వివక్ష, ఉపేక్షకు గురైన తెలంగాణ చరిత్రను పునర్నిర్మించాలి
మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- ముదిగంటి సుజాతారెడ్డి
తెలంగాణ చారిత్రక పరిశోధన సంఘం ఏర్పాటు చేసుకోవటం ఎంతో చారిత్రక అవసరం. ఆంధ్రదేశ చరిత్రను చెప్పేటప్పుడు ఆ ప్రధానపాయలో తెలంగాణ ప్రాంత చరిత్ర సంస్కృతులకు చోటు ఉండటం లేదు. చోటు కన్నా ఉపేక్షింపబడ్తున్నది. ఒక విధమైన వివక్షకు గురి అవుతున్నది. అసలయితే ఆంధ్రదేశ చరిత్రలో తెలంగాణ ఒక ఉపేక్షింపరాని భౌగోళిక స్థానంలో ఉంది. పశ్చిమ ప్రాంతాలైన గుజరాతు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల రాజులు తూర్పు సముద్రతీర ప్రాంతాన్ని వశం చేసుకోవాలంటే ముందు తెలంగాణను జయించాలి. అందుకే రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు తెలంగాణను జయించి తమ ప్రతినిధి రాజ్యాలను కాకతీయులను, ముదిగొండ చాళుక్యులను తమ సామంతులుగా నియమించి పాలించారు. పశ్చిమ చాళుక్యులకు తూర్పు చాళుక్యులకు రాజ్యాధిపత్యపు పోరుకోసం తెలంగాణలో కొలనుపాక వంటి స్థలాలు యుద్ధభూమిగా ఏర్పడ్డాయి. చోళులూ తూర్పు చాళుక్యుల పక్షం వహించి ఆ యుద్ధాలలో పాల్గొంటె కాకతీయులు పశ్చిమ చాళుక్యుల పక్షం వహించారు. కాకతీయులు స్వతంత్రులై మహాసామ్రాజ్యం నిర్మించి పాలించినప్పుడు అంతకుముందు ఇక్ష్వాకులు విష్ణుకుండినులు ఆంధ్రదేశాన్ని పాలించినప్పుడు తెలంగాణను కేంద్రంగా చేసుకునే రాజ్యాధికారం చేసారు. కాని కోస్తా ప్రాంతం రాజవంశీయులు ఎప్పుడూ తెలంగాణను స్వాధీనం చేసుకొని పాలించలేదు. శాతవాహనుల రాజ్యాధికారం కూడా కరీంనగర్ జిల్లా ధూళికట్ట, కోటిలింగాల ప్రాంతం నుంచి ఆరంభమైందని అక్కడ దొరికిన నాణాల ఆధారంగా తెలుస్తున్నది. తెలంగాణ నుంచే శాతవాహనులు పశ్చిమంగా రాజ్య విస్తరణ చేసి తర్వాత తమ రాజధానిని ఇప్పటి ఔరంగాబాదు సమీపంలో ఉన్న పైఠన్కు మార్చుకొని దక్షిణాపథ సామ్రాజ్యాన్ని నిర్మించారు.
తెలంగాణను క్రీ.శ. 8-10 శతాబ్దాల మధ్య పాలించిన వేములవాడ చాళుక్యులు లాట దేశం అంటే గుజరాతుకు చెందిన చాళుక్యశాఖకు చెందినవాళ్లు. వాళ్ల రాజ్య కాలంలో తెలంగాణ సాహిత్యం సంస్కృతి కళలలో ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. వేములవాడ చాళుక్యుల కాలంలోనే వాళ్ల ఆస్థానంలోనే వేములవాడ నగరంలో కన్నడ సాహిత్యంలో ఆదికావ్యం ‘విక్రమార్జున విజయం’ రచించబడింది. విక్రమార్జున విజయం కీర్తితో పంపమహాకవికి రెండో అరికేసరి ధర్మపురిని అగ్రహారంగా ఇచ్చాడు. పంపకవి సోదరుడు జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనంలో మూడు తెలుగు కందపద్యాలు మనోహరమైనయి ఉన్నాయి. తెలుగు ఛందస్సులో కందకు ప్రత్యేక స్థానమంది. అటువంటి కందాలు మొదటిసారిగా మనకు ఈ శాసనంలోనే దర్శనమిచ్చాయి. వేములవాడ చాళుక్యులు ఆ తర్వాత కాకతీయులు జైనమతాన్ని అభిమానించారు. కాబట్టి కోస్తా ప్రాంతంలో బౌద్ధం ఎక్కువగా వ్యాపిస్తే తెలంగాణలో జైనం ఎక్కువ అభిమానింపబడింది. తెలంగాణలోనూ ఫణిగిరి, గాజులబండ వంటి ప్రదేశాల్లో బౌద్ధమతావశేషాలు లభించాయి. కాని జైనం కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ ప్రభావాన్ని కలిగి వుంది. ఆ జైనాన్ని పారదొలటానికే తెలంగాణలో క్రీ.శ. 12-14 శతాబ్దాల్లో వీరశైవం ప్రవేశించి విజృంభించింది. తెలుగులో వీరశైవ సాహిత్యానికి తెలంగాణ కేంద్రంగా ఉండింది. పాల్కురికి సోమనాథుడు ఓరుగల్లు సమీపంలోని పాలకుర్తివాడు. వేదాధ్యాయాలకు భాష్యం వ్రాసి వీరశైవాన్ని వైదిక బద్ధం చేసిన పండితుడు కవి సోమన. తెలుగు భాషలో సంస్కృత సమాసాలను నుడికారాలను గుప్పించకూడదని ప్రజల అవగాహనకు దగ్గరగా వుండే దేశీయమైన తెలుగునే వాడాలని ‘జానుతెనుగు’ పేరుతో వీరశైవకవులు భాషోద్యమం నడిపి తెలుగు భాష సొబగులను నిర్ణయించింది ఈ తెలంగాణ భూమిలోనే.
ఆంధ్ర ప్రాంతమంతా విజయనగర సామ్రాజ్యంలో భాగమై ఉన్నప్పుడు తెలంగాణ కుతుబ్షాహీల పాలనలో ఉంది. అయినా అప్పుడుకూడ అచ్చ తెలుగు కావ్యాలు రచించబడినాయి. రామదాసు వంటి వాగ్గేయాకారుడు జన్మించి అచ్చమైన తెలుగు నుడికారంతో కూడిన పదాలను రచించాడు. ఆ కాలంలో తెలుగే ఉర్దూపై తన ప్రభావాన్ని ప్రసరింపజేసింది. తెలుగు ప్రభావంతోనే ఉర్దూలో ‘దక్కనీ’ అనే ‘బోలీ’ బయలుదేరింది.
ఆంధ్రదేశమంతా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ఆసఫ్జాహీల పాలనలో ఉంది. అప్పుడే కొంతకాలం తెలుగుకు గ్రహణం పట్టింది. తెలుగు ప్రజలు మాతృభాషకు సాహిత్యానికి దూరమయ్యారు. కాని అది ఎంతోకాలం జరుగలేదు. ఆంధ్రోద్యమంతో తెలంగాణ ప్రజలు తమ భాషా సాహిత్యాలను కాపాడుకున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశమంతా గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం జరిపి స్వాతంత్య్రం తెచ్చుకుంటే తెలంగాణ ప్రజలు తమ స్వాతంత్య్ర పోరాటం తాము చేసుకోవలసి వచ్చింది. నిజాం వ్యతిరేక పోరాటంతో పాటు భూస్వాములకు వ్యతిరేకంగాను పోరాటం చేసి తెలంగాణ ప్రజలు భారతదేశంలో ఎక్కడాలేని చరిత్రను లిఖించారు. ఆ పోరాటాల కాలంలో తెలంగాణ అపురూపమైన పాటలు, కథలు, కవిత్వం వివిధ ప్రక్రియల్లో సాహిత్యాన్ని సృష్టించుకుంది. అయితే ప్రధాన పాయలో ఆంధ్రప్రాంతాల్లో సాంస్కృత పునరుజ్జీవనం కాలంలో చరిత్ర సాహిత్యాల్లో జరిగిన పరిశోధనల్లో తెలంగాణ ఉపేక్షింపబడింది. ఇక్కడ ఏ చరిత్ర సాహిత్య సృష్టి జరుగనట్లుగానే అక్కడి పరిశోధకులు వ్రాతలు వ్రాసారు. పోతన, మొల్ల వంటి కవులను తెలంగాణేతరులుగా చూపించారు. తెలంగాణ చరిత్ర సాహిత్య వైభవాలను గుర్తించలేదు. తెలంగాణ విమోచనోద్యమం కాలంలో తెలంగాణ ప్రజలకు సోదర ప్రజల నుంచి ఎటువంటి సానుభూతి మద్దతులు లభించలేదు. పోగా వివక్షకు భాషా విషయంలో న్యూనతకు గురిచేయబడ్డారు. ఆ విధంగా ఉపేక్షకు గురయిన తెలంగాణ చరిత్రను పునర్నిర్మించుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. తెలంగాణ భౌగోళిక రాజకీయార్ధిక సందర్భంలో పుట్టి వికసించిన చరిత్ర సంస్కృతులను అధ్యయనం చేయవసినది ఎంతో ఉంది.
తెలంగాణ అంటే నాకు రెండు తెలంగాణలు కన్పిస్తున్నాయి. ఒకటి రాజకీయ నాయకులు తమ స్వార్థలాభాలకు వాడుకుంటున్న తెలంగాణ. రెండు నిజంగా అభిమానిస్తున్న ప్రేమిస్తున్న ప్రజలకు సంబంధించిన ప్రజల హృదయాల్లో నివసిస్తున్న తెలంగాణ. ఈ రెండో తెలంగాణ అభిమానంతో కృషి జరగాలె అని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగానే ఈ సంస్థ చరిత్ర పరిశోధనకు పూనుకుంటుదని మేమంతా దానిలో భాగస్వాములమవుతామని ఆశిస్తున్నాను.
[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]





