నిజామూ, నిజమూ!
నవంబర్ 28th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- తెలకపల్లి రవి
‘చుట్టు ముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ, నీవుండే హైద్రాబాదు, దాని పక్కా గోలకొండ, గోలకొండ ఖిల్లా కింద, గోలకొండ ఖిల్లా కింద, నీ గోరి కడ్తము కొడకో నైజాము సర్కరోడా!‘ ఎప్పుడు ఎక్కడ ఎవరు పాడినా ఉర్రూతలూపే పాట. సుప్రసిద్ధమైన ఈ ప్రజా గీతాన్ని సాహిత్య శిల్పానికి ఉదాహరణగా తరచూ చెబుతుంటాను. ఎందుకంటే ఇందులో మొదటగా భూగోళ శాస్త్రంలా ఊళ్ళ పేర్ల జాబితా ఇస్తున్న కవి యాదగిరి ఒక్కసారిగా దాన్ని మలుపు తిప్పుతాడు. నిజాం నిరంకుశత్వానికి గోరి కట్టిస్తాడు. అయితే మహత్తర తెలంగాణా సాయుధ పోరాటం తర్వాత అరవై ఏళ్ళకు తెలంగాణా పేరు చెప్పుకునే నాయకులొకరు వచ్చి ఆ నిజాం సమాధికి మోకరిల్లుతారని ఆ వీరులూ గాయకులూ కలలో కూడా అనుకుని ఉండరు! వివాదాస్పద పోకడలతో గందరగోళపర్చడంలో పెట్టింది పేరైన కెసిఆర్ అరుదైన ఆ ఘనత సాధించారు! ఇందులో ఆయన వ్యూహం ఏమైనా కావచ్చు. మతపరమైన ఓట్ల పాచిక కావ చ్చు. కాని ఏది ఎలా వున్నా తెలంగాణాకు తద్వారా మొత్తం తెలుగు ప్రజలకు భారతీయులకు కూడా ప్రపంచ విప్లవ పటంలో స్థానం కల్పించిన మహత్తర వారసత్వానికి కళంకం తెచ్చిపెట్టారు.
అమ్మను తిట్టొద్దురా అంటే అవ్వనుకున్నాను అన్నట్టు నిజాంకు జేజేలర్పించడం ఒకటైతే దాన్ని సమర్థించుకోవడానికి చేసిన వాద నలు మరింత దారుణమైనవి. రాజధానిలో పాలనా సంబంధమైన భవనాలన్ని నిజాం కట్టించినవేనట. ముఖ్యమంత్రి కూడా అలాటి భవనంలోనే కూచుని పాలిస్తున్నాడట. అక్కడికి నిజాం జేబులోంచి తీసి ఇచ్చినట్టు కెసిఆర్ భావిస్తున్నట్టుంది. భయానకమైన దోపిడీ పీడ నలతో ప్రజల రక్తమాంసాలు పిండి కూడబెట్టిన సొమ్ము అది. సర్ఫే ఖాస్ పేరుతో నూటికి పది వంతులు భూమి ఆయన స్వంత కమ తంగా ఉండేది. ఆ రోజుల్లోనే హైదరాబాద్ సంస్థానం నుంచి ఏటా రెండు కోట్ల రూపాయలు ఆయన కుటుంబ ఖర్చుల కింద తీసుకునే వారు. అంతే తప్ప ప్రజల బాగోగుల కోసం బాధ్యతగా ఖర్చు చేసింది చాలా చాలా నామమాత్రం. తను నివసించే హైదరాబాద్ నగరం తప్ప గ్రామీణ ప్రాంతాలు ఆయనకు పట్టింది లేదు. కొంత మంది అనుకుంటున్నట్టు తెలంగాణాలో నీటిపారుదల వగైరాల కోసం చేసిందేమీలేదు. అప్పటి కాలపు అన్ని కట్టడాలలాగే ఆయన కట్టినవి కూడా కొన్ని ఉండటం పెద్ద ఘనత కాదు.
అందరినీ ఆవేదనకు గురిచేస్తున్న తెలంగాణా వెనుకబాటుకు మూలకారణమైన ఈ భయానక భూస్వామ్య పాలనని మర్చిపోతే అంతకన్నా ఘోరం ఉండదు. వ్యక్తిగా నిజాం సమాధి చూడటం కాదు- ఒకానొక నిరంకుశ క్రూర వ్యవస్థకు ప్రతినిధిగా ఆయన పట్ల ఎలాటి వైఖరి కలిగి ఉండాలన్నది ఇక్కడ సమస్య. బ్రిటిష్ వారి కాలంనాటి పేర్లు కొన్ని మార్చినా కొన్ని మారలేదు. అలాగే నిజామాబాద్, నిజాం కాలేజి, నిజాం షుగర్స్తో సహా చాలా పేర్లు మార్చలేదు. రాజకీయ సమస్యను పేర్ల తో భవనాలతో ముడిపెట్టి గందరగోళ పర్చడం తగని పని. వ్యక్తిగా కూడా ఆఖరి నిజాం జీవిత చరిత్రలు చదివితే ఆయన సంపదలు, ఖరీదైన వస్తు సేకరణ గురించే ఎక్కువగా ఉంటుంది తప్ప ప్రజా హితం గురించిన ఆలోచనలు కనిపించవు. రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం రజాకార్లను ప్రయోగించి రాక్షస కాండ సాగించడం నిజాం పాపాల చిట్టాలో ఆఖరున వస్తుంది. అది ప్రజల రక్తమాంసాలు పీల్చిన క్రూర నిరంకుశ పాలన. పైగాలు, జాగీ ర్దార్లు, ఇజారాదార్లు, మక్తేదార్లు, ఈనాందార్లు, దేశ్ముఖ్లు రకరకాల పేర్లతో దొరలు వేల లక్షల ఎకరాలు కలిగి ఉండేవారు. వారికే పన్ను వసూలు అధికారం. అదిగాక వెట్టిచాకిరీ.
భూస్వాముల పొలాలు సాగయ్యాకే ఇతర రైతులు నీరు పెట్టుకోవాలి. వ్యవసాయ కార్మికులు ముందు భూస్వాముల పొలాల తర్వాతే ఇతరుల నాట్లు వేయాలి. పచ్చిబాలింతలైనా సరే, పాలు పిండి చూపితే తప్ప పనినుంచి పోవ డానికి వీల్లేదు. చాకలి బట్టలు ఉతకడంతో పాటు దొర గడీ ముందు రోజూ నూరు బిందెల కల్లాపి చల్లాలి. క్షురకులు క్షవరాలు చేయాలి. వారి కచ్చడాల ముందు ఉరకాలి. మూటలు మోయాలి. పక్కలు వేయాలి. వారి ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఊళ్లకు వెళ్లాలి. యాదవులు గొర్రెలను ఇవ్వాలి. దొరల కన్నుపడిన ఏ స్త్రీనైనా గడీలల్లోకి తీసుకు పోతారు. అధికారులకు వారిని నజరానాగా సమర్పిస్తారు. శ్రమనూ, శరీరాలనూ కూడా కొల్లగొడతారు. ఇదిగాక కనీస ప్రజాస్వామిక హక్కులు లేకుండా మతపరమైన, భాషా పరమైన వివక్ష. ఇదంతా చూడకుండా ఆయనకు భజన కీర్తనలు ఆలపించేవారి ప్రజాస్వామిక చైతన్యాన్ని ఏమనగలం? ఈ పీడన సహించలేకనే ఆంధ్ర మహాసభ నాయకత్వాన మొదలైన పోరాటంలో ప్రజలు గడీలను ఆక్రమించి అప్పుల పత్రాలు చించేశారు. వారి పొలాలను ఆక్రమించారు.
దొరల గూండాలు, నిజాం సైన్యాలు, రజాకార్లు, పోలీసులపై స్త్రీలు పిల్లలతో సహా జనం ప్రవాహంగా కదిలారు. వడిశాల, కారంపొడి, రోకలిబండ కూడా ఆయు ధాలైనాయి. ఈ కమ్యూనిస్టుల దగ్గర ఏ మహత్యమున్నదో కాని బానిసను దొరా అన్న వానితో బందూకు పట్టించారని వారి భావాలతో ఏకీభవించని సురవరం ప్రతాపరెడ్డి వ్యాఖ్యానించారు. కాని ఇప్పుడు దొరల వరవడి నుంచి వచ్చిన అవకాశవాద నేతలకు నిజాం ముందు ఆ పోరాటం చాలా చిన్నదిగా కన్పిస్తోంది! నాలుగువేలమందికి పైగా రైతు గెరిల్లాలు ఈ పోరాటంలో అమరులైనారు. పదివేల మంది నిర్భంధాలతో జైలు శిక్షలనుభవించారు. యాభై వేలమంది చిత్రహింసలను ఎదుర్కొన్నారు. వేలాది గ్రామాలు దాడులకు గురైనాయి. మహిళలపై వేల సంఖ్యలో అత్యాచారాలు జరిగాయి. మొదట నిజాం రజాకారు సాయుధ మూకల దాడులకు కొనసాగింపుగా 1948 సెప్టెంబరు 12న నెహ్రూ ప్రభుత్వ సైన్యాలుదిగాయి.
సంస్థానాన్ని విలీనం చేసుకుని నిజాంను రాజప్రముఖ్గా గుర్తించి ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టాయి.
ఆ పోరాటం గురించి ఎన్ని దుష్ప్రచారాలు జరిగినా 1952 ఎన్నికల్లో ప్రజలు కమ్యూనిస్టులకు ఘన విజయాలు చేకూర్చి వాటికి సమాధానమిచ్చారు. అవి ఇప్పటికీ వారి బలమైన కేంద్రాలే. తెలంగాణా విముక్తి అంటూ బిజెపి సంఘ పరివారం దాన్ని ముస్లిం వ్యతిరేక కోణం నుంచి చిత్రిస్తోంది. నిజాంను కీర్తిస్తే ముస్లింలను మంచి చేసుకోవచ్చని కెసిఆర్ పాచికలు వేస్తున్నారు. ఇవి రెండూ పాక్షిక దృక్పథాలే.వాస్తవానికి తెలంగాణా పోరాటంలో బందగీ వంటి సామాన్య ముస్లిం రైతుల నుంచి మేధావుల వరకూ పాల్గొన్నారు. తెలంగాణా పోరాటం ప్రారంభం నుంచి చివరి వరకూ ఏ ప్రాంతీయ తేడాలు లేకుండా తెలుగు ప్రజలందరి పోరాటంగా విశాలాంధ్ర కమ్యూనిస్టు కమిటీ నాయకత్వంలో జరిగింది. తెలుగు ప్రజల ఐక్య పోరాటాలు, సూత్రబద్ధమైన రాజకీయాలు నచ్చని వారికి ఆ పోరాటం గొప్పదిగా కనిపించదు. దాశరథి భాషలో పిశాచిగా తీగలను తెంచి అగ్నిలో పారవైచిన జన్మ జన్మాల బూజు వంటి నిజాం రాజే గొప్పగా కన్పిస్తాడు. ఎవరు ఏం చెప్పినా నిజాం పాలనలో నరక బాధలనుభవించిన ప్రజలకు నిజం తెలియదనుకోవడం అవివేకం.





