వితండవాదం : సంపాదకీయం
నవంబర్ 29th, 2007 by డిస్కవర్ తెలంగాణ
వర్తమానంలో సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికీ, నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికీ గతాన్ని సవ్యంగా అర్థం చేసుకోవాలి. గతాన్ని అపార్థం చేసుకొని వర్తమానాన్ని సంక్షోభంలోకి నెట్టుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. రాజకీయ నాయకులు ప్రతి అక్షరం ఆచితూచి మాట్లాడాలి. చరిత్రను బోధించే అధ్యాపకుడు లేదా చరిత్రను అన్వయించే రచయిత హైదరాబాద్ నిజాంపైన ఎటువంటి అభిప్రాయం వెలిబుచ్చినా పెద్ద నష్టం ఉండకపోవచ్చు. నిజాం పాలన గురించి ప్రముఖ కవి కాళోజీ మాట్లాడినంత వివాదాస్పదంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరరావు (కేసీఆర్) మాట్లాడటం ఆయనకు కానీ, ఆయన పార్టీకి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ శ్రేయస్కరం కాజాలదు. రాబోయే మునిసిపల్ ఎన్నికలనో, అసెంబ్లీ ఎన్నికలనో దృష్టిలో పెట్టుకొని ముస్లిం ఓటర్ల హృదయాలను గెలుచుకోవాలన్న ఉద్దేశంతో నిజాంను కీర్తించాలని కేసీఆర్ నిర్ణయించుకొని ఉండవచ్చు.
ఏయే నియోజకవర్గంలో ముస్లింలు ఎంతెంత శాతం ఉన్నారో తబ్శీళ్ళు సేకరించి ఉండ వచ్చు. లేకపోతే నిజాం పాలనను ఆకస్మికంగా ప్రశంసించడానికి తగిన సందర్భం లేదు. నలభై సంవత్సరాలుగా లేనిది నలభై ఒకటో వర్థంతి సందర్భంగా తొమ్మిదో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమాధిని కేసీఆర్ దర్శించడం, నిజాంను పొగడటం వెను క నిర్దిష్టమైన రాజకీయ లక్ష్యం ఉన్నదనడంలో సందేహం లేదు. వ్రతం చెడినా ఫలం దక్కుతుందా అన్నదే సమస్య. కొత్త ఓట్లు వస్తాయో లేదో కానీ పాత ఓట్లు పోయే అవకాశం ఉన్నదేమో కేసీఆర్ ఆలోచించుకోవాలి. మొదట చేసిన ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ రెండో రోజు కూడా అదే వైఖరిని పునరుద్ఘాటించడం, నిజాంను మరింతగా స్తుతించడం కేసీఆర్ మొండి వైఖరికి నిదర్శనం. ఒకసారి కాదు వెయ్యి సార్లు నిజాంను పొగుడుతానంటూ రెట్టించడం వివాదాలలో వర్థిల్లాలన్న ఆయన మనస్తత్వానికి నిదర్శనం.
కళింగయుద్ధంలో వేలాదిమంది మరణానికి కారకుడైన అశోకుడు చేసిన మంచి పనుల గురించే మనం చెప్పుకుంటాం. చెట్లు నాటించాడనీ, చెరువులు తవ్వించాడనీ చరిత్ర పుస్తకాలలో చదువుకుంటాం. రణపిపాసిగా, హంతకుడిగా చెప్పుకోం. చనిపోయినవారి గురించి చెడు మాట్లాడటం మన సంస్కారం కాదు. మంచి చెప్పుకోవడం ఆనవాయితీ. కనుక నిజాం చేసిన మంచి పనులను మాత్రమే ఏకరువు పెడతామంటే కుదురుతుందా? ఇతర రాజుల ముచ్చట వేరు నిజాం సంగతి వేరు. నిజాం పాలన ఇటీవలి చరిత్ర. ఆయన పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యక్తిగతం గా ఎటువంటి మనిషన్నది ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజల ను ఉక్కుపాదంతో అణచివేసి, వారి సంస్కృతినీ, భాషనూ, ఆశలనూ, ఆకాంక్షలనూ కాలరాసిన రాక్షస పాలకవ్యవస్థకు ఆయన ప్రతీక. నిజాం ప్రభుత్వ అరాచకాలతో పాటు జాగీర్దార్లూ, ఇనాందార్లూ, దేశముఖ్లూ వారి గడీలలో, గ్రామాలలో చేసిన అత్యాచారాలూ, అమానుషకృత్యాలు కూడా నిజాం ఖాతాలోకే వస్తాయి.
విశ్వవిద్యాలయాన్నీ, ఆసుపత్రినీ, సాగునీటి ప్రాజెక్టులనూ, చెరువులనూ, రైలు మార్గాలనూ, విద్యుచ్ఛక్తి కర్మాగారాలనూ నిర్మించిన మాట వాస్తవమే. స్థానికుల ప్రయోజనాలు రక్షించేందుకు ముల్కీ నిబంధనలను ప్రవేశపెట్టిన సంగతీ కాదనడం లేదు. ప్రతి రాజుకూ ఉన్నట్టే నిజాంకూ రెండు పార్శ్వాలు- బొమ్మా బొరుసూ ఉన్నాయి. ఒక పార్శ్వం పరమకిరాతకమైనది. రెండోది నిర్మాణాత్మకమైనది. మీర్ ఉస్మాన్ ప్రస్తావన వచ్చినప్పుడు కేవలం విధ్వంసం గురించి మాట్లాడుకున్నా పాక్షికమే. నిర్మాణం గురించి మాత్రమే చెప్పుకున్నా సమగ్రం కాదు. ఏ పార్శ్వం ఎక్కువ ప్రభావవంతమైనదో గమనించాలి. హిట్లర్ను నరహంతకుడుగా పరిగణిస్తాము కానీ ఇప్పటికీ చెక్కుచెదరని ఆటోబాన్ (రహదారులు)నిర్మాత గా ప్రస్తుతిస్తామా? ఈ రోజున గుజరాత్ సాధిస్తున్న ఆర్థికాభివృద్ధిరేటు చైనా అభివృద్ధిరేటు కంటే అధికం(దాదాపు 14 శాతం). అంతమాత్రాన గుజరాత్లో ఊచకోతను విస్మరించి నరేంద్రమోడీకి యోగ్యతాపత్రాలు ఇస్తామా?
నిజాం పైశాచిక పాలననుంచి విముక్తి సాధించడానికి వేలమంది అసువులు అర్పించి అమరులైనారు. బడా భూస్వాముల కబంధహస్తాలనుంచి విముక్తికోసం పేద ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధపోరాటం చేశారు. ప్రపంచ దృష్టి ని విశేషంగా ఆకర్షించిన ఈ చారిత్రక పోరాటంలో నాలుగువేలమందికిపైగా యోధులు నేలకొరిగారు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి నిజాంకూ, భూస్వాములకూ వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరాటమే. ఈ నేపథ్యాన్ని గమనించకుండా నిజాం పాలనకు నూటికి నూరు మార్కులు ప్రసాదిం చడం చెట్టు ఎక్కి మొదలు నరుక్కోవడం వంటిది. పోలిక తెచ్చినప్పుడు నిజాంను మెరుగైన పాలకుడుగా చూపించవచ్చు. ఉదాహరణకు చెరువుల నిర్వహణలో చంద్రబాబునాయుడు కంటే వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే నిజాం నయమని వాదించవచ్చు.
తెలంగాణలో నక్సలైట్లను అణచివేయడం పేరుతో వేలాదిమంది యువతీయువకులను ఎన్కౌంటర్ చేసిన ప్రభుత్వాల కంటే నిజాం ప్రభుత్వం మెరుగని చెప్పవచ్చు. కానీ నిజాం పాల నలోని సానుకూలమైన అంశాలను మాత్రమే వల్లించడం సమ్యక్దృష్టి అనిపించుకోదు. తెలంగాణవాదం అస్తిత్వాన్నే పూర్వపక్షం చేయడం ద్వారా కేసీఆర్ ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే నక్సలైట్లూ, ముస్లింలూ స్వైరవిహారం చేస్తారన్న సమైక్యవాదుల ప్రచారం 1969 నుంచీ ఉన్నదే. అటువంటి అనుమానాలకూ, ప్రచారాలకూ కేసీఆర్ ‘చరిత్ర పాఠాలు’ఆస్కారం కల్పిస్తాయి. సగటు ముస్లింలు నిజాం పాలనలోనూ సంతోషంగా లేరు. నిజాంను కీర్తించడం వల్ల ఇస్లామీయ ఛాందసవాదులు ఆనందిస్తారేమో కానీ సగటు ముస్లిం ఓటర్లు ప్రసన్నం అవుతారన్న అంచనాలోనూ సామంజస్యం లేదు.
యువతరానికి చెందిన ముస్లింలు విద్య, ఉపాధి రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను సూచించడం ద్వారా వారికి దగ్గరకావడానికి ప్రయత్నించవచ్చు. ముస్లింల అభివృద్ధికి ఒక ఉపప్రణాళికను ప్రతిపాదించవచ్చు. వారి సంక్షేమానికి నిర్దిష్టమైన చర్యలను ప్రతిపాదిం చవచ్చు. ఇటువంటి పనులేవీ చేయకుండా మాటల గారడీతో ముస్లిం ఓటర్లను బుట్టలో వేసుకోవాలనుకోవడం దురాశ. నిజాం ప్రభుత్వ దుష్కృత్యాలకు కానీ ఖాసింరజ్వీ దుర్మార్గాలకు కానీ నేటి ముస్లింలను బాధ్యులుగా చేస్తూ మతవాదులు ఎవరైనా ప్రచారం చేస్తుంటే దాన్ని ఖండించడం అవసరమే. తెలంగాణలో హిందువులూ, ముస్లింలూ ఐక్యంగా సహజీవనం చేయడానికి అనువైన వాతావరణం నిర్మించేందుకు కృషి చేయడం అభినందనీయమే. ఐక్యతకు భంగం కలిగించేందుకు జరిగే కుతంత్రాలను నిష్ఫలం చేయడమూ విధాయకమే.
ముస్లింలను జనజీవన ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి పాటుపడ టం ప్రశంసనీయమే. నిజాంను పొగడటం వల్ల ఈ లక్ష్యాలు సిద్ధించకపోగా ఛాందసవాదులకు అనవసరమైన ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుంది. స్వాతంత్య్ర సిద్ధి తర్వాత ఇండియన్ యూనియన్లో విలీనం కాకుండా పాకిస్థాన్లో కలిసిపోవాలని ప్రయత్నించి, ఐక్యరాజ్య సమితిలో రచ్చ చేసిన నిజాంకు సలాం కొట్టడాన్ని దేశభక్తులు ఎవ్వరూ హర్షించరు. అయిదు దశాబ్దాల సమైక్యానుభవం తర్వాత తెలంగాణలో కొందరు వామపక్షవాదులు సైతం ప్రత్యేకవాదాన్ని సమర్థిస్తున్న తరుణంలో కేసీఆర్ వింత వ్యాఖ్యలూ, వితండ వాదనలూ చేయడం విడ్డూరం. తెలివైన నాయకులు సైతం పప్పులో కాలు వేస్తారనడానికి ఇదో నిదర్శనం. ఈ వివాదాన్ని పొడిగించకుండా త్వరగా ముగిం చడం శ్రేయస్కరం.





