Feed on
Posts
Comments

- యం. కోదండరాం, కె. సీతారామారావు

I

 తెలంగాణ రాష్ట్ర సమితి తరపున శాసనసభకు, శాసన మండలికి, పార్లమెంటుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల రాజీనామాతో తలెత్తిన పరిస్థితిని అంచనా వేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సాధనఉద్యమం అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేసుకోలేము. రాజీనామాకు దారితీసిన కారణాలను తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌ అనబడు సామాజికార్థిక, రాజకీయ వ్యవస్థ స్వరూప, స్వభావాలను అర్థం చేసుకోవాలె. తెలంగాణ పోరాటం, భాషా ప్రయుక్తత పేరుతో ఏర్పడిన ”ఆంధ్రప్రదేశ్‌” ఉమ్మడి వనరులను వాడుకొని ఎదిగి, సామాజికార్థిక వ్యవస్తలన్నింటిని శాసిస్తున్న ఆంధ్ర పాలక వర్గాలకు వ్యతిరేకంగా సాగుతున్నది. ఈ వర్గాలు తెలంగాణను తమ ఎదుగుదలకు కావలసిన వనరులను సమకూర్చే అంతర్గత వలసగా మార్చివేసినాయి. అంతర్గత వలసగా మారిన ప్రాంతం, తన అస్థిత్వాన్ని, వనరులను కోల్పోయి వలస పాలకుల ఆర్థిక, సామాజిక పెత్తనం కింద నలిగిపోతున్నది. ఈ పెత్తనం నుండి బయటపడి వనరులను తమ ప్రాంత ప్రజల అభివృద్ధి-సంక్షేమాల కోసం పూర్తిగా వినియోగించుకునే స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను, సంపూర్ణ నిర్ణయాధికారాన్ని సాధించుకోవడానికి కొనసాగుతున్న ఉద్యమమే సమకాలీన తెలంగాణా పోరాటం

భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఏర్పడే పెద్ద రాష్ట్రాలన్నింటిలోను అభివృద్ధి చెందిన ప్రాంతాలల్లో ఎదిగిన సామాజిక వర్గాల ఆధిపత్యం ఏర్పడుతుందని అంబేద్కర్‌ ముందుగానే పసిగట్టాడు. పెద్ద రాష్ట్రాల వనరులను మొత్తంగా కొన్ని కులాలు, వర్గాలు ఉపయోగించుకొని సామాజిక ఆర్థిక రంగాలలో తమ ఆధిపత్యాన్ని వ్యవస్థితం చేస్తాయన్నాడు మన రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్‌, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే జరిగింది. ఈ ఆధిపత్యం ఏర్పడటానికి స్వాతంత్య్రోదమ కాలంలోనే భూమిక, ప్రాతిపదిక ఏర్పడింది. ఆర్థికంగా ఎదిగి, విద్యారంగంలో పైకొచ్చి ఆధునిక వాణిజ్య విలువలను స్వీకరించి, జమీందారీ వ్యతిరేక ఉద్యమంలో రాజకీయంగా సంఘటితమై జాతీయోద్యమంతో సంబంధాలను పెంచుకొని ఆంధ్ర ప్రాంతంలో బలమైన సంపన్న వర్గం తమ ఆధిపత్యాన్ని విస్తరించుకొన్నది. ఈ వర్గానికి కావలసిన వనరులను సమకూర్చడానికి, విశాలాంధ్ర నినాదంతో సమైకాంధ్ర ప్రదేశ్‌ అవతరించింది.

నిజానికి భారత రాజ్యాంగ విలువల ప్రకారం ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి. సమిష్టి సంక్షేమం పెంపొందే విధంగా సమిష్టిగా వనరులను వినియోగించాలి. కానీ కోస్తాంధ్ర ప్రాంతంలోని కొన్ని వర్గాలు సామాజికార్థిక రంగాల్లో పెత్తనాన్ని సాధించడం వలన రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాల కనుగుణంగా అటు కేంద్రంలో గాని, ఇటు రాష్ట్రంలో గాని ఏ ప్రభుత్వమూ పనిచేయలేదు. నీళ్ళు, నిధులు, నియామకాలతో పాటు నిర్ణయాధికారం ఆంధ్ర సంపన్న వర్గాలకే దక్కినాయన్నది వాస్తవం. ఈ పరిస్థితిలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ తన వనరులను అనుభవించాలంటే తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల్సిందే తప్ప వేరే గత్యంతరం లేదని ఈ ప్రాంత ప్రజలు ఐదు దశాబ్దాల నుండి డిమాండ్‌ చేస్తున్నారు.

అన్ని వ్యవస్థల్లోనూ ఆంధ్ర పాలకుల ఆధిపత్యం గట్టిగా ఏర్పడి ఉండటంతో, ఆ వ్యవస్థల వెలుపల ప్రజా సంఘాల కృషి ఫలితంగా వలసాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం ఏర్పడి బలపడింది. ఈ ఉద్యమం రగిలించిన చైతన్యం ఫలితంగానే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. ఆధిపత్యం వ్యవస్థితమైనప్పుడు దానికి వ్యతిరేకంగా అణగారిన వర్గాలలో చైతన్యం కలిగినప్పుడే రాజకీయ పార్టీ ఏర్పడటానికి అవకాశం కలుగుతుంది. టి.ఆర్‌.ఎస్‌. ఏర్పడిన తరువాత కూడా 2004 ఎన్నికల వరకు తెలంగాణ ఉద్యమం ప్రజల్లో భావ వ్యాప్తికే పరిమితమైంది. 2004 ఎన్నికల తరువాత ఉద్యమం ఒక ప్రధానమైన మలుపు తిరిగింది. అంతవరకు వ్యవస్థల వెలుపల మాత్రమే సాగి 2004 ఎన్నికలలో వ్యవస్థల నుండి తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని తెచ్చుకోవడానికి కావలసిన రాజకీయ ప్రక్రియగా కూడా పెంపొందింది. 1971లో తెలంగాణ ప్రజాసమితి వ్యవస్థల లోపల పనిచేయడానికి, రాజకీయ ప్రక్రియను నడిపించడానికి కావలసిన వ్యూహాన్ని తయారుచేసుకోలేక పోయింది. అందువల్లనే కాంగ్రెస్‌ తెలంగాణ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించడంతో తన కార్యకలాపాలను వదిలేసుకున్నది. కానీ బలమైన ప్రజా ఉద్యమం ఉండటం వలన కాంగ్రెసుకు తెరాసను లొంగదీసుకోవడం సాధ్యపడలేదు. తెరాస కూడా రాజకీయ ప్రక్రియను కొనసాగించడానికి అవకాశం ఏర్పడింది. పార్లమెంటులలో కల 550 మంది సభ్యులలో 450 మంది (కాంగ్రెసును కలుపుకుంటే) సభ్యుల మద్దతు కూడగట్టగలిగింది.

అయినా ఆంధ్ర వలస పాలకుల ఆధిపత్య ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయాన్ని తీసుకోవడం లేదు. ఆంధ్ర వలస పాలకుల గుప్పిట్లో నున్న కాంగ్రెస్‌ తెలంగాణకు న్యాయం చేయలేదని తేలిపోయింది. అంతేకాదు తెలంగాణ నుండి ఆంధ్రకు వనరుల తరలింపును కూడా ఆపలేకపోయింది. అసెంబ్లీ కమిటీలలోను టి.ఆర్‌.ఎస్‌ ప్రజా ప్రతినిధులు ప్రతిఘటించారు. అయినా అన్యాయం కొనసాగడం ఆగలేదు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రజా ప్రతినిధులు గట్టిగా ప్రతిఘటించి ఉంటే ప్రభుత్వ పాలన స్తంభించి పోయేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది. కానీ అన్ని పార్టీల్లో ఆంధ్ర నాయకుల పెత్తనం కారణంగా ఏ పార్టీ కూడా తెలంగాణ విషయమై ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నది.

II

 ఈ పరిస్థితుల్లో తెరాస చేసిన ప్రయత్నాలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లోపల చేసిన లాబియింగు ప్రక్రియ, విఫలమయి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కాబట్టి తెరాస ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి తెలంగాణా సమస్య పరిష్కారంలో మళ్ళీ ఒకసారి ప్రజా క్షేత్రంలోకి రావాల్సిన రాజకీయ అనివార్యత ఏర్పడింది. గత ఐదు దశాబ్దాలుగా నలుగుతున్న తెలంగాణా భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలక అంశంపై ఎన్నోసార్లు ప్రజాభీష్టం వెల్లడించబడినప్పటికిని ప్రజాస్వామిక వ్యవస్థల ద్వారా పరిష్కారం లభ్యం కానప్పుడు మరోసారి అదే అంశంపై ప్రజా తీర్పుకోసం ప్రజాస్వామిక పద్ధతి ద్వారా ప్రజాక్షేత్రంలోకి రావడం అభినందించాల్సిన విషయం. ప్రజాభీష్టం నెరవేరాలంటే, ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే ఎంత ధనం ‘వృధా’ అయినా ప్రజాస్వామిక పద్ధతులను ఆశ్రయించాల్సిందేతప్ప వేరే గత్యంతరం గాని, ప్రత్యామ్నాయం గాని ప్రజాస్వామిక వ్యవస్థలో ఉండదు. తెలంగాణాలో ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలు (16 శాసనసభ, 4 లోకసభ స్థానాలకు) తెలంగాణా అన్ని జిల్లాలకు, ఒక్క ఖమ్మం తప్ప, విస్తరించి జరుగుతున్నవి. ఇవి మిని సార్వత్రిక ఎన్నికల్లాంటివని అనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. తెలంగాణాకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన ద్రోహానికి నిరసనగా తెరాస తెచ్చిన ఎన్నికలు. తెలంగాణాలో ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రజాభీష్ఠం, ప్రజాస్వామిక ప్రక్రియలు, వ్యవస్థలు రక్షింపబడడానికి తెరాస తీసుకొచ్చిన ఎన్నికలు కాబట్టి తెరాస విసిరిన సవాల్‌ను, ప్రజా ప్రతినిధుల రాజీనామా నిర్ణయాన్ని అపహాస్యం చేసి నిధించాల్సిన అవసరం లేదు.

తెలంగాణా విషయంలో పార్లమెంటరీ వామపక్షాలతో సహా, వివిధ జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎటువంటి రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాయో గమనిద్దాం. సి.పి.యం. పార్టీ భాషా ప్రయుక్తత సిద్ధాంతం పేరుతో సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నది. కనీసంగా వనరుల పంపిణీలో జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రతిఘటించడం లేదు. సిపిఐ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నా ఆ అంశంపై కొట్లాటకు దిగడానికి సిద్ధంగా లేదు. బిల్లు ప్రవేశ పెడితే అనుకూలంగా ఓటు వేయడానికి నిర్ణయించింది. రాజశేఖర్‌ రెడ్డి ఆధిపత్యం ఉన్నంత కాలం కాంగ్రెసు పార్టీ తెలంగాణ పై నిర్ణయం తీసుకోలేదు.

ఇకపోతే టిడిపి సమైక్యవాదాన్ని వదులుకోలేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని మాత్రం అంటున్నది. ఆ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పదు.

ఉప ఎన్నికలు అనివార్యమయిన తరువాత టిడిపి వేసిన పార్టీ కమిటీని కూడా నమ్మడానికి వీల్లేదు. ఇది కూడా టిడిపి పార్టీ ఉప ఎన్నికల్లో తెలంగాణాలో ఓట్లు, సీట్లు సంపాదించడానికి వేసిన రాజకీయ వల ( ఆళిజిరిశిరిబీబిజి శిజీబిచీ) గా ఉన్నదని కొందరి విశ్లేషకుల దృఢ అభిప్రాయం. అన్ని రాజకీయ పార్టీలకు చాల కాలంగా తెలంగాణా అంశం ఒక రాజకీయ ఆటవస్తువుగా మారింది. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం, రాజకీయాధికారం సంపాదించడానికి ఉపయోగపడే భావోద్వేగ రాజకీయాంశంగా వాడబడుతున్నది. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణాంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా వాడుకున్నదో అదే విధంగా తెలుగుదేశం కూడా తెలంగాణా విషయంలో అదే విధమైన రాజకీయ జిమ్మిక్కు ప్రయోగిస్తున్నదనే అనుమానం చాలమందికి కలుగుతున్నది. టిడిపి కి గనుక నిజమైన రాజకీయ చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామిక దృక్పథముంటే తెలంగాణా అంశంలో మళ్లీ ఒకసారి మెజార్టీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం లేదు. అదే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తెలంగాణా రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరమే లేదు. తెలంగాణా రాష్ట్రం తెలంగాణా ప్రజల జన్మహక్కు, అది తెలంగాణా ప్రజల మెజార్టీ అభిప్రాయం ప్రకారం ఏర్పడాల్సిందే. తెలంగాణా రాష్ట్ర డిమాండ్‌ గత ఐదు దశాబ్దాలుగా తెలంగాణా ప్రజలు ఎన్నోసార్లు అత్యంత ప్రజాస్వామికంగా వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన జరిగినపుడు కోస్తాంధ్ర రాయలసీమ ప్రజల నష్టం జరుగుకుండా ఉండడానికి ప్రజాభిప్రాయ సేకరణ అవసరమవుతుండవచ్చు. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలత ప్రకటించి తెలంగాణాకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీని ఓడించడానికి ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అప్పుడు టిడిపి రాజకీయ చిత్తశుద్ధిని నమ్మగలిగే ప్రాతిపదిక, మానసిక సంసిద్ధత తెలంగాణా ప్రజల్లో ఏర్పడే అవకాశముంటది. తెలంగాణా రాష్ట్ర డిమాండ్‌కు నిర్ద్వదంగా మద్దతునిస్తున్న జాతీయ పార్టీ అయిన బిజెపి కూడా దీనికి మినహాయింపు కాదు.

III

ఈ నేపథ్యంలో రాజీనామా చేయడం కన్నా టిఆర్‌ఎస్‌కు మరొక మార్గం లేదు. రాజీనామా చేసిన టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు కాంగ్రెసు ద్రోహాన్ని, ఇతర పార్టీల్లోని తెలంగాణ ఎం.ఎల్‌.ఏల, ఎం.పిల, ఎం.ఎల్‌.సిల ప్రేక్షక పాత్రను ప్రజల ముందుకు తీసుకొని పోతున్నారు. రాజీనామా అంగీకరించిన కాంగ్రెసుకు, ప్రేక్షక పాత్ర వహించిన ఇతర పార్టీల శాసన సభ్యులకు ఇప్పుడు ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. శాసన సభలోను, శాసన మండలిలోను తప్పించుకోగలిగారు. కానీ ప్రజల ముందు ప్రజా క్షేత్రంలో ప్రజాస్వామ్యంలో పవిత్రమైన ప్రజా న్యాయస్థానంలో జవాబు చెప్పుకోక తప్పదు. ”ఉప ఎన్నికల ఫలితాలు తీసికొనిరానున్న స్పష్టత ఆధారంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించాలో, ఆమోదించాలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెల్చుకోగలుగుతారు.” ‘అభివృద్ధి’ నినాదాన్ని కొనసాగించాలో, బందు పెట్టాల్నో వైఎస్‌ నిర్ణయించుకోగలుగుతాడు. దేవేందర్‌ గౌడ్‌, శ్రీహరి వంటి నాయకులు అదుపు చేయాలో లేక తెలంగాణాలో నాయకత్వ బాధ్యతలను వారికే అప్పజెప్పాల్నో ఆలోచించుకోగలుగుతారు. తెరాసతో పొత్తు పెట్టుకోవాల్నో లేక స్వతంత్రంగా పోటీ చేయాల్నో తీర్నానించుకొని చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం చేస్తాడు . . . తెలంగాణా వాదం విషయంలో ఉప ఎన్నికలు ఇవ్వబోయే స్పష్టత ఇన్ని విధాలుగా రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు మేలు చేస్తుందనడంలో సందేహించాల్సిన అవసరం లేదు. ఎన్నికల తరుణంలో దేశ ప్రజలు ప్రదర్శించిన సమిష్ఠి వివేకం (్పుళిజిజిలిబీశిరిఖీలి ఇరిరీఖిళిళీ) మన ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం, పరిపుష్టం చేస్తూ వస్తున్నదనేది అందరు అంగీకరిస్తున్న విషయం. రాబోయే తెలంగాణా ఉప ఎన్నికల ఫలితాల రూపంలో ప్రజలు ఇచ్చే స్పష్టత రాజకీయ నాయకులకు, పార్టీలకు మార్గదర్శనం చేయగల్గితే ఈ ఉప ఎన్నికలను ప్రజల పై రుద్దినందుకు తెరాస అధినాయకత్వాన్ని నిదించి పరిహసించాల్సిన అవసరం లేదు.

IV

ఈ పరిస్థితిలో టి.ఆర్‌.ఎస్‌. ప్రజా ప్రతినిధుల రాజీనామాల ఫలితం దక్కాలంటే ప్రజలను పూర్తిగా చైతన్యపరచాలి. ఉమ్మడి రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెసు పాలనలో జరిగిన అన్యాయాలను గ్రామస్థాయి వరకు ప్రజలకు వివరించాలి. ఇంతవరకు ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా వ్యవస్థల్లోపల జరిగిన కృషి ఫలితంగా ఈ ప్రచారానికి అవసరమయిన సామాగ్రి అందుబాటులోకి వచ్చింది. ఇంతవరకు జరిగిన అన్యాయాలకు స్పష్టమైన సాక్ష్యాలు దొరికినాయి. ప్రచారం చేసే విషయాలకు న్యాయబద్ధత వస్తుంది.

అయితే తెలంగాణ వాదులు కలిసికట్టుగా సాగితేనే ఎన్నికల ప్రచారం సత్ఫలితాలనిస్తుంది. తెరాస తెలంగాణ ఉద్యమానికి ఒక రాజకీయ పార్ష్యం మాత్రమే. తెరాస కాక తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక సంస్థలు, ప్రజా సంఘాలున్నాయి. వీటి మధ్య సహకారం పెంపొందితే ప్రచార ప్రభావం గణనీయంగా ఉండగలదు. అప్పుడు తెలంగాణ నాయకులపై ప్రజలు ఒత్తిడి పెంచగలరు. దానివలన తెలంగాణ రాజకీయాలు మారగలవు. తెలంగాణ అంశం చుట్టూ రాజకీయ సమీకరణలు జరిగితే తెలంగాణ పై వలస పాలకుల ఆధిపత్యం కూప్పకూలిపోతుంది. ఆ దిశగా ప్రయత్నం జరగాల్సిన సరి అయిన సమయ మిదే.

ఈ ఎన్నికలు తెలంగాణా వాదానికి, ఆంధ్ర వలసాధిపత్యానికి జీవన్మరణ సమస్య. తెలంగాణా బతుకు దెరువు నిలవాలంటే ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణా వాదం గెలిచితీరాలి. తెలంగాణా వాదాన్ని గెలిపించడానికి తెలంగాణా వాదులు, వివిధ ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న తెలంగాణా సానుభూతిపరులు సమైక్యంగా కృషి చేయాల్సిన అత్యంత పవిత్రమైన తరుణమిదే. ఈ ఉప ఎన్నికల్లో తెరాస గెలిస్తే వెంటనే తెలంగాణ ఏర్పడదు, కలిగే తక్షణ లాభమేమిటంటే ఆంధ్ర వలసాధిపత్యం పై తెలంగాణా ప్రజలకు మరొక్కసారి కలిగే నైతిక విజయం కలుగుతుంది. దీనితో తెలంగాణా ప్రజల మానసిక, స్థైర్యం హిమాలయాన్నోతంగా పెరుగుతుంది. తెలంగాణా ప్రజలు ఆంధ్ర ప్రాంత నాయకుల పెత్తనంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఓట్లేసి యాచించే స్థితి నుండి శాసించే స్థితికి ఎదిగివస్తారు. వచ్చే సాధారణ ఎన్నికల లోపు ఆంధ్ర వలసాధిపత్యానికి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీల్లో సమీకరణాలు చాల వేగవంతంగా మారుతాయి. తెలంగాణా రాష్ట్ర సాధన కవసరమయిన సమగ్ర రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకొనే రాజకీయ సానుకూలత తెలంగాణా సమాజంలో ఏర్పడుతుంది. ఈ రాజకీయ అవగాహనతో ఉప ఎన్నికల్లో తెలంగాణా వాదాన్ని గెలిపించడానికి తెలంగాణా వాదులమంతా ఐక్యమయి దీక్షా దక్షతలతో కృషిచేయాలి.

Click here to Print / read the PDF of తెలంగాణ ఉప ఎన్నికలు : తెలంగాణావాదుల కర్తవ్యం

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో