సురవరం ప్రతాపరెడ్డి ప్రత్యేక అధ్యాయం
నవంబర్ 19th, 2006 by డిస్కవర్ తెలంగాణ
తెలంగాణ రాజకీయ, సాంఘీక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభా, కృషీ అనన్యమైనది. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం.
సురవరం ప్రతాపరెడ్డి 28 మే 1896 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటికాలపాడు లో జన్మించిండు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి పండితుడు. భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. 1926 లో ఆయన నెలకొల్పిన ‘గోలకొండ పత్రిక’ తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పి కొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది. తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి ధీటుగా 350 కవుల రచనలతో ‘గోలకొండ కవుల సంచిక ‘ ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పిండు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది.
ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘీక చరిత్ర’కు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. ‘సురవరం ప్రతాపరెడ్డి కథలు’ నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. ‘హైందవ ధర్మ వీరులు’, ‘హిందువుల పండుగలు’, ‘రామాయణ కాలం నాటి విశేషాలు’ మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. రాజకీయ సాంఘీక ఉద్యమంగా సంచలనం కలిగించిన ‘ఆంధ్రమహాసభ’ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి. న్యాయవాదిగా ఆయన జీవితం ప్రారంభించినప్పటికీ రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. 25 ఆగస్టు, 1953 నాడు ఆయన దివంగతుడైనాడు.





