కెసిఆర్ చెప్పినవి వాస్తవాలే!
డిసంబర్ 1st, 2007 by డిస్కవర్ తెలంగాణ
- తెలంగాణ కవులు, రచయితలు
ఎన్నాళ్లుగానో ఇటు కమ్యూనిస్టులు, అటు భారతీయ జనతాపార్టీ- నిజాం పాలనా కాలాన్ని తప్పుగా చిత్రిస్తూ వస్తున్నాయి. ఇంత కాలానికైనా మంచి చర్చకు కెసిఆర్ తలుపులు తెరిచారు. కెసిఆర్ మాట్లాడిన విషయాల మీద ఎప్పటికైనా చర్చ జరగవలసిందే. ఆయన చెప్పినవి వాస్తవాలే. ఇప్పటికైనా ఆ విషయాలు చర్చకు వచ్చినందుకు సంతోషం. అప్పటి పోరాటాలను స్మరించుకుంటూనే, రజాకార్ల దుర్మార్గాలను విమర్శిస్తూనే, నిజాం రాజు దురాగతాలను ఖండిస్తూనే ఆయన చేసిన మంచిని గుర్తుచేసుకోవడం, స్మరించుకోవడం ఎంత మాత్రము పొరపాటు కాదు. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయులు, అశోకుడు ఇలా అప్పటి రాజులంతా ఎన్నో దురాగతాలు చేసినవారే. అయినా వారిని స్మరించుకుంటూనే ఉన్నామన్న విషయం గుర్తుంచుకోవాలి. నిజాం పాలనలో చివరి నాలుగేళ్లు మాత్రమే వివాదాస్పదమైనవి. మిగతా పాలన ఇప్పటి ఆంధ్ర వలసవాదుల పాలన కన్నా వెయ్యిపాళ్లు నయం.
ఆంధ్రప్రాంతం వారు తమ ప్రాంత గతవైభవాల్ని స్మరించుకున్నట్లే మేమూ మా ప్రాంత గత వైభవాలను స్మరించుకోవడం పొరపాటేమీ కాదు. తెలంగాణ సాయుధ పోరాటం గొప్పల కోసం కమ్యూనిస్టులు నిజాం పాలనంతా నిరంకుశ పాలనగా చిత్రించడం జరిగింది. ఇంకా ఎన్నాళ్లు సమరయోధుల శవాలమీద చిల్లర ఏరుకుంటారు? నిజాం కింద దేశ్ముఖ్లుగా జమిందార్లుగా ఉన్న అగ్రకుల భూస్వాములు చేసిన నిర్వాకాన్ని మరిపిస్తూ కేవలం నిజాం రాజునే విమర్శించడం పక్షపాతమే. నిజానికి కమ్యూనిస్టుల పోరాటం మొదలైంది ఆ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా అనే విషయం కావాలనే మరిపిస్తున్నారు. మరో వాస్తవమేమంటే 1946-48 మధ్యన (దాదాపు) 40 మంది పోరాట యోధులు వీరమరణం పొందితే, కాంగ్రెస్ పార్టీ పంపిన సైన్యం 1948-51 మధ్యన 4,000 మంది పోరాట యోధులను పొట్టనపెట్టుకుందనే నిజాన్ని విస్మరించడం ఘోరం.
ఉద్యమ ఫలితాలు ప్రజలకు అందివచ్చే సమయం లో ‘పోరాట విరమణ’ చేసింది కమ్యూనిస్టులు కాదా? గ్రామీణస్థాయిలో ఉన్న భూస్వాములు బలపడడానికే పోరాటం చేశారని తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బిఎన్రెడ్డి ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పోలీస్ యాక్షన్ పేర వేలాదిమంది ముస్లింలను, కమ్యూనిస్టులను ఇండియన్ ఆర్మీ ఊచకోత కోసిన చేదునిజం ఎక్కడా ఎందుకు ప్రస్తావన రావడంలేదు?? నాటి ఊచకోతకు బాధ్యత అప్పటి కాంగ్రెస్ ప్రభు త్వానిదే కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో తెలంగాణ పదమే ఉచ్ఛరించరాదన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏ మొఖంతో తెలంగాణ విషయాలు మాట్లాడుతున్నది ? తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల ఇండ్లను గుంజుకొని బేదఖల్ చేసిన ఈ పార్టీవాళ్లు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇవాళ ఆ యోధుల గురించి మాట్లాడడం విడ్డూరం. తెలంగాణలో ముస్లింలు, హిందువులు కలిసిమెలసి జీవిం చాలంటే లౌకిక భావనను పెంపొందించాలి.
మతతత్వ పార్టీలైన బిజెపి ప్రకటనలు, ఎంఐఎం చేష్టలు లౌకికతత్వానికి దోహదం చేయవు. కేవలం రజాకారుల గురించి మాత్రమే మాట్లాడే బిజెపి హిందూ, ముస్లింల మధ్య అగ్గి రాజేసి ఓట్లు సంపాదించుకోవాలని చూసే బాపతు. అటు స్వాతంత్ర పోరాటంలో గాని, ఇటు నిజాం వ్యతిరేక పోరాటంలోగాని పాల్గొనని ఆరెస్సెస్కు, అప్పటికింకా పుట్టని బిజెపికి తెలంగాణ గురించి మాట్లాడే ఏ అర్హతా లేదు. తాము రాసే, రాయించే చరిత్రలో తుర్రెబాజ్ఖాన్, మౌల్వీఅల్లావుద్దీలకు స్థానం లేకుం డా కుట్ర చేసింది వీళ్లే. రజాకార్ల చేతిలోనే హతమైన షోయబుల్లాఖాన్ వీళ్లకు యోధుడు కాదు. అలాంటి బిజెపి ‘తెలంగాణ విమోచన’ అంటూ ఉత్సవాలు జరపడం వెనక అసలు ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవచ్చు. అసలు తెలంగా ణది విలీనమో, విమోచనో, బలవంతపు ఆక్రమణో అన్న విషయం మీద కూడా ఎంతో చర్చ జరగాల్సిందే. ఎవరి పాపపు పాలు ఎంతో ఇప్పటికైనా నిగ్గు తేలాలి. రాజుల పాలనాకాలానికి ఎవరినో బాధ్యులను చేయడం, ఆ ప్రభావం మరెవరిమీదో పడడం కూడా సరైంది కాదన్న విషయం గమనించాలి. చర్చకూ అందరూ సిద్ధం కావాలి.






ఫిబ్రవరి 9th, 2008 at 5:44 pm
కేసీఆర్ ఎమ్ఐఎమ్ తో కలిసి దర్గాలో చద్దర్ కప్పడమే అయిష్టమైన చర్య. ఆయన మొదటిరోజు చేసిన ప్రకటనతో ఆగిపోతే ,తనను విమర్శించిన బీజేపి,ట్టీడీపీ నయకుల మీద విరుచుకు పడకుంటే ఈ వివాదం మొదలయ్యెదే కాదు.ఆయన తెల్లారి కొనసాగించిన ప్రకటనే అసలు వివాదానికి కారణమయ్యింది.
ఇప్పుడు పర ప్రాంతీయుల పాలన తెలంగాణ వారిని బ్రతుకుదెరువు లేకుండజేసి అత్మహత్యలు చేసుకునేలాగా చేసింది. ఎందరో పిల్లలనమ్ముకునేలాగ,వళ్ళు అమ్ముకునే లాగ చేసింది.భూముల అమ్మకాలు గ్రేటర్ హైద్రాబాద్ ప్రాణాలికలు వీళ్ళకంటే నిజాం పాలనే మేలనుకునేలాగ చేసినాయి. అసలు మన తెలుగు సోదరులు మన తెలంగాణకు చేసిన అన్యాయాలు ,పాలన పేరిట తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు,ఆచట్టాలతో తెలంగాణవకును/కు చేసిన ఉద్యోగాల,భూముల వంటి ఆర్ధిక దొఫిడీ ఎన్నడూ చరిత్రలో జరగనిది.అప్పుడు హిదూ-ముస్లింల మధ్య మతసామరస్యం ఉంది అనే కన్న ,ముస్లిమేతరులు పాలకులైన ముస్లింలతో సర్దుకు పోయారని చెప్పుకుంటే సరిగ్గా ఉంటుంది.ఈ సర్దుకు పోవడం ఏబయ్యేండ్లనుండీ ఎంత దోపిడీ,ఎన్ని అక్రమాలు,ఎన్నిఆక్రమణలు చేసినా పాలకులైన ఆంధ్రులతో తెలంగాణులు ఇప్పటివరకు సర్దుకు పోవడంలాంటిదే. ఆనాటి మతాల మధ్య సామరస్యం బలవంతమైనదే,కాని ప్రజాస్వామ్యమైనది (అంటే స్వేచ్చగా వచ్చింది) కాదు.ఏదేమైనా తెలంగాణ ప్రజలు ఆంధ్ర సోదరులతో ఆ.ప్ర.లోఉండడం కంటె వేరై ముస్లింలతో (రజాకార్లు,తీవ్రవాదులతో కాదు) సర్దుకు పోవడమే మేలు అనుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇంత హేయమైన బతుకులుండబోవని నమ్ముతున్నారు. అట్లని మళ్ళీ నిజాముల (రాజుల) పాలన కోరుకుంటున్నారని ఎవరైనా అనుకుంటే పొరపాటే.