తెలంగాణ ‘గొడవ’కు గొంతెత్తిన కాళోజి
నవంబర్ 19th, 2006 by డిస్కవర్ తెలంగాణ
తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి. రాజకీయ సాంఘీక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం రాసి ప్రజాకవి. హక్కులడిగి ప్రజల మనిషి. ఉద్యమం నడిపి ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. పుటక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి.
కాళోజి నారాయణరావు కాళన్నగా , కాళోజిగా ప్రఖ్యాతుడు. 9, సెప్టెంబరు 1914 వరంగల్ జిల్లా మడికొండ గ్రామంల జన్మించిండు. కాళోజి రామేశ్వరరావు ఆయన అన్న, ఉర్దూ కవి. కాళోజి న్యాయవాద విద్య అభ్యసించినా వృత్తి ముందుకు సాగలేదు. హైదరాబాదుల సంచరించినా హనుమకొండలనే ఆయన జీవితం. కవిత్వం రాసినా ప్రజా చైతన్య మార్గమే ఆయన లక్ష్యం. రాజకీయాలు ఆయన ప్రాణం.
తెలంగాణల నిజాం జమానాల నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించిండు. ఆర్యసమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు, అన్నీ కాళోజి భాగం పంచినయి. సహ యువకుల్ని చైతన్యంలకి మళ్లించేటోడు. గాంధీ అహింసామార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించిండు. నిజాం వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టిండు. నిజాం ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కారం విధించిండు. కాళోజి మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించిండు. 1939ల, 1943ల రెండుసార్లు జైలుకి పోవాల్సివచ్చింది.
మరాఠీ, ఆంగ్లం, ఉర్దూ భాషల్ల పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలు తెలుగులకి అనువదించిండు. ‘కాళోజి కథలు’, ‘నా గొడవ’, ‘జీవన గీత’ మొదలైనవి ఆయన రచనలు.
ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణంల కాళోజి భాగం ఉంది. పి.వి.నరసిం హారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంల, రాజకీయాలల్ల మార్గదర్శనం చేసిండు. విశాలాంధ్ర సమస్యలు గమనించి ఆయన 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల కలిసిండు. అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించిండు. బూటకపు ప్రజాస్వామ్యాన్ని, కోస్తా ఆధిపత్యాన్ని వ్యతిరేకించిండు. 13, నవంబరు 2002న కాళోజి మరణించినా తెలంగాణ ప్రజలకు ఆయన నిరంతర స్ఫూర్తి.





