ముస్లింలపై ప్రేమ ఉన్నదెన్నడు?
డిసంబర్ 6th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- వరవరరావు
హైదరాబాద్ నగరంలో చార్మినార్ పాతబస్తీలో ప్రవేశిం చండి- లేదా నగరంలో ఎక్కడైనా కాళ్లు చేతులాడించే బతుకుదెరువు మార్గాలను వెతుక్కునే వాళ్లను చూడండి-వాళ్లు ముస్లింయి ఉంటారు, లేదా దళితులయి ఉంటారు. చంద్రశేఖర్రావు నాలుగున్నరవందల సంవత్సరాల వీళ్ల సంస్కృతి గురించి మాట్లాడి ఉండవలసింది. వీళ్లు భాషా సాహిత్యాలకు చేసిన సృజనాత్మక సేవ గురించి మాట్లాడి ఉండవలసింది. వీళ్లు చిత్రకళ, శిల్పం, సంగీతం వంటి కళలకు చేసిన సేవ గురించి మాట్లాడివలసింది. గత వైభవం గురించి కాదు, శ్రమైక జీవన, సౌందర్య గురించి- ఏమయినా అటువంటి నేపధ్యంలో నుంచి- మెదక్ జిల్లా రైతాంగం జీవితం నుంచి వచ్చి విద్యావంతుడయిన మగ్దూం మొహియుద్దిన్, విద్యావంతులయిన అలంఖుండ్ మీర్, రాజబహదూర్ గౌర్ లాంటి వాళ్లు కామ్రేడ్స్ అసోసియేషన్ పెట్టారు. ఇటు హైదరాబాద్లోను, అటు వరంగల్లోను, డిబిఆర్ మిల్స్, అజంజాహీ మిల్లులలో మొట్టమొదటి బట్టల మిల్లుల కార్మికులతో కార్మిక సంఘాలు పెట్టినవాడు మగ్దూంమొహియొద్దీన్. ఆ తర్వాత ఆయన, రాజబహదూర్గౌర్ ఆర్టిసి కార్మికులను కూడా సంఘటిత పరిచారు.
అలంఖుంద్ మీర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం లో విద్యావంతులను సంఘటిత పరిచాడు. ఈ ముగ్గురి ప్రేరణతో చెన్నమనేని హనుమంతరావు, రాజేశ్వరరావులు, యాదవరెడ్డి, బూర్గుల నర్సింగరావు, ఎంటిఖాన్ వంటి కమ్యూనిస్టు యోధులు, సాంస్కృతిక కార్యకర్తలు ముందుకొచ్చారు. తెలంగాణ నుంచి ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, ఇష్టా ఉద్యమాలు బలోపేతమయ్యాయి. తెలంగాణలో ముస్లింలయినంత మాత్రన తామందరమూ ప్రభువులమని అనుకోలేదు. కాబట్టి మీర్ ఉస్మాన్ అలీఖాన్కు తాను స్వతంత్రరాజ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని పాలించాలనో లేదా పాకిస్తాన్లో కలపాలనో అనుకున్నప్పుడు ఒక రజాకారు సేన ను తయారు చేసుకోవాల్సి వచ్చింది. అది తయారు చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, హత్యచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీయే ఐనా అందుకు తన పోలీసులతో, పాలనతో ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆ బలమే లేకపోతే హైదరాబాద్ నగరంలో షోయబుల్లాఖాన్ వంటి ఉత్తమ సంపాదకుణ్ని బర్కత్పురాలో రజాకార్లు చంపగలిగే వాళ్లుకాదు.
వరంగల్ కోటలో దాశరధి ‘ఆంధ్రమహాసభ’ పెండాల్ లో ‘మా నిజాం రాజు తరతరాల బూజు, ముసలి నక్కకు రాజరికమ్ము దక్కునే’ అని పద్యాలు చదువుతుంటే రజాకార్లు పందిళ్లు తగులబెట్టి ఉండేవాళ్లు కాదు. కాంగ్రెస్ జెండాను ఎగరేసినందుకు మొగిలయ్యను కత్తులతో చంపగలిగే వాళ్లుకాదు. 1947 ఆగస్టు15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ రాజాకార్లకు పైన నిజాం మాత్రమే కాదు గ్రామాల్లో దొరలు, పెత్తందార్లు నాయకత్వం వహించారని కూడా మనం మరిచిపోవద్దు. ఈ దొరలు, పెత్తం దార్లు 17 సెప్టెంబర్ 1948 దాకా షేర్వానిలు, చుడేదార్ పైజామా లు వేసుకుని కుచ్చుటోపీలు పెట్టుకొని నైజాం సేవ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత గ్రామాల్లో ఖద్దరు బట్టలు, గాంధీ టోపీల తో ప్రవేశించి ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని అక్రమించి 1951 అక్టోబర్ దాకా యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను వేటాడడంలో సహకరించారు. ముస్లింలను వేటాడడంలో పురికొల్పారు. ముఖ్యంగా మరట్వాడలో లక్షలాదిమంది ముస్లింలను హత్య చేయడంలో కేంద్ర బలగాలకు అండగా నిలిచారు.
1956 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్గా ఉన్నట్లుగానే- జమీందారీ, జాగీర్దారీ చట్టం రద్దయి రక్షిత కౌల్దారీ చట్టం వచ్చేదాకా-దేశ్ముఖ్, దేశ్పాండే, ముక్తేదార్లుగా దొరలు కొనసాగారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజభరణాలు ప్రభుత్వం నుంచి పొందినట్లుగా వీళ్లు నష్టపరిహారాలు, ఇనాములు పొందారు. ఇప్పటికీ ఇంకా బినామీ అక్రమణలు సంగతి చెప్పనేఅక్కర్లేదు. ఇటు దొరలకైనా, అటు రజాకార్లకయినా ప్రభు భక్తే తప్ప ముస్లింల పట్ల ప్రేమ ఉన్నదెన్నడని? రజాకార్ల వారసుడు సలావొద్దీన్ ఒవైసీ 1968,72 ప్రత్యేక ఉద్యమాల్లో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వానికి అండగా నిలిచాడు. ప్రతిగా ముస్లింలకు నీళ్లు, విద్యు త్తు, విద్య, ఆరోగ్యం వంటి వసతుల గురించి ఏమీ అడగలేదు. మసీదుల్లో ప్రార్థన సమయంలో లౌడ్ స్పీకర్లు ఉపయోగించే అనుమతి పొందాడు. తనకూ, తన వంశానికీ అధునిక జాగీర్లు విద్య, వైద్యసంస్థల పేర్లతో సంపాదించుకున్నాడు. ఇవ్వాళ కెసిఆర్ నిజంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగానైనా మాట్లాడవలసింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ వైభవం గురించి కాదు.
హైదరాబాద్ నగరంలో ముస్లింల జీవన స్థితిగతు ల గురించి మాట్లాడాలి. గత అరవై సంవత్సరాలుగా, పోనీ, ఆయనకు ఇష్టమైన విషయం ఆంధ్రవలస పాలన గనుక గత ఏభై సంవత్సరాలుగా ముస్లింలు జీవనస్థితిగతులు ఎందుకు అంత దిగజారిపోయాయో మాట్లాడాలి. గ్రేటర్ ఎన్నికలు అప్పుడే వస్తాయను కొని కొద్దిరోజులు సచార్ కమిషన్ నివేదిక అమలు గురించి కొంత హడావుడి చేసిన మాట మంచిదే అయినా అది వదిలి ఇప్పుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ను ఎందుకు పట్టుకున్నట్లు. ముస్లింలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రాతిపతికపై కావల్సిన రిజర్వేషన్ల గురించి అయిన వైఖరి ఏమిటి? బిజెపికి ప్రజల్లో బలం పోయింది గనుక పొత్తు పెట్టుకోడేమోకానీ నరేంద్రతో కలిసి టిఆర్ఎస్ స్థాపించడం గానీ, స్వయంగా బిజెపి ఆఫీసుకు వెళ్ళి వాళ్ల సహాయం అడిగిన నాడు గానీ, ఆయన నిర్వహించే చండీయాగం మొదలు, హిందూ ఛాందస వాద నలు చేసే విశ్వాసాల వల్ల గానీ ఆయన ముస్లింల నుంచి ఎటువంటి లౌకిక విశ్వాసాన్ని పొందగలరు ? మౌలిక అవసరాల విషయంలో ముస్లింల నుంచి దృఢంగా గత అరేళ్లుగా నిలబడి పోరాడింది లేదు. అట్లే అంతకన్న ప్రమాదకరం గా ముస్లింల మౌలికహక్కులయిన వాక్, సభా, విశ్వాస స్వాతం త్య్రాలు, జీవించే హక్కు కూడా హరించబడుతుంటే ఆయన పల్లెత్తు మాట అన్నది లేదు.
అజంఘోరి ఎన్కౌంటర్ నాటి నుంచి ఇప్పుడు మక్కామసీదు, లుంబీనిపార్క్, గోకుల్చాట్ పేలుళ్ల తర్వాత హైదరాబాద్ లోనూ, తెలంగాణ ముస్లిం యువకులపై అమలుఅవుతున్న రాజ్య హింస గురించి ఆయన వైఖరి ఏమిటి? ఆయనకు ముస్లింల పట్ల పక్షపాతమే ఉండనక్కర్లేదు. సమ న్యాయ దృష్టి ఉన్నా ఆయన అక్టోపస్ వంటి చట్ట వ్యతిరేక పోలీస్ నిర్మాణ ప్రయత్నాలను వ్యతిరేకించాలి. తస్లీమా నస్రీన్పై ఎంఐఎం శాసనసభ్యులు చేసిన దాడి మొదలు, బెంగాల్ వామపక్ష ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఛాందస వాదుల ప్రభావంతో తెచ్చిన ఒత్తిడిని ఖండించాలి.అట్లే నందిగ్రామ్లో పేద ముస్లింలపై సిపిఎం హర్మత్వాహిని దాడులను ఖండించాలి. ఓట్లకోసం ఐనాసరే, మత ఛాందస వాదాన్ని ఎత్తిపట్టడం కాకుం డా, నిరంకుశత్వాన్ని గత వైభవంగా పొగడడం కాకుండా, నిజం గానే దుర్భరంగా ఉన్న ముస్లిం ప్రజల మౌలిక స్థితిగతుల గురించి, తీవ్రమైన అణచివేతకు, రాజ్యాహింసకు గురువుతున్న ముస్లింల జీవించే హక్కు గురించి కెసిఆర్ ఆలోచిస్తే మీర్ ఉస్మాన్ అలీఖాన్ సమాధి దగ్గరకాదు, బందగీ సమాధి దగ్గర మాట్లాడాల్సి ఉంటుం ది. కానీ ఆ దొర వెయ్యిసార్లు కాదు గదా ఒక్కసారి కూడా అటువంటి తప్పుపని, దారి తప్పికూడా చేయడు.






ఫిబ్రవరి 7th, 2008 at 9:07 am
వరవరరావు వ్యాసం తెలంగాణ రాజకీయాలలో కరువైన నిజాయితిని మరోసారి గుర్తు చేస్తుంది. గత ఐదు సంవత్సరాలలో రాజకీయ పార్టీల తెలంగాణ చర్చలో మాయమైన ప్రజలలెక్కనే కేసీఆర్ నిజాం కీర్తనలో ముస్లింల ప్రశ్న లేదు. సమాజంలో ముస్లిం ఉనికికి సంబందించిన సమస్య, ప్రత్యేక తెలంగాణలో హిందూముస్లింల పరిస్థితి పట్ల సమగ్ర ద్రుక్పథం అవసరం. దాన్ని దాటేసినంతకాలం తెలంగాణ సాధన అంత దూరమైనట్లే
సెప్టెంబరు 17 ఒకనాడు తెలంగాణ విమోచన దినంగా ఇంకొకరోజు విస్మరన దినంగ మారడం, సడెణ్ గ నిజాంను లక్షసార్లు పొగిడినా తక్కువే నన్న గ్నానోదయం ముస్లింల పట్ల పెరిగిన ప్రేమ కాదనేది స్పష్టం. నిజాంపట్ల ఉప్పొంగిన భక్తి స్రవంతి వల్ల ముస్లిం ప్రజలకు ఒరిగేది ఏమీలేదు. తెలంగాణకు వచ్చేదీ ఏమీలేదు. నిజాం పాలన నుంచి నిజాంను వేరుగా చేసి ప్రభువులను కీర్తించే ప్రక్రియను సమర్థించడం రాజకీయవేత్తలకు వీలుఅవుతుందేమో గాని ప్రజలకు కాదు. కష్టజీవులు, ముస్లింలైనా హిందువులైనా కలిసే, తెలంగాణ దొరలను వాళ్ళ ప్రభువైన నిజామునూ ఎదిరించిండ్లు. ప్రజలు పాలకులు వేర్వేరు, ముస్లిం ప్రజలు నిజాం పాలన వేరన్నది సామాన్యులకు తెల్సు.
దాశరధి “చిల్లర దేవుళ్ళ”లో నిజాం దొరలమన్ననలను పొందేందుకు స్థానిక తెలుగు దొరలు ఎంత నీచానికి దిగజారిండ్లో, పి వి నర్సింహా రావు ‘గొల్ల రామవ్వ’ ఊర్లో దొరలు తురక పోలీసోల్లని తమ ఇండ్లళ్ల పెట్టుకొని ఎట్ల అర్సుకొన్నరో, భైరాన్ పల్లిల రజాకార్లు జేసిన రాక్షసత్వానికి స్పందిస్తూ “మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె, కాలంబు రాగానే కాటేసి తీరాలె” అని ఉగ్రరూపుడైన కాళోజిని తెలంగాణ రాజకీయనాయకులు మరిచిపొమ్మనవచ్చు. ఎన్నికల పొత్తులతోని వొచ్చే వోట్లని సూశి సర్దుకుపోరాదనొచ్చు. కొంతమంది మేథావులు కూడా అవునుగదా అనొచ్చు. ‘నాతోని గాదు’ అనే నారాయణ ఉన్నప్పటికీ.
ప్రజా సమస్యలపై నిత్యం జరుగుతున్న దోపిడిపై కిమ్మనకుండా విగ్రహాలు, వాగ్దానాలు, పదవుల హామీలు, బడ్జెట్ కేటాయింపు వరాలు తెలంగాణ సాధనకు సహకరించవు. ఆచరణనే ఆధారంగ ఆలోచించే మామూలు ప్రజలు నిజాం భక్తి ఉద్యమాన్ని హర్షించకపోవొచ్చు. ముస్లింల ఓట్లు నిజాం కీర్తనలవల్ల పెరగవు. ఎంత మంచి సంగీతానికైనా చింతకాయలు రాలవుకదా
వరవరరరవు వ్యాసం చదివినంక అనిపించింది “అడుక్కొని తెచ్చుకొనే తెలంగాణ” చర్చ, అసోంటి బుద్దిని ప్రశ్నించే కొత్త పద్దతి ఇంక మొదలైందని.
ఫిబ్రవరి 16th, 2008 at 10:27 am
వి వి గారు,
కేసీఆర్ నిఇజామును రెండొరోజుకూడా మెచ్చుకుని,ప్రతిపక్షాల విమర్శలలోని విశషయాలను విశ్లేషించుకోకుండా అనవసరమైనవి మాట్లాడి పొరపాటు చేశాడు.ప్రతిపక్షాలు విమర్శిస్తే అయన ఏకంగా దాడే చేశాడు. తెలంగణ ప్రజలకు అయిష్టమైన విధమైన ప్రకటనలు చేశాడు. హైదరాబాదును ఆసుపత్రులను,విశ్వ విధ్యాలయాన్ని,పరిశ్రమల్ను కళాఖండాలు నెలకొల్పి అభివ్రుద్ధి చేశారు. ఇప్పటి ప్రాంతేతర ప్రభువులకంటే నిజామ్ కట్టించిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఏప్రభుత్వమైనా కోట్లాది ప్రజాధనాన్ని వెచ్చిస్తుంది, కనుక ఎంతోకొంత అభివ్రుద్ధి తప్పక జరిగితీరుతుంది. నిజామ్ కాలంలో జరిగిన అభివ్రుద్ధి పనులు ఇప్పటికీ నిలిచివున్నాయి ,కనుక అప్పట్లో ప్రజలతో బలవంతంగా పనులుచేయించి నప్పటికి ఇప్పటికి ఉపయోగ పడుతున్నాయి. వాటినిమెచ్చుకున్నా , అప్పటి నిరంకుశ పాలనను విమర్శించనందుకు తెలంగాణ ప్రజలు బాధ పడ్డారు. మజ్లిస్తో కల్సి కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రైతాంగ పోరాటాన్ని చిన్నబుచ్చారు.
కేసీఆర్ పై మీరు చేసిన ఎన్నోవిమర్శలు బాగున్నవి. కాని చివరలో మత విశ్వానికి సంబంధించి చేసిన విమర్శ సమంజసంగా లేదు.ముస్లింల నుండి సెక్యులర్ విశ్వాసాన్ని పొందటానికి తన మతాన్ని కేసీఆర్ వదిలేయాల్నా?చండీయాగం చేయడమ్ తప్పా?ఎందరు ముస్లిం నాయకులు హిందువుల సెకులర్ విశ్వాసలను పొందటానికి తమ మతాన్ని విశ్వాసాలను వదిలేశారు/దూరం చేసుకున్నారు?