Feed on
Posts
Comments

- డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

091508aj01.jpg
ఆధునిక తెలంగాణ చరిత్రలో 1900-1956 మధ్యకాలం అత్యంత కీలకమైంది. తెలంగాణ ఆ ఐదున్నర దశాబ్దాల కాల వ్యవధిలో అనేక మార్పుల్ని చవిచూసింది. సాంస్క­ృతిక ఉద్యమాలు అంకురించాయి. రాజకీయపోరాటాలు విజృంభించాయి. నిజాం నవాబు పాలన అంతమైంది. కొంతకాలం మిలటరీ-పౌర అధికారుల పాలన తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ సంక్లిష్ట పరిణామాల నేపథ్యంలో సాంస్క­ృతిక, సామాజిక, రాజకీయ రంగాలలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.

ఇదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న సాహిత్య వాతావరణం, ఆధునిక ప్రక్రియల్లో ఇక్కడి వారి యోగదానాన్ని (కంట్రీబ్యూషన్‌) గురించిన సమాచారంమాత్రం విస్త­ృతస్థాయిలో ఆవిష్కరించబడలేదు. పాల్కురికి సోమన, బమ్మెరపోతన, పొన్నెగంటి వెలుగన్నల వంటి నాటి కవుల స్థాయి సమాచారం లభ్యం కావడం లేదు. అయితే ప్రాంతీయ అస్తిత్వ ఆకాంక్షలు విస్తరించిన ఈ తరుణంలోనైనా ఆనాటి విస్మ­ృత విషయాల్ని పరిశోధించడం అత్యవసరం. విశాలాంధ్ర అవతరణకు ముందుకాలపు తెలంగాణ సాహిత్య సమాచారం అక్షర జగత్తులోని వైవిధ్యాన్ని పరిచయం చేసేందుకు తోడ్పడుతుంది.

నిజానికి ఆనాటి తెలంగాణ విస్మ­ృత సాహిత్య విశేషాల్ని గురించిన పరిశోధన ఏనాడో వేగాన్ని అందుకోవలసింది. విశాలాంధ్ర ఏర్పడేనాటికి తెలంగాణలో తెలుగు సాహితీ వాతావరణం అంత బలంగా లేదని ఇప్పటికీ కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ అభిప్రాయంలో అణా వంతు నిజం కూడా లేదని నిరూపించేందుకు ఆనాటి హైదరాబాదు, వరంగల్లు సాహిత్య వాతావరణాన్ని అక్షరబద్ధం చేయాలి. 1938లో కె.సి.గుప్త ఆరంభించిన అణాగ్రంధమాల, వట్టికోట అళ్వార్‌స్వామి వంటి త్యాగధనుల కృషి కారణాలుగా 1940లలో తెలంగాణలో తెలుగు పాఠకుల సంఖ్య పెరిగింది.

ఉత్సాహవంతులైన యువరచయితల బృందం కూడా వెలిసింది. వీరికి తెలంగాణ రచయితల సంఘం వేదికగా మారింది. ‘తెలంగాణలో సాహిత్యో ద్యమాన్ని విస్త­ృత ప్రాతిపదికన నడిపించడానికీ, యువ రచయితలలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి తెలంగాణ రచయితల సంఘం స్థాపించబడింద’ని ఆ సంస్థ ప్రచురించిన ‘మంజీర’ చెబుతోంది. ‘తెలంగాణ రచయితల సంఘం కొందరు రచయితల కూటమి కాదు. అది ఒక ఉద్యమం. సాహిత్య మహోద్యమం, దాశరథి దానికి నాయకుడు. నారాయణరెడ్డి అనుచరుడు, ఉపనాయకుడు’ అని జనగామ ప్రాంతంలో ఆ సంఘ కార్యక్రమాలు నిర్వహించిన విపి రాఘవాచారి రాశారు.

‘హైదరాబాద్‌ సంస్థానంలోని ఎనిమిది తెలుగు జిల్లాలవారిని ఒకే వేదిక మీది కి తీసుకొనిరావడం, యువ రచయితలను ప్రోత్సహించడం, తెలుగు భాషాసాహిత్యాల్లో ఆసక్తిని పెంపొందించడం, ముషాయిరాలకు దీటు గా తెలుగు కవి సమ్మేళనాల్ని నిర్వహించడం తెలంగాణ రచయితల సంఘం ప్రధాన సంకల్పాలని’ దాశరథి ‘యాత్రాస్మ­ృతి’ ద్వారా స్పష్టపడుతోంది. ‘నూతన సాహిత్య వాతావరణానికి తెలంగాణ రచయితల సంఘం దోహదం చేస్తూ ఉండేదని’ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రాశారు. దాశరథి అధ్యక్షులుగా సినారె ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.

డి.రామలింగం, కాళోజీ, బి.రామరాజు, దేవులపల్లి రామానుజరావు, వెల్దుర్తి మాణిక్యరావు, వట్టికోట ఆళ్వారుస్వామి వంటివారు ఈ రచయితల సంఘం పునాదుల్ని బలోపేతం చేశారు. హైదరాబాద్‌లోని ప్రతాప్‌గిరి కోఠిలో ఎంతో వైభవంగా సాగిన సంఘం సమావేశాల్లో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, ఆరుద్రలు పాల్గొన్నారు. ‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులను సంఘం ఘనంగా సన్మానించింది. సంఘం కవిత్వ రచనలో పోటీల్ని నిర్వహించింది. ప్రవర్ధమాన కవుల్ని ప్రోత్సహించింది. 1953లో ప్రబంధ గోష్ఠులు నిర్వహించింది. 65 మంది కవుల రచనలతో ‘ఉదయ ఘంటలు’ అనే కవితా సంకలనాన్ని ప్రచురించింది.

ఇందులో అన్ని ప్రాంతాల కవుల రచనల్ని ప్రకటించింది. 1950′ల్లో సంఘంలో పనిచేసిన కవులు, రచయితలు హైదరాబాద్‌లోని ఆచార్య పల్లా దుర్గయ్య ఇంట్లో సమావేశమయ్యేవారు. ‘దుర్గయ్యగారి ఇల్లు ఆ రోజుల్లో కవితా దుర్గం’ అని సుప్రసన్నాచార్య అభివర్ణించారు. కనీసం ఐదేళ్ళపాటు సాహిత్య వసంతాల్ని నిర్మించిన ‘తెరసం’ విశాలాంధ్ర అవతరణ జరిగిన వెంటనే మోడువారిన మానుగా మారిపోయింది. నాటి ‘సందిగ్ధ సందర్భం’లో తెరసం నిర్వహించిన చారిత్రక భూమికను గురించి ప్రముఖంగా ప్రస్తావించిన రచనలు తక్కువే. కోస్తాంధ్రలో భావ,

అభ్యుదయ కవిత్యోద్యమాలు ఎంత కీలకమైనవో తెలంగాణలో తెరసం కొనసాగించిన సాంస్క­ృతిక ఉద్యమంసైతం అంతే కీలకమైంది. అయితే సంఘం ప్రాధాన్యత విస్మరణకు లోనైంది. కోవెల సుప్రసన్నాచార్య వెలువరించిన ‘దర్పణం’ సమర్పణ’ సంకలనాలలోని కొన్ని వ్యాసాల ఆధారంగా అప్పటి ఓరుగల్లు సాహిత్య జాగృతిని లెక్కగట్టవచ్చు. 1951లో వరంగల్లు నగర యువ సాహితీ బృందం ‘సుకృతి’ పేరుతో ఒక లిఖిత మాస పత్రికను వెలువరించింది. కందుకూరి వీరేశలింగం ముఖచిత్రంతో వెలువడిన ఈ సంచికలో ప్రముఖ పరిశోధకుడు దూపాటి వెంకటరమణాచార్యులు ‘పరశురామ పంతుల లింగమూర్తి’పై వ్యాసాన్ని రాశారు.

వరంగల్లులో పోతన జయంతులు జరిగాయి. విశ్వనాధ సత్యనారాయణ, భమిడి కామేశ్వరరావు, జటావల్లభుల పురుషోత్తం, దివాకర్ల వేంకటావధాని, సరిపల్లి విశ్వనాధశాస్త్రి వంటి ప్రసిద్ధులు పోతన జయంతి ఉత్సవాలలో ప్రసంగించారు. 1955 ఫిబ్రవరిలో వరంగల్లు యువకవులు ‘సాహితీ బంధు బృందం’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ పలువురి కవితలతో ‘తొలికారు’ అనే కవితా సంకలనాన్ని వెలువరించింది. ఇలా వరంగల్లు సాహిత్య సమాచారంతో ఒక ఉద్గ్రంధమే తయారవుతుంది. నాటి తెలంగాణలో సాహితీ చైతన్యాన్ని పెంపొందించిన మరో రెండు సంస్థలు కూడా ప్రధాన సాహిత్య చరిత్రల్లో విస్మరణకు లోనయ్యాయి.

‘సాధన సమితి’ అనే సంస్థ 1939లో ఆవిర్భవించింది. కథానిక ప్రక్రియను బాగా ప్రోత్సహించింది. 20 పుస్తకాలు ప్రచురించింది. ప్రత్యూష అనే లిఖిత పత్రికను నిర్వహించింది. నెల్లూరు కేశవస్వామి, భాగి నారాయణమూర్తి, బూర్గుల రంగనాధరావు, వెల్దుర్తి మాణిక్యరావు, జె.సూర్యప్రకాశరావు, పిల్లలమర్రి హనుమంతరావు ఇందులో ప్రముఖంగా పాల్గొన్నారు. 1955లో నవలల పోటీ నిర్వహించింది. దేవులపల్లి రామానుజరావు రాసినట్టు ‘తెలంగాణలో తెలుగును మరింత తేజోవంతం చేయడానికి ఆవిర్భవించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ఆలంపురం, మంచిర్యాలల్లో నిర్వహించిన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది.

ఆలంపురంలో పరిషత్తు సభలకు 20,000 మంది హాజరయ్యారని గడియారం రామకృష్ణ శర్మ శతపత్రం చెబుతోంది. మంచిర్యాల సభలు కూడా మహా వైభవంగా జరిగినట్టు వయోవృద్ధ సాహితీవేత్తల జ్ఞాపకాలు తేటతెల్లం చేస్తున్నాయి. వేలూరి శివరామశాస్త్రి ఈ సభల్లో పాల్గొని పరిషత్తు పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి విజయపత్రాలు బహూకరించారు. తూఫ్రాన్‌ తదితర ప్రదేశాల్లో జరిగిన పరిషత్తు మహాసభలు ఆధునిక సాహిత్య ప్రక్రియల్ని విపులంగా చర్చించాయి. 1946 లో మహబూబ్‌నగర్‌లో జరిగిన కవిసమ్మేళనంలో మహాకవి దాశరథి తన తొలి కవితను వినిపించారు.

ఇట్లా ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ‘సాధన సమితి’, సారస్వత పరిషత్తు’ ఉత్తమస్థాయి కృషి తగినస్థాయిలో నమోదు కావాలి. నిజాం కాలేజీలో తెలుగు విద్యార్థులు నిర్వహించిన ఆంధ్రాభ్యుదయోత్సవాల సమాచారం నమోదు కావాలి. 1912 నుంచి తెలంగాణలో కథాసాహిత్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడేనాటికే దాదాపు 1500 కథలు తెలంగాణ నుంచి వచ్చాయి. ఒకానొక బృహత్‌ కథా సంకలనకర్తలు 1980 తర్వాతే తెలంగాణలో తెలుగు కథ ఆవిర్భవించినట్టు లగుర్తించారు! ‘1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి కె.రామలక్ష్మి సంపాదకత్వంలో రచయిత్రుల సమాచారం అనే పుస్తకాన్ని వెలువరించింది.

అయితే తెలంగాణ ప్రథమ కథా రచయిత్రి నందగిరి ఇందిరాదేవికి సంబంధించిన సమాచారమే ఇందులో లేదంటే మిగతావారి పరిస్థితిని ఊహించుకోవచ్చు’ అని సంగిశెట్టి రాశారు. ఆయన ‘దస్త్రం’ పుస్తకం వెయ్యి తెలంగాణ కథల సమాచారాన్ని అందించింది. సురవరం ప్రతాపరెడ్డి యావత్‌ రచనలే ఇంకా లభ్యం కాలేదు. ఇంకా చాలామంది వివరాలు వెలుగులోకి రావలసివుంది. అప్పటి కథానికల అధ్యయనం ద్వారా నాటి తెలంగాణ జీవద్భాషను నాటి సంక్లిష్ట సామాజిక రాజకీయ సాంస్క­ృతిక పరిణామాల్ని అంచనా వేసేందుకు వీలవుతుంది.

తెలంగాణలో 1930 నాటికే నవలా రచన ఆరంభమైనట్టు గోల కొండ కవుల సంచిక ద్వారా తెలుస్తోంది. వరంగల్లు నుండి వెలువడిన ‘ఆంధ్రాభ్యుదయం’ పత్రికాసంపాదకులు కోకల సీతారామశర్మ ‘పావని’ పేరుతో ఒక నవల రాశారు. హితబోధిని (19) పత్రికా సంపాదకులు బి.శ్రీనివాసశర్మ రచించిన ‘ఆశాలేశము’ తెలంగాణలో రచించబడిన తొలి నవల అని పరిశోధకుల అభిప్రాయం. తొలినాళ్ళ తెలంగాణ నవలలు అంత సులువుగా దొరకవు. విశేష ప్రయత్నం జరగాలి. 1956 నాటికి తెలంగాణ ప్రాంతంలో వికసించిన వచన కవితా ప్రక్రియను గురించి నిశిత విశ్లేషణ జరగాలి.

తెలంగాణ కవులు అప్పటివరకు తమ సాధనలో ఉన్న పద్యాన్ని, అభ్యాసంతో నడిచిన గేయాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టలేకపోయారు. ఈ రెంటితోపాటు వచన కవిత నూ సాధన చేశారు. దాశరథి వెలువరించిన ‘పునర్నవం’ ఇందుకొక ఉదాహరణ. ఆయన ‘మస్తిష్కంలో లేబరేటరీ’ తెలంగాణ తొలి వచన కవిత అంటారు. ఈ విషయంలో మరింత పరిశీలనలు జరగాలి. తెలంగాణలో యక్షగాన ప్రదర్శన సంస్క­ృతి బహుళంగా జనాదరణ పొందింది. అందువల్ల సాంఘిక నాటక రచన- ప్రదర్శనల్ని గురిం చి ఎవరూ పెద్దగా ఆసక్తిని కనబరచలేదు.

అయితే, పరిశోధన- విమర్శనారంగాల్లో మాత్రం 1956 నాటికే ఇక్కడి విద్వాంసులు గొప్ప పరిణతిని కనబరిచారు. విమర్శను, పరిశోధనను విడదీయలేని పద్ధతిలో వ్యాసాల్ని రచించడం ఇక్కడి విధ్వాంసుల ఆనాటి విధానం, దూపాటి వెంకట రమణాచార్యుల చొరవతో తెలంగాణలో తెలుగు సాహిత్య పరిశోధనారంగం కొత్త అడుగులు వేసింది. వెల్దండ ప్రభాకరామాత్య అనే పండితుడు అముక్త మాల్యదను విశ్లేషిస్తూ గొప్ప రచన చేశారు. అంబడిపూడి వెంకటరత్నం, ఆదిరాజు వీరభద్రరావు, సింగూరి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి విలువైన విమర్శా వ్యాసాలు రచించారు. ఇవి ఆనాటి పత్రికల్లో దర్శనమిస్తాయి.

తెలంగాణలో జన్మించి 1900-1956 సంవత్సరాలమధ్యకాలంలో కవితా రచన చేసిన కవుల పేర్లు ప్రధాన సాహిత్య చరిత్రలో కనిపించవు. అడ్లూరి అయోధ్యరామకవి, మేడిచర్ల ఆంజనేయమూర్తి, చెలమచర్ల రంగాచార్యులు, రంగరాజు కేశవరావు, గంగుల శాయిరెడ్డి, సిరిసిన హళ కృష్ణమాచార్యులు, కంభంపాటి అప్పన్నశాస్త్రి, బెల్లంకొండ నరసింహాచార్యులు, చిలకమర్రి రామానుజాచార్యులు, భాగి నారాయణమూర్తి వంటి ప్రతిభావంతులు చాలాకాలం క్రితమే విస్మ­ృత కవుల కోవలో చేరారు. వీరితోపాటు ఇక్కడి విస్మ­ృత కవులందరి రచనలకు సాహిత్య చరిత్రలో స్థానం దొరకాలి.

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com