Feed on
Posts
Comments

- శ్రీధర్‌ దేశ్‌పాండే

‘కిసీ ఖౌమ్‌కో ఖతం కర్నాహైతో ఉస్కీ జబాన్‌ ఖీంచ్‌లో’ అన్న ఉర్దూ మాట ఈ మధ్య చాలాసార్లు విన్నాము. తెలంగాణ సందర్భానికి ఈ మాట చాలా అర్థవంతంగా అన్వయం అవుతుంది. 1956 నవంబర్‌ 1న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విలీనం అయి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన నాటి నుంచి, తెలంగాణ అంతకు ముందు అనుభవించిన రాజ్యాధికారాన్ని కోల్పోయింది. వనరుల వినియోగంపై నియంత్రణ కోల్పోయింది. మొత్తంగా తెలంగాణ ఆంధ్రకు వలస ప్రాంతంగా మారిపోయింది. వలసవాదులు ఎపుడైనా తమ ఆధీనంలో ఉన్న వలస ప్రాంతంలో రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం, తమ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం సాంస్కృతికంగా స్థానిక ప్రజలను అణిచివేతకు గురిచేశారు. స్థానిక ప్రజల భాషా సంస్కృతులను న్యూనత పరచడం, వారు అనాగరికులని ముద్రవేయడం, వారిని ఉద్ధరించడం కోసం తాము వచ్చామని చెప్పుకోవడం యూరోపియన్‌ వలసవాదులు చేసిందే. స్థానిక భాషల్ని నిర్మూలించి తమ భాషల్ని ప్రజలపై రుద్దారు. స్థానిక సంస్కృతులను, చరిత్రను పాఠ్యపుస్తకాలలో లేకుండా చేసి వారి చరిత్ర నుండి పరాయికరించారు. ఈ సాంస్కృతిక దాడి లక్ష్యం వలసవాదుల ఆధిపత్యాన్ని సవాలు చేయకుండా స్థానిక ప్రజలు వారిని పాలకులుగా, తమ ఉద్దారకులుగా అంగీకరించి లొంగి ఉండడం. 1956 నవంబర్‌ 1 తర్వాత ఆంధ్ర వలసవాదులు సరిగ్గా ఇదే తరహా సాంస్కృతిక వలసదాడిని కొనసాగించారు.

నిజానికి విలీనానికి ముందు నుంచే తెలంగాణ పట్ల ఆంధ్రులకు చిన్న చూపు ఉండదనడానికి అనేక దృష్టాంతాలు చరిత్రలో రికార్డు అయి ఉన్నాయి. అందులో ముడుంబై రాఘవాచార్యుల వారి తెలంగాణ తెలుగును ‘తౌరక్యాంధ్రం’గా ఎద్దేవా చేసిన మాటలు సుప్రసిద్ధం. అట్లానే తెలంగాణలో కవులే లేరని చెప్పడం. ఈ చిన్న చూపు విలీనం అనంతరం తీవ్రతరమైంది. రెండున్నర జిల్లాల ప్రజలు మాట్లాడే తెలుగును వ్యవహారికం పేరు మీద తెలంగాణ ప్రజల మీద రుద్దారు. ఆంధ్రుల చరిత్రనే తెలుగువారి చరిత్రగా స్థిరీకరణ చెందింది. మూడు వేల సంవత్సరాల మహోన్నత చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కల్గిన తెలంగాణ తెలుగు వారి చరిత్రలో స్థానం కోల్పోయింది. ప్రాచీన చరిత్ర మొదలుకొని, ఇటీవలి చరిత్ర వరకు తెలంగాణకు దొరకవలసిన స్థానం దొరకనే లేదు. తెలంగాణ చరిత్ర పరిశోధన మూలపడింది. తెలంగాణ చారిత్రిక, సాంస్కృతిక సంపదను పరిరక్షించడంలో పూర్తి నిర్లక్ష్యం కారణంగా అనేక విలువైన పురావస్తు సంపద చోరికి గురికావడమో విధ్వంసానికి గురికావడమో జరిగింది. తాళ పత్రాలు, ప్రాచీన గ్రంధాలు, పత్రికలు ఏవీ మిగలని దౌర్భాగ్యస్థితి. ఇటీవలి చారిత్రక ఆధారాలు సైతం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ధ్వంసం అయినాయి.

ఇది ఇట్లుండంగా తెలంగాణ చరిత్రను వక్రీకరించడం, మరుగునపరచడం మరో రకమైన సాంస్కృతిక దాడి. విజేతల చరిత్రే చరిత్ర అన్నట్లు చరిత్ర పాఠ్య పుస్తకాలు రూపొందుతున్నాయి. తెలుగు వారికి గర్వకారణంగా విజయనగర సామ్రాజ్యాన్ని చూపుతారే తప్ప తెలంగాణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలించిన కాకతీయులు మరుగున పడతారు. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలు, ఆ పోరాటంలో పాల్గొన్న నాయకులే చరిత్రకు పనికివస్తాయి తప్ప తెలంగాణలో జరిగిన నిజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, ఆ నాయకుల జీవిత చరిత్రలు చరిత్రకు పట్టపు, పైగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట లక్ష్యం విశాలాంధ్ర స్థాపన అని వక్రీకరిస్తారు. పొట్టి శ్రీరాములు అమరత్వం వల్లనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్లాటైందని అబద్దాన్ని చరిత్రగా మనకు చెబుతారు. శ్రీబాగు ఒడంబడిక చరిత్రలో భాగమవుతుందికాని పెద్దమనుషుల ఒప్పందం చరిత్రకెక్కదు. అల్లూరి సీతారామారాజు తెలుగు ప్రజలందర్కీ తెల్సిన ఆదివాసే పోరాట యోధుడే. కాని రాంజీగోండు, కొమురం భీములు చరిత్రకెక్కరు. ఇట్లా ఎన్నయినా చెప్పవచ్చు.

తెలంగాణ అనేక రాజకీయ సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన నేల. 1857 భారత ప్రధమ స్వాతంత్య్ర సమరం ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న వేళ, ఆ సమరంలో భాగం కాకుండా బ్రిటిష్‌ వాళ్లకు మద్దతునిచ్చిన నిజాం రాజ్యంలో తుర్రెబాజ్‌ఖాన్‌ నాయకత్వంలో బ్రిటీష్‌ రెసిడెన్సీపై దాడి జరిగింది. ఆ పోరాటంలో తుర్రెబాజ్‌ఖాన్‌ అమరుడైనాడు. ఆ మహత్తర ప్రతిఘటన చరిత్రకు అందకుండా పోయింది. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన రాంజీగోండు. అడవిపై, గ్రామాలపై హక్కును కోరుతూ కొమరంభీం బాబెఝరీ పోరాటం ఇటీవలదాకా ఎవరికీ తెలియని చరిత్రగా మిగిలిపోయింది. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాన్ని ఇప్పటికీ మెయిన్‌స్ట్రీమ్‌ చరిత్రకారులు గుర్తించలేదు.

ఆంధ్రప్రాంతంలో జరిగిన జాతియోధ్యమం పాఠ్యపుస్తకాలకి రాగలిగిందే కాని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ స్థాయికి చేరనేలేదు. ఆనాటి పోరాటయోధులకు ఇప్పటికీ స్వాతంత్ర సమరయోధులకు అందుతున్న పెన్షన్లు అందటం లేదు. త్యాగాలకు మారుపేర్లు అయిన 1952 ముల్కీ ఉద్యమం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చరిత్రలు సమైక్యరాష్ట్ర చరిత్రలో సముచిత స్థానాన్ని పొందే అవకాశమే లేదు.

ఇవ్వాళ తెలంగాణ సందర్భంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక అస్తిత్వ కాంక్ష ప్రభలంగా వ్యక్తమవుతున్నది. కవులు, రచయితలు, బుద్దిజీవులు తమ సాంస్కృతిక, చారిత్రిక మూలాలోకి వెళ్లి తమ అస్తిత్వ పునాదులు వెతుక్కుంటున్నారు. మరుగున పడిపోయిన మహోన్నతమైన తమ చారిత్రక సాంస్కృతిక సంపదను తవ్వి తీస్తున్నారు. చరిత్రను పునర్లిఖిస్తున్నారు. అస్తిత్వ స్పృహతో విశ్లేషించుకుంటున్నారు. వలసవాదుల వక్రీకరణలను తిరగదోడి అసలైన తెలంగాణ చరిత్రను పునర్‌నిర్మిస్తున్నారు. తెలంగాణ చరిత్ర పునర్‌నిర్మాణం అంటే పురావస్తు పరిశోధనే అన్న సంగతి తెలంగాణ చరిత్ర పరిశోధకులకు తెల్సు. ఆ కృషిలో కపిలవాయి లింగమూర్తి, విరువంటి గోపాలకిృష్ణ, సంగనభట్ల నరసయ్య, జితేంద్రబాబు, మలయశ్రీ, జయధీర్‌ తిరుమలరావు, బి.ఎస్‌. రాములు, కె. శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, ముత్యం, లోకేశ్వర్‌, ముదిగంటి సుజాతారెడ్డి, రావి ప్రేమలత, ఎన్‌. వేణుగోపాల్‌, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితర తెలంగాణ బిడ్డలు తెలంగాణ చరిత్ర పరిశోధనలో, చరిత్ర పునర్‌నిర్మాణంలో, చరిత్ర విశ్లేషణలో విలువైన పాత్రను పోషిస్తున్నారు.

అయితే ఈ కృషి వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్నది. ఈ కృషి మరింత సమన్వయంతో జరగవలసి ఉన్నది. మన ముందరున్నది పెద్ద కొండ. కొండను తవ్వడం ఒక్కరితో అయ్యేపనికాదు. పది మంది చేతులు కలపాలి. సుదీర్ఘకాలం తవ్వకం పని సాగుతూనే ఉండాలి. ఆ కృషిని, ఆ పరిశోధనను సమన్వయ పరిచేందుకే తెలంగాణ హిస్టరీ సొసైటీ అవసరమని భావించాము. ఔత్సాహికులైన కొందరం తెలంగాణ హిస్టరీ సొసైటీ అవిర్భావానికి జూన్‌ నెల మొదటివారంలో ఒక సన్నాహక సమావేశాన్ని నిర్వహించాం. స్పందన గొప్పగా ఉంది. ఈ సొసైటీ అవిర్భవించాలని, సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర పరిశోధన ముమ్మరం కావాలని, సొసైటికి తమ వంతు సహకారం అందిస్తామని హాజరయిన సభికులు వాగ్దానం చేశారు. అయితే సొసైటి సన్నాహక సమావేశానికి వేసవి సెలవుల కారణంగా విశ్వవిద్యాలయ చరిత్ర అధ్యాపకులను, డిగ్రీ కళాశాలల చరిత్ర అధ్యాపకులను, చరిత్ర పరిశోధక విధ్యార్థులను, పి.జి. విద్యార్థులను ఆహ్వానించలేకపోయాం. విస్తృతస్థాయి సమావేశం మరొకటి ఏర్పాటు చేసి చరిత్ర పరిశోధనతో సంబంధం ఉన్న అందరినీ ఆహ్వానించి తెలంగాణ హిస్టరీ సొసైటీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. సొసైటీకి ఒక మానిఫెస్టో రూపొందించి ఆమోదించుకోవాల్సి ఉన్నది. చరిత్ర పరిశోధనకే అంకితమైన వ్యక్తులే తెలంగాణ హిస్టరీ సొసైటీలో పని చెయ్యాలని మా ఆకాంక్ష. తెలంగాణ చరిత్రను విశ్లేషించడంలో, పునర్‌ నిర్మించడంలో సొసైటీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సొసైటీ పనితీరుకు అవి అడ్డంకి కాకూడదు. అన్ని అభిప్రాయాలను సొసైటీ చర్చకు పెడుతుంది. అంతిమంగా ప్రజలు అసలైన న్యాయనిర్ణేతలు.

తెలంగాణ హిస్టరీ సొసైటి వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.

[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో