భిన్న సంస్కృతుల కేంద్రం హైదరాబాద్ సంస్థానం
నవంబర్ 23rd, 2006 by డిస్కవర్ తెలంగాణ
- బి. అనిల్ కుమార్
బ్రిటిష పరిపాలనలో స్వయం ప్రతిపత్తి అనుభవించిన 556 సంస్థానాల్లో అతి పెద్దది, ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. కుతుబ్ షాహీల గోలకొండ రాజ్యాన్ని స్వీయ దండయాత్రలో చేజిక్కించుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఒకటవ ఆసఫ్ ఝాను 1713లో డక్కను సుబేదారుగా నియమించాడు. నిజాం ఉల్ముల్క్ అన్న బిరుదును స్వీకరించి మొఘల్ గవర్నర్గా గోలకోండ రాజ్యాన్ని చేపట్టిన ఆసఫ్ఝా ఢిల్లీ పీఠంపై సంక్షోభం నెలకొన్న సమయంలో స్వతంత్ర్యం ప్రకటించుకోవడం ద్వారా 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు.
హైదరాబాద్ రాష్ట్రం భారత దేశానికి నడీబొడ్డున వింధ్య పర్వత పంక్తులకు దక్షిణాన ఉంది. సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తున ఉన్న దక్కను పీఠ భూమి ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో అత్యధిక ప్రాంతం. 82698 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో పంచకోణాకృతిలో ఉన్న ఈ రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, ముఖ్య నదులు. వీటికి మంజీర, ప్రాణహిత, తుంగభద్ర, మానేరు, భీమ, డండి, మూసితో పాటు అనేక చిన్నచిన్న ఉపనదులు ప్రవహిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో తెలంగాణ. మరాట్వాడ, కర్నాటక ప్రాంతాలు ముఖ్యమైనవి. రాష్ట్రం పొడవు పశ్చిమోత్తరాన ఉన్న ఔరంగాబాద్ నుండి ఆగ్నేయంగా ఉన్న వరంగల్లుకు 350 మైళ్ళు, ఔరంగాబాద్ నుండి దక్షిణాన ఉన్న రాయచూరుకు 380 మైళ్ళు. భాషాపరంగా చూస్తే నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం సగానికన్నా అధికం. 49,502 చదరపు మైళ్ళ వైశాల్యం ఉన్న తెలంగాణ ప్రాంతంలోని గ్రామాల సంఖ్య 10,095. ఇది అత్రాఫ్ బల్దా, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర, నల్లగొండ, వరంగల్లు, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలుగా విభజింపబడి ఉండేది. మరాట్వాడా ప్రాంతంలో నాలుగు జిల్లాలు ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బనీ, కర్నాటక ప్రాంతంలో నాలుగు జిల్లాలు గుల్బర్గ, బీదర్, రాయచూర్, ఉస్నాబాద్ ఉండేవి. హైదరాబాద్ రాష్ట్ర జనాభా కోటి 82 లక్షలు. అందులో కోటి పైచిలుకు తెలుగు ప్రజలు కాగా 40 లక్షల మంది మరాఠీయులు, 20 లక్షల మంది కన్నడిగులు, 20 లక్షల పైచిలుకు హిందీ, ఉర్దూ భాష మాట్లాడేవారు.

నాటి హైదరాబద్ రాష్ట్ర విస్తీర్ణంలో దాదాపు పది శాతం నిజాం స్వంత జాగీరుగా ఉండేది. దీనిని సర్ఫెఖాను అని పిలిచేవారు. సర్ఫెఖాన్ ద్వారా నిజాం స్వంత ఖజానాకు వచ్చే ఆదాయం 250 లక్షల పైచిలుకు, నిజాం స్వంత జాగీరు విస్తీర్ణం 8100 చదరపు మైళ్ళు కాగా రాజబంధువులైన పాయెగాల జాగీర్ల విస్తీర్ణం 3262 చదరపు మైళ్ళు. హైదరాబద్ రాష్ట్రంలో ఇతర చిన్నా, పెద్ద రాజుల సంస్థానాలు, వ్యక్తుల 11వేల చదరపు మైళ్ళ భూమి ఉండేది. ఈ లెక్కన 22,362 చదరపు మైళ్ళు అనగా 40.79 శాతం కొన్ని కుటుంబాల చేతుల్లోను, 60,336 చదరపు మైళ్ళు అనగా 59.21 శాతం భూమి ప్రభుత్వ ఆధీనంలోను ఉండేది. నిజాం ప్రబుత్వం రాజ్యంలోని మొత్తం జాగీర్లు 1148. ఇందులో లక్ష రూపాయలపై ఆదాయంగల జాగీర్లు 11. ఇవి వనపర్తి, గద్వాల, అమరచింత, జటప్రోలు, దోమకొండ, నారాయణపేట ముఖ్యమైనవి. 50వేల నుండి లక్ష వరకు ఆదాయం ఉన్న సంస్థానాలు 17, వీటిలో ముఖ్యమైనవి గోపాలపేట, అనగొంది, రాజపేట, దుబ్బాక, పాపన్నపేట, సిర్నాపల్లి సంస్థానాలు. తెలంగాణ ప్రాంతపు భూవైశాల్యం 2 కోట్ల 66 లక్షల ఎకరాలు. దీనిలో వివిధ రకాలుగా సాగుచేస్తున్న భూమి 92 లక్షల ఎకరాలు కాగా పడావుగా ఉన్న బీడు భూమి 40 లక్షల ఎకరాలు. తెలంగాణలోని గ్రామాల సంఖ్య 10,095. ఇందులో అత్రాఫ్ బల్దా కింద 879 గ్రామాలు, నిజామాబాద్ జిల్లా లో 751, మెదక్ జిల్లలో 928, మహబూబ్ నగర్ జిల్లాలో 1429, నల్లగొండ జిల్లలో 1256, వరంగల్లు జిల్లలో 1472, కరీంనగర్ జిల్లలో 1237, అదిలాబాద్ జిల్లలో 2143 గ్రామాలు ఉన్నాయి.
నిజాం వంశపాలకులు పరిపాలనా కాలం
1724-1748 : మీర్ ఖమ్రుద్దిన్ (నిజాం ఉల్ ముల్క్, ఆపష్ ఝా)
1748-1751 : మీర్ అహ్మద్ ఖాన్, నాసిర్ జంగ్
1750-1751 : ముజఫర్ జంగ్
1751-1761 : సలాబత్ జంగ్
1762-1803 : నిజాం అలిఖాన్
1803-1829 : సిఖిందర్ ఝా
1829-1857 : నసీరుద్దౌలా
1857-1869 : అఫ్జలుద్దౌలా
1869-1911 : మీర్ మహబూబ్ అలిఖాన్
1911-1948 సెప్టెంబర్ 18 : మీర్ ఉస్మాన్ అలీఖాన్
( 1998, వార్త సౌజన్యంతో )






జనవరి 27th, 2008 at 8:34 am
[…] భిన్న సంస్కృతుల కేంద్రం హైదరాబాద్ సం… […]