రాబట్టుకో వడానికి రాష్ట్రాలు అలా అసంపూర్తి ప్రాజెక్టులుగా రికార్డుల్లో చూపెడుతున్నా యని కొందరి వాదన). ఏమైనా ఇలాంటి కొన్ని ప్రాజెక్టులు మినహాయిస్తే చాలా ప్రాజెక్టులు అవసరమైన నిధులు లేక సాగిలపడుతున్నాయన్నమాట మాత్రం పచ్చినిజం. రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రులు కలిసిన ప్రతి సమావేశంలోనూ thinning of resources (వనరులను అనేక ప్రాజెక్టులపై ఖర్చుపెట్టి పలుచన చేయడం) కూడదని, పాత ప్రాజెక్టులను ముందు పూర్తి చేయాలని తీర్మానాలు చేస్తారు. తిరిగి ఆ పెద్దలే తమ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడి ప్రజల అభిప్రాయం మేరకు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ఒక తంతుగా మారింది.
నిర్మాణం చాలావరకు సాగి, ప్రాజెక్టు చాలా advance stage లో ఉండిపోయి కొంత ధనం అందిస్తే పూర్తవడమో, లేక అదనపు భూమి సాగులోకి రావడమో వీలయ్యే ప్రాజెక్టులకు కేంద్రం 1996-97 ఆర్థిక సంవత్సరం నుంచి ‘సత్వర సాగునీటి లబ్ధి కార్యక్రమం’ (Accelerated Irrigation Benefit Programme of AIBP) కింద అప్పు రూపంలో డబ్బు అందిస్తోంది. అయితే ఈ డబ్బు కేంద్రం అందిచ్చేది రాష్ట్ర తన వంతు ఖర్చు పెట్టినపుడే. ఈ ఆర్థిక సహాయం ప్రత్యేక రాష్ట్రాలు, వర్గానికి చెందిన ఒరిస్సాలోని కెబికె జిల్లాల ప్రాజెక్టులకు 3:1 (అంటే మూడు కేంద్రం, ఒకటి రాష్ట్రం ప్రాతిపదికన) అందించబడుతుంది. మిగతా రాష్ట్రాల విషయంలో కేంద్రం రెండు వంతుల సహాయం చేస్తే రాష్ట్రం ఒక వంతు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అయితే కేంద్రం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ప్రాజెక్టు పనులపైనే వినియోగించాలి తప్ప జీతభత్యాలపై కూడదన్నది షరతు. 1999-2000 సంవత్సరంలో AIBP కింద 1600 కోట్లు కేటాయించారు. ఆంధ్రతో సహా అనేక రాష్ట్రాలు మేచింగు ఫండ్స్ అందివ్వలేక AIBP కేంద్ర నిధులను సవ్యంగా వినియోగించుకోలేకపోవడం దురదృష్టకరం.