బాంచన్! కాల్మొక్కడమే బాగుంది
డిసంబర్ 2nd, 2007 by డిస్కవర్ తెలంగాణ
- కట్టా శేఖర్రెడ్డి
నిజాం నవాబుల సుదీర్ఘపాలనలో రజాకార్ల ఆగడాలు జరిగింది చాలా తక్కువ కాలమే. ఆ సమయంలో ప్రజలు బాధ పడింది నిజమే. అయితే ఏ దేశంలోనయినా, ఏ సమాజంలో నయినా గత వైభవాన్ని స్మరించుకోవడం సంప్రదాయం. ప్రజలను పీడించిన రాజుల మంచి పనులనూ కీర్తిస్తూనే ఉన్నాం. అదే విధంగా ఈ ప్రాంతానికి మేలు చేసిన నిజాంకు, కాకతీయ రాజులకు సైతం సలాం చేస్తాం. దాంట్లో తప్పే ముంది?… అవును. నిజాంల గురించి ఒకటి కాదు… వెయ్యి వెయ్యిసార్లు కీర్తిస్తా.
- టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు
అవును. ఒక్క నిజాం ప్రభువుకే కాదు, ఆయన ముందు తరాల ప్రభులందరికీ ఇప్పుడు ట్యాంకుబండుపై విగ్రహాలు ఏర్పాటు చేయాలి. వారి సేవలో పునీతులైన దేశముఖ్లు, దొరలూ, జాగీర్దార్లందరికీ ఇప్పుడు సలామ్లు కొట్టాలి. విసునూరు దొరల సమాధులూ సందర్శించండి. ఎర్రబాడు దొర సమాధి ఎక్కడ ఉందో ఆరా తీయాలి. అందరికీ సాష్టాంగపడాలిప్పుడు. బైరానుపల్లికి మాత్రం వెళ్లకండి. కడవెండిని మరిచిపోండి. బాలెంల సంగతి ఇప్పుడెందుకు. సరిహద్దు పోరాటాలు గుర్తుపెట్టుకోవడం దండగ. బాంచన్! కాల్మొక్కడమే బాగుంది. చరిత్ర కొత్త సిలబస్ ఇది. బందగి ఆత్మను మరోసారి ఉరితీయాలి. దొడ్డి కొమురయ్య త్యాగాన్ని ఎన్కౌంటర్ల ఖాతాలో రాసెయ్యాలి. తెలంగాణ దాస్య విముక్తి కోసం త్యాగాలు చేసిన వేలాది మంది వీరులు ఇప్పుడు సమాధులనుంచి లేచి కొత్తగా ఆత్మహత్యలకు పాల్పడాలి. చరిత్ర మొత్తం తిరగరాయాలి. గత వైభవాన్ని పునరుద్ధరించాలి.స్వేచ్ఛ అడిగిన పాపానికి నిజాం పోలీసులూ రజాకార్ల నిలువు దోపిడీలో నాలుగు కిలోమీటర్లు నగ్నంగా నడిచిన నాటి తెలంగాణ ముద్దు బిడ్డలు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి. అస్తిత్వ పోరాటంలో నిజాము నిరంకుశ శక్తుల కరకు తుపాకులకు గుండెలప్పగించినవారు, గడ్డివాముల్లో సజీవంగా తగులబడిపోయినవారు, శీలం కోల్పోవడం ఇష్టం లేక బావుల్లో, చెరువుల్లో దూకి ఆత్మత్యాగం చేసిన వారు, ఎదిరించలేక అసహాయులై ముష్కర మూకల ఉక్కుపాదాల కింద నలిగిపోయిన మా బతుకమ్మలు… ఎవరు, ఏమయితేనేం… మనకు వర్తమానమే ముఖ్యం. తప్పును ఒప్పు చేయడం అవసరం. చెడుకు కొత్త చొక్కా తొడగడం తప్పనిసరి. అందమైన అబద్ధాలూ అవసరమే. ఓటు కంటే ఏదీ ముఖ్యం కాదు. రాజకీయ ఎత్తుగడ కంటే చరిత్ర ముఖ్యం కానే కాదు. ఎన్నికల్లో గెలవడం కంటే ఆత్మగౌరవం అసలే ముఖ్యం కాదు.
దేశముఖ్లు, జమీందార్లు, జాగీర్దార్లు కుడిఎడమల కొలువుదీరగా నిజాం ప్రభువు తెలంగాణ ప్రజల రక్తమాంసాలను ఒలిచి, వారి ఊళ్లూ గోళ్లూ ఊడగొట్టి, కాణీ కాణీ వసూలు చేసి, కోటలు పేటలు నిర్మించి, ఎంత అద్భుతంగా పరిపాలించాడని? మన భాషను, మతాన్ని మనకు కాకుండా చేసి, మరే హక్కులనూ లేకుండా చూసి మనకు ఎంత గొప్ప వైభవాన్ని అందించి పోయాడని? మన చరిత్రను, సంస్కృతిని ధ్వంసం చేసి, తమ సంస్కృతిని, చరిత్రను మనపై రుద్ది, ఎంతటి మేలుచేశారని? మన మాతృభాషలో బోధించేందుకు నాలుగు వందలయేళ్లు ఒక్క పాఠశాల కూడా పెట్టకుండా చూసి ఎంత సాంస్కృతిక సేవచేశారని? ఎంత సామరస్యం పాటించారని? పర్షియా నుంచి వస్తేనేం, ఢిల్లీ నుంచి వస్తేనేం మన పక్కనే ఉన్న విజయవాడ నుంచి వచ్చిన వారికంటే వారే గొప్ప! పరాయి భాషను మనపై రుద్దిన వాడికంటే మన మధ్య ఉండి, మన భాషనే మరో యాసలో మాట్లాడేవారే డేంజర్! దండయాత్రలుచేసి, మనను దండించినవాడికంటే, దాయాదిగా వచ్చినవాడే ద్రోహి! నిజం చరిత్ర ను తగలెయ్యాలి? కృష్ణుడూ, శిశుపాలుడూ ఒక్కటే. రాముడూ, రావణుడూ సమానం! కాకతీయులూ, నిజామూ సేమ్ టు సేమ్!
‘చిన్ననాటి జ్ఞాపకాలతో నా భూమిని ముద్దాడుతున్నప్పుడు అంతా రక్తపు వాసనే’ అన్నారో తెలంగాణ కవి. ఆ రక్తపు వాసనను అరబ్బీ అత్తరుతో కడిగేస్తే సరి. పిచ్చికవి తెలంగాణ గురించి ఎందుకంత బాధపడ్డారో! ‘గెలిచానో ఓడానో తెలియదు. నెత్తురోడాను. పోరాడాను. ఉరికంబాల్ని వెక్కిరించాను. కాళరాత్రి పూసిన కటిక చీకట్ని తుడిచాను. ఆయుధాల్ని ఎదిరించాను. దేవిడీల లెవీల కుట్రల్నీ ఛేదించాను. 1920కీ 1944కీ మధ్య ఎన్ని బేగారీ పరుగులు…(అఫ్సర్)’ ఆ కుట్రలన్నీ మరిచిపోయేందుకు నిజామీ టానిక్ ఏదైనా ఉందా సార్! దోపిడీ,తిరుగుబాటూ ఒక్కటేనని భలే ధైర్యంగా చెప్పారు. త్యాగాలనూ, విద్రోహాలనూ సమానంగా కొలవడం తమరివల్లే సాధ్యం. నిజాంకు పూమాల వేసిన చేతులతోనే, రావి నారాయణరెడ్డి విగ్రహాన్నీ ఆవిష్కరించగల వంచనాశిల్పం- ఒక మహా అద్భుతం! రాజరికంలో అభ్యుదయమూ, అస్తిత్వమూ! గతమంతా వైభవమని చెప్పడంలోనే భావ దారిద్య్రం ఉంది. గతమెంత వైభవమో తెలంగాణ ప్రజలు స్వయంగా అనుభవించారు. ఆ వైభవాన్ని మూలచ్ఛేదం చేయడానికి సామాన్యులు మాన్యులై యుద్ధాలు చేశారు. పాటలు పాడుకున్నారు. నినాదాలు చేశారు.
‘మనిషి ఎవడూ కూడా సుల్తానుల దర్బారుకు వెళ్లకూడదు. దర్బారులు పాపకూపాలు. అసలా దర్బారు భవనాల్ని కట్టడమే నికృష్ట పాపకార్యంతో ప్రారంభం అవుతుంది. బలవంతంగా మానవ శ్రమను దోచి వాటిని కట్టిస్తారు. మానవుల వెట్టితో ఏర్పడిన అవి పాపకూపాలు కాక మరేమిటి? అలాంటి దర్బారుల్లో కాలుపెట్టడమే మహాపాపం! తరువాత నీచులయిన సుల్తానులకు తలవంచి సలాం పెట్టడం, వారి చేతిని ముద్దుపెట్టుకోవడం, వార్ని గౌరవించడం- అంతకంటే పాపం! దర్బారుల్లోని పట్టు పరదాలూ, దుస్తులూ, బంగారు పాత్రలూ అన్నీ హరామ్ సంపాదనలే’ అంటారు సూఫీ దార్శనికుడు మహమ్మద్ గజాలీ. నిజాం నవాబు దర్బారు ఇందుకు మినహాయింపు కాదు. ఒక్క నిజాం నవాబే కాదు, ఏ రాజు దర్బారూ ఇందుకు అతీతం కాదు. రాజరిక వ్యవస్థే పరమ పరాన్నభుక్కుల వ్యవస్థ. ప్రఖ్యాత కవి మఖ్దూం మొహియుద్దీన్ నిజాము దర్బారు గురించి- ‘అది ఒక దయ్యాల మేడ. శిథిల సమాజాల నీడ. పీనుగులను పీక్కుతినే రాబందుల రాచవాడ ఆద్యంతం అంతులేని అరిష్టాల మహాపీడ…’ అని అగ్నివర్షం కురిపించారు. ‘రా! ఈ శిథిలాలపై స్వాతంత్య్ర పతాకమ్మెత్తు’ అని పిలుపునిచ్చారు. నిజాం వ్యతిరేక పోరాటం తెలంగాణ ప్రజల అస్తిత్వ చైతన్యానికి ప్రతీక. కెసిఆర్ ఆ అస్తిత్వ పునాదులను ధ్వంసం చేసే దుస్సాహసానికి దిగారు.
నవాబుగారు తెలంగాణకు ఏమేమి చేశారో, ఎంత బంగారమిచ్చారో కెసిఆర్ సెలవిస్తున్నారు. ఆయన ఇచ్చింది ఎవడబ్బ సొమ్ము? ఎక్కడ పండించి తెచ్చి ఇచ్చారు? ఏ చెమట బిందువుల సంపాదన అది? ఎన్ని తాళిబొట్ల సమీకరణ అది? కెసిఆర్ తన వాదనను సమర్థించుకోవడానికి కాళోజీని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ కాళోజీయే ‘మన కొంపలార్చిన మన స్త్రీల చెరిచిన మన పిల్లలను చంపి మనసు బంధించిన మానవాధములను మండలాధీశులను మరచిపోకుండగా గుర్తుంచుకోవాలె కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె కాలంబురాగానె కాటేసి తీరాలి’ అని గర్జించారు. అందుకే, ‘దొరా! మాకు నాలుగు వందల యేళ్ల వైభవమూ వద్దు! నలభై తరాల తిరోగమనమూ వద్దు! దగా మొదలయింది యాభైయ్యేళ్ల క్రితమే కాదు నాలుగు వందల యాభైయ్యేళ్ల క్రితం కూడా! మేము చరిత్రను మరవం, అస్తిత్వమూ మరవం! మనసులో ఉన్నది చెప్పినందుకు తమరి మేలూ మరవం!’






ఫిబ్రవరి 9th, 2008 at 7:00 pm
శేఖర్రెడ్డిగారు,
అప్పుడు సీబీఎన్ కాలంలో,ఇప్పుడు వయ్యెస్ కాలంలో తెలంగాణలో జరిగిన/జరుగుతున్న ఆత్మహత్యలు,పిల్లల అమలుకాలు,వళ్ళు అమ్ముకోవడాలు నిజాముల పాలనలో ఎప్పుడైనా జరిగిందా?
అప్పుడు అణచివేత,దౌర్జన్యం ఉన్నాయి,రజాకార్ల కాలంలో స్త్రీలను బతుకమ్మలాదించిన సంగతి కుడా మరిచిపోలేము, తెలంగాణావారికి బతుకేలేకుండ చేసిన ఇప్పటిపాలనను ఎట్లా విశ్లేషించాలి? రాయండి.