తెలంగాణ సాంస్కృతిక వికాసానికి ఆద్యుడు హన్మంతరావు
నవంబర్ 19th, 2006 by డిస్కవర్ తెలంగాణ
తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి నిరంతర కృషి సల్పిన మహనీయుడు మాడపాటి హన్మంతరావు. భావదాస్యంతో భషాదాస్యంతో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజలల్ల చైతన్యాన్ని నూరిపోసి ఉద్యమాలు నిర్మించిండు మాడపాటి. కృష్ణా జిల్లాలో జన్మించినప్పటికీ పెరిగి పెనవేసుకున్న జీవితం అంతా తెలంగాణలనే. ఆయన తపనా కృషీ అంతా స్థానిక ఉద్యమాలతో కొనసాగింది.
తెలుగును ‘తెలంగీ బేడంగీ’ అని అపహాస్యం చేస్తున్న రోజులవి, ‘గస్తీ నిషాన్ తిర్పన్’ అనే జి.వో నెంబర్ 53 ప్రకారం అనుమతి లేనిదే ఏ రకమైన సమావేశం కూడా జరుపుకోవడానికి వీల్లేని నిర్బంధం అమల్లో ఉండేది. పత్రిక నడపటానికి వీల్లేదు. పాఠశాల పెట్టుకొనే అవకాశం లేదు. అట్లాంటి దశలో కంకణం కట్టుకొని తెలంగాణ చైతన్యాన్ని రగిల్చిన వ్యక్తి మాడపాటి.
భాషా సాహిత్య చైతన్యాల్ని పాదుకొల్పటంల భాగంగా హైద్రాబాద్ల దేవరాయాంధ్ర భాషానిలయాన్ని అభివృద్ది పరుస్తూనే హనుమకొండల శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయాన్ని స్థాపించిండు. గ్రంధాలయోద్యమానికి నాయకత్వం వహిస్తూనే ‘ఆంధ్రమహాసభ’ను రాజకీయ, సాంఘిక ఉద్యమంగా నడిపించటంల హన్మంతరావు కృషి ప్రత్యేకంగా పేర్కొనదగినది. ‘ఆంధ్రమహిళా సభ’ను స్థాపించి మహిళల్లో జాగృతిని సాధించిండు.
మాడపాటి రచయిత. పండితుడు. ఉర్దూ, ఫారసీ, ఇంగ్లిషు భాషా సాహిత్యాలల్ల నిష్ణాతుడు. తెలంగాణల మొదటి కథానిక ‘హృదయశల్యము’కు ఆయనే రచయిత. తెలంగాణాంధ్రోద్యమ చరిత్ర రెండు సంపుటాలు, మరికొన్ని చారిత్రక గ్రంధాలు రచించిండు. మాడపాటి హన్మంతరావు మంచి వక్త. మహోన్నత వ్యక్తి. ఒక్క మాటల చెప్పలంటే ఆయన ఒక గొప్ప సంస్థ.






ఏప్రిల్ 5th, 2007 at 4:06 am
చాలా చాలా బావునంది.