మళ్లీ ఈ కధల అవసరం ఇప్పుడెందుకనగా…
జనవరి 6th, 2008 by డిస్కవర్ తెలంగాణ
అంకితం
1857 హైదరాబాద్ తిరుగుబాటులో అమరులైన వారందరికీ,
త్యాగాలు చేసి శిక్షలు అనుభవించిన వారందరికీ.
నిజానికి ఇవేవీ నా స్వంత కథలు కావు. విషయ సేకరణ కోసం అనేక చరిత్ర గ్రంథాలపై ఆధారపడ్డాను. కొంత కల్పన, కొన్ని సన్నివేశాలు, మరికొన్ని వర్ణనలు లాంటి సృజన మాత్రమే నాది. కావున ఈ సందర్భంలో ప్రత్యేకంగా మెడాస్ టేలర్కు, సరోజిని రేగాని, కుష్వంత్సింగులకు కృతజ్ఞతలు. స్వర్గీయ జి. కృష్ణగారిని భక్తితో స్మరించుకుంటున్నాను.
ఈ మూడు కథలను సిద్ధం చేసి కూడా పుస్తకం వేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న నన్ను ‘ఒక చారిత్రక అవసరంగా’ నచ్చ చెప్పి ఉత్సాహపరిచిన ”తెలంగాణా హిస్టరీ సొసైటీ” సభ్యులకు కృతజ్ఞతలు.
1857 తిరుగుబాటులో హైద్రాబాద్ పాత్రను లోకానికి చాటాలన్న కోరికతో, ఆ అమరవీరులను స్మరించుకోవాలన్న ఆశతో, ఈ తరం వారికి ఆ అమరులను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఈ కథల పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇదేమీ సంపూర్ణమైనది కాదు. జూలై 17 ఉత్సవ సందర్భంగా ఆ రోజే ఆవిష్కరణ జరిపి ఆ అమరులకు నివాళులు అర్పించాలన్న ఆలోచనతో అనేక పరిమితులతో కూడిన ప్రయత్నమిది.
1857కు ఈ ఏడు 150 ఏండ్లు నిండాయి. అయినా ఆ పోరాటం ఇంకా కొనసాగుతున్నట్లే అనిపిస్తుంది. నేల తల్లి విముక్తి పోరాటం నుండి అనేకానేక అంతర్గత, బాహ్య నయావలసవాద వ్యతిరేక పోరాటాల వరకు, పోరాట రూపం మారిందేమో గాని ‘సారం’, ”అంతస్సూత్రం” మాత్రం మారలేదనిపిస్తుంది. అందుకే వారి త్యాగాలను, బలిదానాలను స్మరించుకోవడం కూడా ఇప్పుడు ఒక చారిత్రక అవసరమేమో!
బాబ్రీమసీదు దుర్ఘటన తర్వాత మతతత్వ వాదుల పుణ్యమా అని హిందువులు, ముస్లింల మధ్య గోతులు తవ్వి గోడలు లేపుతున్న ఈ సందర్భంలో 1857 తిరుగుబాటులో సాధించిన ”హిందూ ముస్లిం ఐక్యత” మళ్లీ ఈనాడు కూడా సాధించాలన్న సంకల్పంతో ఈ కథలను మీ ముందుకు తెస్తున్నాను.
సాహితీ సృజన కూడా సామాజిక కృషి, సామూహిక సృష్టి కావున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ…
మీ
లోకేశ్వర్





