మరో బ్రౌను
ఫిబ్రవరి 16th, 2007 by డిస్కవర్ తెలంగాణ
గోండు భాషాభివృద్ధికి నడుం కట్టిన విదేశీయుడు. కుటుంబంతో నాలుగేళ్లుగా ఆదిలాబాద్ అడవుల్లో జీవనం.
20 ప్రాథమిక పాఠశాలల్లో గోండు మాధ్యమంలో బోధన. నిఘంటువు, జీవితచరిత్రలు, పాఠ్యపుస్తకాల రూపకల్పన.
ఆదిలాబాద్-న్యూస్టుడే ఈనాడు : ఆంగ్లదేశంలో పుట్టి ఆంధ్రరాష్ట్రం వచ్చి… తెలుగు భాషనుఅభివృద్ధి చేశారు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగువాడిగా పుట్టి సవర భాషకు ప్రాణం పోశారు గిడుగు రామమూర్తి. వీరి కోవలోనే మరో విదేశీయుడు గోండు భాషపై మమకారం పెంచుకున్నారు. మన రాష్ట్రంలోనే దాన్ని బతికించడానికి కంకణం కట్టుకున్నారు. గోండు భాషలో నిఘంటువులు, పుస్తకాలు రచించడంతో పాటు ప్రాథమిక విద్యాబోధననూ ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లాలో గోండు తెగవారికి మార్క్పెన్నీ ఒక ఆరాధ్యదైవం. ఎందుకంటే ఆయన వారి భాషకు ప్రాణం పోశారు. వారి పిల్లలు మాతృభాషలోనే చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ఇదంతా చేయడానికి ఆయన్ని ప్రోత్సహించిన అంశం ఒక్కటే… అంతరించిపోతున్న భాషలపై అంతులేని ప్రేమ. ఆయన ఆదిలాబాద్ అడవుల దాకా రావడం వెనుక పెద్దకథే ఉంది. పేరుకు న్యూజిలాండ్ దేశీయుడే అయినా ఆయన భారతదేశంలోనే పుట్టారు. న్యూజిలాండ్కు చెందిన మార్క్పెన్నీ తల్లిదండ్రులు బెంగుళూరులో ఉద్యోగం చేసేవారు. అప్పుడే వారికి పెన్నీ జన్మించారు. ఇంటర్ వరకు ఇక్కడే చదివారు. ఆస్ట్రేలియా, యూరప్లలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తయ్యే సరికి భాషా పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. ఆ సమయంలోనే తన మాతృదేశానికే చెందిన ‘సమ్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లింగ్విస్టిక్స్‘ (సిల్) అనే స్వచ్ఛంద సంస్థలో చేరారు. అంతరించిపోతున్న భాషల అభివృద్ధి కోసం కృషిచేసే ఈ సంస్థ సభ్యులు దాదాపు 6వేల మంది ప్రపంచ వ్యాప్తంగా 2వేల భాషలపై పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా పెన్నీ భారత్లోని గోండు భాషను ఎంచుకున్నారు. దాని పరిరక్షణ కోసం భార్య జొహన్నా పెన్నీ, ముగ్గురు పిల్లలు అభి, ప్రియ, కరీనాలతో కలిసి నాలుగేళ్ల క్రితం ఆదిలాబాద్లో స్థిరపడ్డారు.
పునరుజ్జీవనం
భారతదేశంలో అంతరించిపోతున్న భాషల్లో గోండు ఒకటి. ఆదిలాబాద్ జిల్లాలోనే పది లక్షల మంది గోండు మాట్లాడుతుండగా… ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని గిరిజనులతో కలిపి మొత్తం 30 లక్షల మందికి ఇదే మాతృభాష. దీని అభివృద్ధి కోసం 1942-43లోనే హెమన్డార్ఫ్ అనే విదేశీయుడు ఒక ఉద్యమంలా కృషిచేశారు. ఒకరకంగా చెప్పాలంటే పెన్నీ దాన్నే పునరుద్ధరించారు. తెలుగు, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడే ఆయన గోండు కూడా పూర్తిగా నేర్చుకున్నారు. దీనిపై పరిశోధనల్లో భాగంగా ఆదిలాబాద్ అడవుల్లో నాలుగేళ్ల పాటు విస్తృతంగా పర్యటించారు. గోండును రాబోయే తరాలకు అందించడం కోసం నిఘంటువును, ప్రాథమిక విద్య కోసం పాఠ్య పుస్తకాలను, కథలను, గోండు జాతి నుంచి తొలి ఐఏఎస్ అధికారి మడావి తుకారాం వంటివారి జీవిత చరిత్రలను, భాషా బోధన పుస్తకాలను రచించారు. గోండు నిఘంటువును తెలుగు, హిందీ, ఇంగ్లీషు లిపులలో రూపొందించారు. ఆయన రచించిన పాఠ్యపుస్తకాలతో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ప్రయోగాత్మకంగా సిర్పూర్, పాలగూడ, రామగూడ, కామాయిపేట్, వేండిజల, గౌరి తదితర ప్రాంతాల్లో 20 ప్రాథమిక పాఠశాలల్లో గోండు మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించారు.
ఫలితం… విజయం
గోండుపై చేస్తున్న కృషిలో ఫలితాల గురించి పెన్నీని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పరు. ఈ ప్రశ్నను ఇక్కడి పిల్లలను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అడగమంటారు. ఎందుకంటే… గోండు మాధ్యమంలో బోధన మొదలయ్యాక విద్యార్థుల హాజరు శాతం 95-99 శాతానికి చేరింది. పాఠాలను పిల్లలు సులువుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ విజయంతో గోండు మాధ్యమాన్ని జిల్లా అంతటా ప్రారంభించడానికి పెన్నీ ప్రయత్నిస్తున్నారు. ఆయన కృషిలో అడుగడుగునా భార్యాపిల్లల తోడ్పాటు ఉంది. వారంతా కూడా గోండును చక్కగా మాట్లాడతారు. ఇక పెన్నీ రోజూ మారుమూల గోండు తండాలకు వెళ్లి గిరిజనులను పలకరిస్తూ వారిలో భాషా చైతన్యం కలిగిస్తుంటారు. ‘ప్రాథమిక స్థాయి నుంచే విద్యను మాతృభాషలో బోధిస్తే సంస్కృతి సంప్రదాయాలతోపాటు భాష కూడా అభివృద్ధి చెందుతుంది’ అని పెన్నీ వ్యాఖ్యానించారు.
(ఈనాడు సౌజన్యం)





