నదీ జలాలు, భూగర్భ జలాల పరిమాణం తగ్గిపోవడం కన్నా రానున్న కాలంలో మనల్ని తీవ్రంగా వేధించే సమస్య ఆ నీళ్లు కలుషితమవడం. మన దేశంలో అనేక నదులు కలుషితమవుతున్నాయి. అతి పవిత్రంగా భావించే గంగా నదిని ప్రతి దినం 66 కోట్ల లీటర్ల గృహ, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు కలుషితం చేస్తున్నాయి. 1986లో ప్రభుత్వం చేపట్టిన గంగా కార్యాచరణ పథకం (Ganga Action Plan Phase 1) ద్వారా పరిస్థితి చాలావరకు మెరుగుపడ్డా ఇంకా నదిలోని కొన్ని భాగాలు, స్నానం చేయడానికి, తాగడానికి, సాగునీటికి పనికిరాకుండా పోతున్నాయని కొన్ని రిపోర్టులు వచ్చాయి. గంగా కార్యాచరణ పథకం మాదిరిగానే జాతీయ నది పరిరక్షణ పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకంలో గంగా బేసిన్లో మొదటి దశలో పరిశుభ్రం కాని పట్టణాలు, యమునా నది, గోంతీ నది, ఇంకా 18 రాష్ట్రాల్లోని 46 నదులను పరిశుభ్రం చేసే ప్లాన్ ఉంది. ఆ 46 నదుల్లో ఆంధ్రప్రదేశ్లో గోదావరి బేసిన్లోని నాలుగు పట్టణాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇదే మాదిరిగా National Lake Conservation Programme (జాతీయ సరస్సు పరిరక్షణ కార్యక్రమం) ఒకటి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా అంటే 9 రాష్ట్రాల్లో 11 సరస్సులను శుద్ధి చేసే ఆలోచన వుంది. ఇందులో హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో ఒకటి.
ఇక భూగర్భ జలాల ప్రసక్తి వస్తే హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రంలో భూగర్భ జలస్థాయి ఏడాదికి అరమీటర్ చొప్పున పడిపోతున్నట్టు అంచనా. సముద్ర తీర ప్రాంతాల్లో అలా భూగర్భ జలస్థాయి పడిపోతే సముద్రం నీరు భూమిలోకి చొచ్చుకుపోయి భూగర్భ జలాలను కలుషితం చేసే ప్రమాదముంది. అలాగే రసాయనాలు, వ్యర్థ పదార్థాలు వర్షంతో పాటు భూమిలోకి చొచ్చుకుపోయి భూ జలాన్ని కలుషితం చేసే అవకాశం ఉంది. నదీ జలాలు కలుషితమయితే వాటిని శుద్ధి చేసుకోవచ్చు. కాని, భూగర్భ జలాలు కలుషితమయితే బాగుచేయడం చాలా కష్టం. కనుక, నివారణ చర్యలు చాలా ముఖ్యం. చట్టపరంగా చూస్తే 1974లో తొలిసారి, అంటే స్టాక్హోం సమావేశం తరువాత మన దేశంలో The Water (Prevention and Contorl of Pollution) Act వెలువడింది. ఆ తర్వాత 1977లో The Water (Prevention and Contorl of Pollution) Cess Act, 1977 బయటికి వచ్చింది. అన్నింటికన్నా The Environment (Protection) Act, 1986 మహత్తరమైనది. ఇది అన్ని చట్టాలను ఏకం చేసే ఛత్రం వంటిది. ఈ చట్టం నీటిని కలుషితం చేసే దోషులకు కఠిన శిక్ష విధిస్తుంది. ఈ చట్టాలను అమలు చేసే అధికారం అటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఇటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలులకు ఉంది. అయితే అధికారాలు ఎన్ని ఉన్నా, అమలు చేయడానికి అవసరమైన హంగులు, సరంజామా, మందీ మార్బలం, చిత్తశుద్ధి ఉంటే తప్ప పనులు జరగవు. జలకాలుష్యంపై ఇప్పటికే అనేక సుప్రీంకోర్టు, హైకోర్ట్ తీర్పులు దోషులకు కఠిన శిక్షలు విధించే విధంగా వెలువడ్డాయి. ఇంత జరిగినా పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పేమీ కనిపించదు. 1996లో సుప్రీంకోర్టు భూగర్భ జల కాలుష్య నివారణార్థం కేంద్ర భూగర్భ జల అథారిటీని (Central Ground Water Authority) నియమించింది. అదే మోస్తరుగా రాష్ట్ర భూగర్భ జల అథారిటీలు ఏర్పడే అవకాశముంది. ఎన్ని చట్టాలు చేసినా ప్రజల భాగస్వామ్యం ఉంటే తప్ప చట్టాల అమలు సజావుగా సాగదు. యూరప్లోని వివిధ దేశాలు ఒడంబడికలు చేసుకుని తమ నదులను కాపాడుకుంటున్నాయి. డాన్యూబ్ (Danube) నదిని పరిరక్షించడానికి ఆ నదికి చెందిన 13 దేశాల మద్య ఏర్పడ్డ ఒడంబడిక సజావుగా సాగుతోంది. అంతర్ రాష్ట్ర నదీ జలాల పరిరక్షణ కోసం అదే సరళిలో మన దేశంలోని రాష్ట్రాలు చిత్తశుద్ధితో ముందుకు వస్తే కార్యక్రమం కొనసాగుతుంది. అంతర్ రాష్ట్ర నదులలో ‘నదీ బేసిన్ సంస్థ’ ఏర్పడితే ఈ పని సులభంగా పూర్తవుతుంది.