ఆహ్వానం
మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- తడకమళ్ల వివేక్
మన చరిత్ర మనం రాసుకోవాల్సిన అవసరం వచ్చిందని మేం గట్టిగ నమ్ముతున్నం. మన ప్రాంతం గురించి, మన పూర్వికులు, ప్రజల స్థితిగతులు ఇంకా ఇట్లాంటి ఎన్నో సంగతులు మనకు తెల్వనీయకుండ కొందరు కుట్ర చేసిండ్రు. కొన్ని సంగతులు చరిత్రల చెప్పినప్పటికి వాటిని వక్రీకరించిండ్రు. వాండ్లు రాసిందే చరిత్ర అని మనకు చెప్పి చదివించిన్రు. శాన రోజుల వరకు మనం గూడ ఉండొచ్చు మన గతం యిదేనేమో అని నమ్మినం. మన పిల్లలకు యెనకటి సంగతులు మనం చెప్పలేని స్థితిల వున్నం. ఇప్పుడు కొన్నేళ్ల నుండి ఇట్లాంటి సంగతుల గురించి తెలుసుకొనే కోశిష్ చేస్తున్నం. మన వూరు, వాడ, ప్రభువులు, ప్రజలు, రాబడి, ఖర్చులు, కొలువులు, నదులు, నీళ్లు, పండుగలు, జాతరల గురించి మనం మాట్లాడుకుంటున్నం. కొందరు పుస్తకాలు రాస్తున్నరు. జరిగిన సంగతులు తెలుసుకున్న వాళ్లు ఇది అంత అన్యాయమని, ఊరుకున్నని రోజులు ఇట్లనే జరుగుతనే వుంటదని, దీనికి విరుగుడు సమైక్య రాష్ట్రం నుండి విడిపోవడమని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ కోరికను ఎలక్షన్లప్పుడు ఓట్లేసి చెప్పుతున్నరు.
ఈ సందర్భముల మేం కూడా మన చరిత్ర మనకు తెల్వాలని, ఆ సంగతులు ఎరుకైతనే మన ఉనికిని మనం కాపాడు కోగలుగుతమని ఆ విధంగా మన తెలంగాణ జాతి సజీవంగా ఉంటదని అనుకుంటున్నం. మన గొల్కొండ రాజుల గురించి, ఖుతుబ్షాహిల గురించి, నిజాంల గురించి మనకు స్కూల్లల్ల, కాలేజిల మనం తెలుసుకోవల్సినంత చెప్పలేదు. ఇక్కడి పోరాటాల గురించి, ప్రజల కోసం, వాళ్ల హక్కుల కోసం ప్రభువులను దిక్కరించిన వాండ్ల గురించి, ఎన్నో రంగాల్లో ఉన్న ప్రముఖుల గురించి మనం తెల్సుకోవలసినంత సమాచారం మనకు దొరకదు. మనకు ఎక్కువగా చెప్పింది ఏమిటంటే నిజాంలు నిరంకుశులని, మత ఛాందసులని. చారిత్రక సత్యాలు మరీ ఎక్కువగా వక్రీకరింపబడ్డయని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నవి. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన సంగతులు ఆ తర్వాత ఆఖరి నిజాం హోదా, ఆ నేపధ్యంలో జరిగిన హైదరాబాదు రాష్ట్ర అవతరణకు సంబంధించిన చాలా చారిత్రక సత్యాలు ఈ మధ్యనే కొన్ని వెలుగులోకి వచ్చినయి. చాలా విషయాలు ప్రభుత్వ రికార్డులలో ఉన్నవి. అయితే ఈ సత్యాలను ఒక దగ్గర చేర్చి చరిత్రను మళ్లీ రాయవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుతున్న చరిత్రలో నిజం మరుగై అణచివేత వాదుల వక్రీకరణ కనిపిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ విషయానికి ఒస్తే అమరజీవిగా పిలువబడుతున్న పొట్టి శ్రీరాములు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడి అమరుడైనట్టుగ చరిత్ర చెప్తున్నది. ఈ విషయానికి ప్రభుత్వం కూడా అధికారిక ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర అవతరణ ఉత్సవాలప్పుడు స్పష్టమవుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబరు ఒకటి 1956న ఏర్పడిన విషయం అందరికి తెలుసు. పొట్టి శ్రీరాములు నాటి మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం ఆందోళన జరిపి 1952 లోనే అమరుడైన సంగతి చారిత్రక సత్యం. అయితే ఆ ఆందోళన 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు పితామహుడుగా భావింపబడటం ఎంతవరకు సమంజసం? చరిత్రలో జరుగుతున్న ఎన్నో వక్రీకరణలకు ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అందుకే మన గతానికి సంబంధించిన సత్యాలు ఏమిటి, జరిగిన సంఘటనలు ఏమిటి, ఆ సంఘటనల నుంచి అసలు ఏమి జరిగిందని నిర్ధారణకు రావచ్చు, అనే అంశాల గురించి మనం పరిశోధించవలసిన అవసరం వున్నదని మేం అనుకుంటున్నం.
చరిత్ర సంఘటనల కూర్పుగా కనిపించినప్పటికి అన్ని సంఘటనలు చారిత్రిక సంఘటనలు కావు అనే విషయం మనకు తెలుసు. అందుకే చరిత్ర రాసే వాండ్లు వాళ్లకు కావలసిన సంఘటనలు మాత్రమే ఎంపిక చేసుకొని ఆ అవకాశాన్ని, ఆ స్వేచ్ఛను ఉపయోగించి చరిత్ర రాస్తారు. ఇప్పుడు మన ప్రాంతం చరిత్ర ఆ విధంగా ఇతరులు రాసినందు వల్ల ఆ స్వేచ్ఛ దుర్వినియోగం అయిందని మా అనుమానం.
అందుకే మనందరం కలిసి ఈ విషయం మీద మాట్లాడుకొని, బహస్ చేసి తొక్కి పెట్టిన సంఘటనలను, కొత్తగా వెలుగులోకి వచ్చిన సంఘటనలను అన్నిటిని కలిపి మన చరిత్రను రాసుకుందాం. చరిత్రలోని కొత్త కొణాలను బయటపెడదాం. మనందరి వ్యక్తిగత ఎనర్జీని సైనర్జీగా మార్చుదాం. అందుకే 4 జూన్ 2006 నాడు హైదరాబాదులోని ఫతేమైదాన్ క్లబ్బులో మీటింగు పెట్టినం. చాలా మంది వచ్చిన ఆ సభలో కొందరు చదివిన పత్రాలను, చెప్పిన అభిప్రాయాలను ఈ పుస్తకం రూపంలో మీకు తెలియజేస్తున్నం. ఈ ప్రయత్నం మేము ఆశించిన తెలంగాణ హిస్టరీ సొసైటి స్థాపనకు తోడ్పడుతుందని అనుకుంటున్నం. మీరందరు ఈ ప్రయత్నంల శరీకైతరని అనుకుంటున్నం. ఈ కృషిలో భాగస్వాములు కావాలనుకున్న వ్యక్తులు ఈ పుస్తకం వెనుక ఉన్న సభ్యత్వ దరఖాస్తుని నింపి మాకు పంపించగలరని కోరుతున్నాము.
[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]


