అంపశయ్యపై సిరిసిల్ల.. మూడేళ్లలో 315 ఆకలి చావులు
ఏటికేడాది పెరుగుతున్న చేనేత కార్మికుల బలవన్మరణాలు
చావులు చెల్లవంటున్న సర్కారు ఎక్స్గ్రేషియాలోనూ రాజకీయం
![]()
సిరిశాలగా ఖ్యాతిగాంచిన సిరిసిల్ల… ప్రస్తుతం ఉరిశాలగా మారింది. మగ్గమనే అంపశయ్యపై పడుగు పోగుల ఉరితాళ్ల మధ్య నేతన్న వేలాడుతున్నాడు. వస్త్ర పరిశ్రమ భరోసా ఇవ్వక… ఉపాధి కరువై… మెతుకు దొరక్క… నేత కార్మికులు ఆకలి చావులకు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. రక్తాన్నే ఇంధనంగా మండించి మరమగ్గాలను నడిపే కార్మికులు ప్రస్తుతం పస్తులతో విలవిల్లాడుతున్నారు. నేతల పరామర్శలు, సానుభూతి వచనాలు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ప్రత్యేక ప్యాకేజీలు, రుణాల మాఫీ లు నేతన్న దరికి చేరడం లేదు. కరీంనగర్ ఉప ఎన్నికల సందర్భం గా సీఎం నేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. కరీంనగర్కు మళ్లీ ఉప ఎన్నికలు వచ్చినా… ముఖ్యమంత్రి ప్యాకేజీకి మోక్షం కలగకపోవడమే అసలైన విషాదం.
(ఆన్లైన్, సిరిసిల్ల) ప్రభుత్వ, నాయకుల కంటితుడుపు ఓదార్పులు, నామమాత్రపు చర్యలు బతుకుకు భరోసా ఇవ్వకపోవడంతో గత మూడేళ్లలో 315 మంది నేత కార్మికులు ఆకలి చావులకు రాలిపోయారు. ఒకప్పుడు సిరికి, సృజనకు ప్రతిరూపమైన నేత కార్మికులు… ప్రస్తుతం పస్తులతో కాలం వెళ్లదీయలేక, మరొకరి ముందు చేయి చాపలేక తనువు చాలిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి మొదలు… సిరిసిల్ల గల్లీలీడర్ వరకు ఆత్మహత్యలు వద్దు, ఆత్మస్థైర్యంతో ఉండాలంటూ హితవచనాలే తప్ప కనీసం వారికి రావాల్సిన ఎక్స్గ్రేషియా కూడా అందించలేని దుస్థితి మరిన్ని బలవన్మరణాలకు కారణమవుతోంది.
కరీంనగర్ ఉప ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ నేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామని ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఇంతవరకూ ఆ ప్యాకేజీ ఊసేలేదు. తరచూ రసాయనాలు, నూలు ధరలు పెరిగిపోతుండడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అతలాకుతలమవుతోంది. సంక్షోభాన్ని తట్టుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకోవడం, డైయింగ్ యూనిట్లను మూసివేయడంతో కార్మికులకు ఉపాధి కరువవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం సిరిసిల్ల పవర్లూం పరిశ్రమకు 50 శాతం విద్యుత్తు సబ్సిడీని ఇచ్చి ఓదార్చగా… తాము అధికారంలోకి వచ్చిన 2004 మే తర్వాత చనిపోయిన వారికి మాత్రమే రూ. 1.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వివిధ కార్మిక సంఘాలు, బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టడంతో అనేక నిబంధనలతో 1997 నుంచి ఇవ్వడానికి ఒప్పుకుంది. 240 నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు అధికారిక రికార్డులే చెబుతుండగా… 208 కేసులను మాత్రమే పరిగణించి అందులో కేసుల్లో 81 మంది కుటుంబాలనే అర్హులుగా తేల్చారు. వారికి ఎక్స్గ్రేషియాను అందించారు. 103 బలవన్మరణాలను చెల్లనివిగా ప్రకటించారు.
ఎఫ్ఐఆర్ కాపీలు లేవనే సాకుతో మిగిలిన ఆత్మహత్యలను తోసిపుచ్చారు. దీంతో… 103 మంది బాధిత మహిళలు ఆందోళన చేయడం, రాజధానిలో కార్మిక మంత్రి వినోద్ ఇంటి ముందు వంట, వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ఎట్టకేలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. కానీ… ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కేవలం కొందరికి రూ. 50 వేలు; మరికొందరికి రూ. 25 వేల చొప్పున విదిల్చి చేతులు దులుపుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హెల్ప్లైన్ ఏర్పాటుచేసినా ఇప్పటివరకూ ఆత్మహత్యల నివారణకు దానిద్వారా అందిన సహాయం శూన్యం.
చేనేతకు మాఫీ ఉపయోగం కాదు
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సామల మల్లేశం సొసైటీలు, మాస్టర్ వీవర్లు పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నాయి. రుణ మాఫీ వల్ల యజమానులకు మాత్రమే లాభం. నేత కార్మికుల కోసం బ్యాంకుల్లోని రుణాలను మాఫీ చేయాలి. వ్యక్తిగత రుణాలు అందించాలి.
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
సీపీఎం సిరిసిల్ల డివిజన్ కార్యదర్శి పంతం రవి ఇప్పటికైనా నేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. పావలావడ్డీ రుణాలు, వ్యక్తిగత అప్పులు తొలగించేలా ఉండాలి. నిబంధనల పేరిట నిలిపేసిన ఎక్స్గ్రేషియాను వెంటనే ఇవ్వాలి.
పనికల్పించాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ నేత కార్మికులకి పూర్తిస్థాయిలో పని ఉండేలా చూడాలి. పవర్లూం పరిశ్రమకు కూడా ఆప్కో వంటి సంస్థలను ఏర్పాటు చేయాలి.
ఏటేటా పెరుగుతున్న ఆకలిచావులు
1997- ముగ్గురు
1998- 8 మంది
1999- 11 మంది
2000- 31 మంది
2001- 24 మంది
2002- 18 మంది
2003- 20 మంది
2004- 27 మంది
2005- 24 మంది
2006- 47 మంది
2007- 42 మంది
గత మూడు నెలల్లో 14 మంది
రుణ మాఫీ ఉత్తిదేనా?
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆన్లైన్): అన్నదాతల తర్వాత… ఎక్కువమంది ఆధారపడింది చేనేతపైనే! వ్యవసాయం తర్వాత ఎక్కువ సంక్షోభంలో చిక్కుకున్నదీ ఈ రంగమే!! కానీ… రైతన్నతోపాటు పలువర్గాల పై రుణాల మాఫీ వరాల జల్లులు కురిపిస్తున్న సర్కారు… నేతన్నను చి న్నచూపు చూస్తోంది. చేనేతరంగ రుణాల మాఫీకి ముఖ్యమంత్రి పలుసార్లు హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటికీ నెరవేరలేదు. బడ్జెట్లోనూ ని ధుల కేటాయింపునకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు.
వీపీసింగ్ హయాంలో రైతుల రుణాలతోపాటు చేనేత రుణాలనూ అప్పటి కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిన విషయాన్ని పలువురు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో కేంద్రమే ఈ రుణాల మాఫీచేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వంలో మొదలైనట్లు సమాచారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తున్నందున వాటి రుణాల మాఫీలో ఎలాంటి ఇబ్బందీ ఎదురుకావడం లేదు.
అదే చేనేత రుణాల దగ్గరికొచ్చేసరికి.. అవి ఆప్కాబ్ పరిధిలోను, వ్యక్తిగత రుణాలైతే వాణిజ్య బ్యాంకుల పరిధిలోను ఉండడం ఇబ్బందిగా మారుతోందన్నది ప్రభుత్వ వర్గాల వాదన. చేనేత రుణ బకాయిలు సుమారు రూ.240 కోట్ల మేర ఉన్నాయి. వీటి మాఫీకి సంబంధించి రాష్ట్రం కేం ద్రానికి పంపిన ప్రతిపాదనపైనా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బకాయిల చెల్లింపునకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందుకురాక… అటు కేంద్రమూ పట్టించుకోకపోవడంతో నేతన్నల రుణాల మాఫీ ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది.
- Sign Save the Weavers : Petition, created by Pooja Eppanapally a first generation Indian American from, 10th grade.