తరతరాల తెలంగాణ ఉద్యమంపై గొంతెత్తిన ‘పాలపిట్ట’
ఆగస్టు 6th, 2007 by డిస్కవర్ తెలంగాణ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనకోసం జరుగుతున్నఉద్యమ విస్తృతిని వివరించేదే ‘బతుకమ్మ పాట, పాలపిట్ట పాట’లని విరసం నాయకుడు వరవరరావు అభివర్ణించారు. సోమవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై వరవరరావు రచించిన ‘పాలపిట్ట పాట’_ ప్రత్యేక తెలంగాణ పోరాట పాటలు, ‘తెలంగాణ వీరగాథ – ఏడేడు తరాల కథ: బతుకమ్మ పాటల‘ సిడిల ఆవిష్కరణ సభ జరిగింది.
ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ ఈ పాటల్లో మూడువేల సంవత్సరాల తెలంగాణ చరత్ర ఉందన్నారు. వలస దోపిడీలను ప్రశ్నిస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించేందుకు ఈ పాటలు దోహదపడగలవని వరవరరావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అందరినీ కదిలిస్తుందని చెప్పారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అంటున్నప్పటికీ ప్రజారాజ్యం రాకపోగా వలసలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అతి పెద్ద శత్రువులు కాంగ్రెస్, కమ్యూనిస్టులని అన్నారు. తెలంగాణవీరగాథ- ఏడేడు తరాల బతుకమ్మ పాటల సిడిని ఆవిష్కరించిన రచయిత్రి దేవకీదేవి మాట్లాడుతూతెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆమె విచారాన్ని వ్యక్తం చేసారు. బతుకమ్మ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఆవిష్కరించిందని ఆమె పేర్కొన్నారు. ‘పాలపిట్ట పాట- ప్రత్యేక తెలంగాణ పోరాట పాటలు’ సిడిలను ఆవిష్కరిచిన పియుసిఎల్ నాయకులు ఎంటిఖాన్ మాట్లాడుతూ తెలంగాణ జన జీవితాన్నిఅంతా ఇంత బలంగా తమలో రంగరించుకున్న బతుకమ్మ పాటలోకి తెలంగాణ చరిత్ర ఇంతవరకు ఎక్క లేదని అన్నారు. సభకు అద్యక్షత వహించిన ప్రముఖ కవి కె. శివారెడ్డి మాట్లాడుతూ విశాలాంధ్ర ఏర్పడినప్పుడే నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు వచ్చిన అనుమానాలు తదనంతర కాలంలో నిజమయ్యాయని చెప్పారు. ఈ సభకు దిశ రీడర్స్ అండ్ రైటర్స్ సొసైటీ నాయకుడు బాల్ రెడ్డి ఆహ్వానం పలికారు. సభలో సంధ్య, ప్రభాకర్, విమల, శ్రీను, పుష్ప, వెంకట్ లు వరవరరావు రచించిన పాటలను ఆలపించారు.
(ఆగస్ట్ 6 2007, వార్త సౌజన్యంతోటి)





