పచ్చకామెర్లు
ఫిబ్రవరి 17th, 2008 by డిస్కవర్ తెలంగాణ
-కట్టా శేఖర్రెడ్డి
ఇప్పటికిప్పుడు తెలంగాణపై అవుననో కాదనో చెప్పే అవకాశం ఏమాత్రం లేదు. ఇది తీవ్ర సమస్య. చత్తీస్ఘడ్ లాంటి చిన్న రాష్ట్రాల్లో తీవ్రవాదుల కద లికలు ఎక్కువై పరిస్థితి దారుణంగా తయారయింది. రాష్ట్రంలో కూడా నక్సలైట్లు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నందున ఉగ్రవాద సమస్య మరింత పెరిగే అవ కాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి…కాశ్మీర్ సమస్యపై పాక్తో భారత్ ఓ వైపు పోరాడుతూనే మరోవైపు ఇతర విషయాలపై చర్చలూ జరుపుతోంది. అలాగే మనమూ వ్యవహరిద్దాం.
-ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి
* * *
యుద్ధం అబద్ధాలతోనే మొదలవుతుంది. పిచ్చికుక్క అని ముద్ర వేస్తే తప్ప కొట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రీ అదే మార్గాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ ఇవ్వడానికి నక్సలిజం అడ్డంకి అయిందట. తెలంగాణ కాశ్మీరూ ఒకటేనట. నక్సలిజం తెలంగాణలో పుట్టిందా? నక్సలిజం తెలంగాణలో మాత్రమే ఉందా? నక్సలి జం సమైక్యాంధ్రలో ఉండవచ్చు కానీ, తెలంగాణలో మాత్రం ఉండరాదా? అసలు సమైక్యాంధ్రలో నక్సలిజం లేనిదెప్పుడు? ముఖ్యమంత్రులు, వారి తనయులు కోట్లాది రూపాయల ప్రజాధనంతో బుల్లెట్ ప్రూఫ్ కార్లు, జామర్లు, వందలాది మంది జవాన్ల మధ్య ఊరేగుతున్నది సమైక్యాంధ్రలోనే కాదా? నక్సలైట్ల భయంతోనే కాదా? వేలాది మంది నవయువకులు ఆవేశం కట్టలు తెంచుకుని, ఆశయాల ఊపిరిపోసుకుని తుపాకి గుళ్లను ముద్దాడి, మట్టిలో కలిసి పోయింది సమైక్యాంధ్రలోనే కాదా? కౌంటర్లు, ఎన్కౌంటర్లు, మానవ హక్కుల ఉల్లంఘనలూ యథేచ్ఛగా జరిగిపోయింది సమైక్యాంధ్రలోనే కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్ల బారులో నక్సలైట్లు భూకంపం సృషి ్టంచింది సమైక్యాంధ్రలోనే కాదా? రాష్ట్ర హోంమంత్రిని నడిరోడ్డుపై మందుపాతర లతో పేల్చి వేసింది సమైక్యాంధ్రలోనే కాదా? మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిపై మందు పాతర పేలిందీ సమైక్య ఆంధ్రలో కాదా! శ్రీకాకుళ వసంత మేఘ గర్జనలు, సిరిసిల్లా-జగిత్యాల, గోదావరిలోయ సాయుధ పోరాటాలు వెల్లువె త్తింది సమైక్యాంధ్రలోనే కాదా? నిజానికి, ఇవ్వాళ నక్సలిజం తెలంగాణ పొలిమేరలు దాటిపోయింది. ఇంకా అక్కడక్కడ ఉన్నా, నక్సలిజాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, ఎలా ఎదుర్కోవాలో తెలంగాణ ప్రజలకు తెలిసినంతంగా మరెవరికీ తెలియదు. నక్సలిజం కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఎందుకు మొలకెత్తలేదో, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎందుకు ఉవ్వెత్తున ఎగసిపడిందో రాష్ట్ర ప్రజలకు ఎరుకే!
నక్సలిజం ఒక్క తెలంగాణలోనే కాదు, ఇప్పుడు గుంటూరు, ప్రకాశం, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనే బలంగా ఉందన్న విషయమూ అందరికీ తెలుసు. ఇక తెలంగాణనయినా, హైదరాబాద్నయినా కాశ్మీరుగా మార్చ గల అనుభవం, కల్లోలం సృష్టించగల తెగింపు ఎవరికి ఉందో కూడా ఇప్పుడు ప్రజ లకు తెలుసు. అసత్యం ఒక సారి యుద్ధం గెలవడానికి మాత్రమే ఉపయోగ పడు తుంది. రెండోసారి ఆ ఆయుధం పని చేయదు. నిఘా సంస్థల నివేదికలు రాజకీయ అక్రమ సంబంధానికి పుట్టే అకాల పుత్రికలు. అవి నిలవవు. వాటికి విలువలేదు. ఇక పవిత్రత గురించి మాట్లాడడం అనవసరం.
హోంమంత్రి రిజాయిండర్
అటువంటి నివేదికలేవీ ఇంటలిజెన్స్ వర్గాలు ఇవ్వలేదు. అసలు ఎలాంటి నివేది కలూ లేకుండా అపోహలు సృష్టించడం మంచిది కాదు. ఇంటలిజెన్స్ నివేదికలతోనే చత్తీస్ఘడ్, జార్కండ్ రాష్ట్రాలను ఇచ్చారా? తెలంగాణ ఏర్పాటైతే నక్సలిజం పెరు గుతుందని, శాంతి భద్రతలు క్షీణిస్తాయని చెప్పడం కేవలం అపోహే.
-హోం మంత్రి కుందూరు జానారెడ్డి, ఐఐఐ
ఉన్నమాట
దేశంలో చాలా మంది రాజకీయ నాయకులకు గర్వం ఎక్కువ. ఇది ఇతర ప్రజా స్వామ్య దేశాల్లో కనిపించదు. ఇందువల్లే మన రాజకీయ నాయకులు ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తున్నారు.
-మాజీ ఉప ప్రధాని ఎల్.కె అద్వానీ
‘నీతి’బీర
మనిషిలా మాట్లాడు..బుద్ధుండి మాట్లాడుతున్న మాటలేనా ఇవి..ఛీఛీఛీ..ఇవి మ నుషులు మాట్లాడే మాటలేనా..ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ..తొమ్మిదేళ్లు సిఎంగా పనిచేసిన మనిషి మాట్లాడాల్సిన మాటలేనా..ఛీఛీఛీ..సిగ్గుతో తలదించు కోవాలి.
-ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి
సలహాదారు అనుభవం
ఓ పెద్దమనిషి కారులో సోమాజిగూడ రోడ్డులో వస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్ల సమీపంలో ఉన్నట్టుండి ఓ సైకిలిస్టు అడ్డంగావచ్చి కారును డీకొని కిందపడి పోయాడు. సైకిలిస్టుకు కిందపడి, మోచేతులు డోక్కుపోయాయి. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. ఆ పెద్దమనిషి కారు దిగి, అతడిని సమీపంలోని ఏదైనా ఆస్పత్రికి తీసుకెళ్లి, ప్రాథమిక చికిత్స చేయించాల్సిందిగా డ్రైవరుకు చెబుతున్నారు. సైకిలిస్టు గోల చేస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి, ‘పదండి పోలీసు స్టేషనుకు’ అన్నారు. ‘బాబూ, నేను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారును. అతనికి పెద్ద దెబ్బలేమీ తగల్లేదు’ అని ఆ పెద్దమనిషి చెప్పుకున్నారు. అంతే మనవాడు అలర్టయిపోయి, ‘మీరు వెళ్లిపోండి సార్, ఈ వ్యవహారం నేను చూసుకుంటాను’ అని, ఆటో పిలిచి పెద్దమనిషిని పంపించి వేశాడు.
పెద్దమనిషి ఇంటికి చేరాడో లేదో డ్రైవరు నుంచి ఫోను. ‘సార్. సైకిలతను వెళ్లిపోయాడు. కానిస్టేబుల్ ఐదొందలయినా ఇవ్వనిదే వదలి పెట్టనంటున్నాడు’. పెద్దాయనకు నోట మాట రాలేదు. ‘ప్రభుత్వ సలహాదా రునని చెప్పినా…వినలేదా’. ‘లేదు సార్, పోలీసు స్టేషనుకు రమ్మంటున్నాడు’. ‘సరే…ఇచ్చిరా’. ఆ పెద్దమనిషి ఓ జర్నలిస్టుకు ఫోను చేసి, మా ప్రభుత్వం ఇలా తగలబడిందని గోడు వెళ్లబోసుకున్నారు. ‘పోలీసుల్లో అవినీతి ఎప్పుడూ ఉన్నదే. కానీ ఇంత బరితెగింపా? నన్నే లెక్క చేయలేదంటే వాళ్లు సామన్యులను ఎంత పీక్కుతింటున్నారో’ అని ఆయన గింజుకున్నారు. ఆయన బాధ ఐదొందల గురించి కాదు. జరిగిన అవమానం గురించి. ‘యథా రాజా తథా పోలీసు’!
(16 ఫిబ్రవరి 2008 ఆంధ్రజ్యోతి సౌజన్యం)





