Feed on
Posts
Comments

- ఎం. వేదకుమార్‌

సరిగ్గా వందేళ్ళ క్రితం… 1908 సెప్టెంబర్‌ 28
092808_aj1.jpg

హైదరాబాద్‌ నగరాన్ని మూసీ వరదలు ముంచెత్తాయి. ఆ వరద బీభత్సాన్ని తట్టుకునే శక్తి ఆ మహానగరానికి లేకపోయింది. ఫలితంగా కేవలం 48 గంటల్లో 15 వేల మంది మృతి చెందారు. 80 వేల ఇళ్లు కూలిపోయాయి. ఒకే ఒక్క రోజులో 17 అంగుళాల వర్షపాతం నమోదైంది. అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో 11 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది. నగరంలో మూడోవంతు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఉత్పాతాలను తట్టుకునే, నివారించే ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు ఏమీ లేని ఆ రోజుల్లో అలా జరగడం సహజమే కావొచ్చు. కాని వందేళ్ల తరువాత 2008లో నేటి పరిస్థితి ఏమిటి? నేటికీ అదే దుస్థితి. మరింత దీనావస్థ. నమ్మశక్యం కాకున్నా నమ్మితీరాల్సిన చేదు నిజం. నేడు మూసీకి వరదలు వస్తే, కళ్ళప్పగించి చూడడం తప్ప చేయగలిగిందేమీ లేదంటే గుండె మండిపోతుంది. ఆనాటి వరద బీభత్సం ప్రకృతి ప్రకోపం అని సరిపెట్టుకున్నా రాబోయే బీభత్సాలు మాత్రం అక్షరాలా మానవ తప్పిదాల కారణంగానే.

092808_aj2.jpg
ప్రపంచంలోని మానవ నాగరికతలన్నీ పరిఢవిల్లింది నదీతీరాల్లోనే. హైదరాబాద్‌ రూపుదిద్దుకున్నదీ అలానే. నేటి మూసీకి ఎంతో భిన్నం ఆనాటి మూసీ. అందుకే మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా మూసీ తీరం ఒడ్డున హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించారు. మూసీకి వరదలు రావడం కొత్తేమీ కాదు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఒడ్డుకు అరకిలోమీటరు దూరం వదిలి కట్టడాలు నిర్మించారు. ప్రతీ 20 లేదా 30 ఏళ్లకోసారి మూసీలో నీటిమట్టం గణనీయంగా పెరిగి వరదగా మారుతుంటుంది. అయితే సాధారణంగా అది కట్టలు దాటి రాదు.

కాని ప్రతీ 50 లేదా 100 ఏళ్లకోసారి మాత్రం వరద బీభత్సంగా వస్తుంది. అప్పుడు వరదనీరు కట్టలు దాటి వచ్చి తీరప్రాంతాలను ముంచెత్తుతుంటుంది. అలాంటి మహావరద వచ్చి నేటికి వందేళ్లు గడిచింది కాబట్టి రేపో, మాపో మరోసారి అలాంటి ఉత్పాతం చోటు చేసుకోనుందని నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. 1970, 2000 సంవత్సరాల్లో వచ్చిన మూసీ వరదలను వారు ముందస్తు హెచ్చరికలుగా ఉదహరిస్తున్నారు. ఆ రెండు సందర్భాలలోను రెండు రోజుల పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై పోయాయి. ఫీవర్‌ హాస్పిటల్‌ లాంటి ప్రాంతాల్లో వరద మహోగ్రరూపం దాల్చింది. ఈసారి దాన్ని మించిన వరద వస్తే తట్టుకునే శక్తి హైదరాబాద్‌ నగరానికి ఉందా? హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా ఆథారిటీ ఏర్పాటు వల్ల పెరిగిన విస్తీర్ణంతో భారతదేశంలోనే రెండో అతి పెద్ద నగరం ఖ్యాతిని పొందుతున్న హైదరాబాద్‌ ప్రకృతి ఉత్పాతాలను తట్టుకోవడంలోనూ అదే స్థాయిలో ఉందా అంటే భుజాలు తడుముకోక తప్పదు.

1908 నాటి పరిస్థితి

అప్పట్లో నిజాం నవాబుల కట్టడాలన్నీ మూసీ దక్షిణ ప్రాంతంలోని పాతబస్తీలోనే ఉండేవి. సమీప శివార్లతో కలిపి అక్కడి జనాభా 1.92 లక్షలు. ఉత్తర దిశలో చాదర్‌ఘాట్‌ వైపు కొత్తపట్టణం రూపుదిద్దుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, రైల్వేస్టేషన్‌ లాంటివన్నీ అక్కడ ఏర్పడ్డాయి. బ్రిటిష్‌ రెసిడెన్సీ అక్కడే ఉండింది. ఇక్కడి జనాభా 1.60 లక్షలు. మూసీ నదికి సుమారుగా 4 మైళ్ళ దూరంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉండేది. అక్కడో 83 వేల మంది ఉండేవారు. బొలారం, తిరుమలగిరి లాంటి ప్రాంతాల్లో మరో 13 వేల మంది ఉండేవారు. అంతా కలిపి నగర జనాభా 4.48 లక్షలు.

మూసీ నది తూర్పు ఒడ్డు నిజానికి పశ్చిమం కంటే తగ్గు ఎత్తులో ఉన్నప్పటికీ, వివిధ రకాలుగా దాని ఎత్తు పెంచారు. నది నగరం మధ్యలో ఉండడంతో ఒడ్డున ఉన్న ప్రాంతాలకు బాగా డిమాండ్‌ పెరిగింది. నదిపై నాలుగు వంతెనలు ఉండేవి.

ఆనాడు ఏం జరిగిందంటే…
సోమవారం 1908 సెప్టెంబర్‌ 28. మధ్యాహ్నం 11 గంటలయ్యేసరికల్లా నది నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. శనివారం ఉదయం నుంచే పరిస్థితిలో మార్పు వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో అరగంట పాటు తుంపరగా వర్షం పడింది. ఆ తరువాత 6.30 దాకా భారీవర్షం కురిసింది. రాత్రి 9 గంటల సమయంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. ఓ అరగంట కురిసింది. ఆ తరువాత రాత్రి 11.30 గంటలకు కుండపోతగా వర్షం మొదలైంది. తెల్లారేవరకూ అలా కురిసింది. ఆదివారం ఉదయం 8 గంటల వరకూ నమోదైన వర్షపాతం 15.3 సెంటీమీటర్లు. ఆ రోజంతా కూడా కొద్దిపాటి విరామాలతో వర్షం పడుతూనే ఉంది.

092808_aj3.jpg
ఆదివారం అర్థరాత్రి తరువాత మరోసారి కుండపోతగా కురిసింది. ఆ రోజున కురిసిన వర్షపాతం లెక్కకు అందనిదని అంటారు. అప్పటికే నదీపరివాహక ప్రాంతంలోని చెరువులన్నీ నీటితో నిండిపోయాయి. ఇక నీటిని ఇంకింపజేసుకోలేనంతగా నేల చిత్తడిగా మారిపోయింది. అలాంటి సమయంలో కురిసిన భారీ వర్షం చెరువుల కట్టలు తెంపేసింది. ఒకదాని తరువాత ఒకటిగా అలా కట్టలు తెగుతూనే వచ్చాయి. వీటిల్లో ముఖ్యమైనవి పల్మాకుల, పర్తి. పల్మాకులకు దిగువన, హైదరాబాద్‌కు 22 మైళ్ళ దూరంలో పర్తి చెరువు ఉంది. సోమవారం ఉదయానికి శంషాబాద్‌లో నమోదైన 24 గంటల వర్షపాతం 32.5 సెం.మీ. ఆ రోజున ఉదయం 4.30 గంటలకు పల్మాకుల కట్ట తెగితే, మరో అరగంటకు పర్తికి అదే దుస్థితి పట్టింది. ఆ నీరంతా కూడా మూసీలోకి చొచ్చుకువచ్చింది. ఆదివారం ఉదయం మూసీలో 4 అడుగుల ఎత్తులో నీరు ఉండగా, 10 గంటలకల్లా అది 20 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కోల్సావాడి (ప్రస్తుత ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌) ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరడం మొదలైంది. సాయంత్రం 4 గంటల కల్లా రోడ్లపై నీరు ప్రవహించడం మొదలైంది. సోమవారం ఉదయానికి పరిస్థితి మరింత భయంకరంగా మారింది. పురానాపూల్‌ వెనుకతట్టులోకి నీరు చొచ్చుకురావడం మొదలైంది. 3 గంటల ప్రాంతంలో పశ్చిమ దిశలోని నగర రక్షణ గోడ కూలిపోయింది. ఇక అప్పటి నుంచీ రోడ్లపై నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అది పది అడుగుల ఎత్తుకు చేరుకుంది.

సోమవారం ఉదయం 7 గంటల నుంచే వరద బీభత్సం మొదలైంది. పది గంటల సమయానికి నాలుగు వంతెనల మీదుగా వరదనీరు ప్రవహించసాగింది. 11 గంటల సమయానికి గరిష్ఠస్థాయికి చేరుకుంది. సాధారణంగా రెండు ఒడ్డుల మధ్య 700 అడుగుల దూరం ఉండేది. ఆ సమయంలో మాత్రం కిలోమీటరుకు మించిన వెడల్పుతో మూసీ నీళ్ళు పారసాగాయి. మధ్యాహ్నం 3 గంటల దాకా అదే పరిస్థితి. ఆ తర్వాతే వరద ఉద్ధృతి తగ్గసాగింది. రాత్రి 8 గంటలకల్లా సాధారణ వరద స్థాయికి చేరుకుంది.

సెప్టెంబర్‌ 26,27 తేదీల్లో కురిసిన ఆ భారీ వర్షపాతానికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను. మరి అలాంటి తుపాను మరొకటి వస్తే భాగ్యనగరం తట్టుకోగలదా? అందుకు సమాధానం ఇప్పటికీ మన అధికారుల వద్ద, పాలకుల వద్ద లేదు.

మహా వరద సృష్టించిన బీభత్సం
కోల్సావాడి ప్రాంతంలో సుమారు రెండు వేల మంది వరదలో చిక్కుకుపోయారని, వారంతా నీటిలో మునిగిపోయారనో, కొట్టుకుపోయారనో చెబుతారు. పేట్లబురుజు ప్రాంతంలో నగర రక్షణ గోడలు ఎక్కిన కొన్ని వందల మంది కూడా ఆ గోడలు కూలి వరదలో కొట్టుకుపోయారని అంటారు. ఎంతో మంది ప్రాణరక్షణ కోసం చెట్లు ఎక్కితే, ఆ చెట్లు కూడా కూలిపోయి వారు మృతి చెందారట. జనం చాలామంది భవనాల పై అంతస్తులకు వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. విక్టోరియా జనానా ఆసుపత్రిలోకి భారీస్థాయిలో నీరు చేరుకున్నా రోగులను మాత్రం కాపాడగలిగారు. ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లోని ఓ చింతచెట్టు ఈ వరదల సందర్భంగా కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడింది. వరద ధాటికి మూసీ ఒడ్డున ఇళ్లు అన్నీ కూడా దాదాపుగా నేలమట్టమైపోయాయి. సుమారుగా 20 వేల ఇళ్లు కూలిపోయాయని, 80 వేల మంది నిరాశ్రయులయ్యారని అంచనా. బాధితులకు రాజభవనాల్లో కూడా ఆశ్రయం కల్పించారు. రెండు వారాల పాటు సామూహిక వంటశాలలు నిర్వహించారు.

వారసత్వ భవనాలకు అపారనష్టం
మూసీ వరదల కారణంగా భాగ్యనగరం మనుషులను, ఆస్తిపాస్తులనే కాకుండా ఎనలేని చారిత్రక ప్రాధాన్యం ఉన్న అపార వారసత్వ సంపదను కూడా కోల్పోయింది. వాస్తునైపుణ్యంతో కూడిన అద్భుత భవనాలెన్నో మూసీ వరద ధాటికి నాశనమైపోయాయి.

విశ్వేశ్వరయ్య రాక
వరద పరిస్థితులను చూసి, ఇకపై మళ్లీ ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూడాలని నిజాం, నాటి సుప్రసిద్ధ ఇంజినీరు సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించారు. రెండు జలాశయాలు నిర్మించాలని, ్రడైనేజీ వ్యవస్థను ఆధునికీకరించాలని ఆయన సూచించారు. ఆయన సూచనల మేరకు 1920లో ఉస్మాన్‌సాగర్‌, 1927లో హిమాయత్‌సాగర్‌లను నిర్మించారు. ఇవి నగరానికి వరద ముప్పును తప్పించడమేగాకుండా మంచినీటి వసతినీ కల్పిస్తున్నాయి. విశ్వేశ్వరయ్య సూచనల మేరకు ్రడైనేజీ వ్యవస్థను కూడా పునర్‌ నిర్మించారు. ఆధునికీకరించారు.

నిజాం చేపట్టిన చర్యలు
1908లో మూసీ వరదల సమయంలో నిజాంగా మీర్‌ మహబూబ్‌ అలీపాషా ఉన్నారు. ఆ వరదలకు ఆయన చలించిపోయారు. ఉదార హృదయంతో బాధితులను ఆదుకున్నారు. 1911లో చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ గద్దెనెక్కారు. 1908 నాటి బీభత్సం మరోసారి చోటు చేసుకోకూడదని భావించి నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే 1912లో సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు (సిఐబి)ని ఏర్పాటు చేశారు. మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన ఆవశక్యతను, దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఆ కాలంలోనే గుర్తించారు. అందుకు ఓ కాలపరిమితినీ నిర్దేశించుకున్నారు. సిటీ ప్లానింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటి ప్రఖ్యాత ఇంజినీర్లు దలాల్‌, సర్‌ అలీ నవాజ్‌ జంగ్‌, కద్‌మైత్యార్‌ జంగ్‌ లాంటి వారంతా ఆయా పనుల్లో కీలకపాత్ర వహించారు. సమగ్ర నగర ప్రణాళికను తయారుచేయాల్సిన ఆవశకత్యను ఆ కాలంలోనే సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎంతో నొక్కి చెప్పారు. ఆయన సూచనలకు అనుగుణంగా నగరంలో పౌరవసతుల మెరుగుకు సిఐబి చర్యలు తీసుకుంది. పార్కులు, బహిరంగ స్థలాలు, ఆటస్థలాలు నిర్మించారు. స్లమ్‌ క్లియరెన్స్‌, హౌజింగ్‌ కాలనీల నిర్మాణం, నూతన తరహాలో మంచినీరు, ్రడైనేజీ వ్యవస్థల ఏర్పాటు, దుమ్ములేని రోడ్ల నిర్మాణం వంటి పథకాలు చేపట్టారు. వీటన్నింటి వల్ల నాటి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. భాగ్యనగరం అందమైన నగరంగా రూపుదిద్దుకోవడం మొదలైంది.

వరదల తరువాత మూసీనదికి రెండు పక్కలా రక్షణ గోడలను విలక్షణశైలితో నిర్మించారు. మూసీ తీరం వెంట హైకోర్టు, సిటీ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్‌, అసఫియా లైబ్రరీ లాంటి ఎన్నో అద్భుత కట్టడాలు రూపుదిద్దుకున్నాయి. విక్టోరియా మెమోరియల్‌ హాస్పిటల్‌, ఇతర వారసత్వ ప్రాధాన్య భవనాలకు మరమ్మతులు చేశారు. కుతుబ్‌షాహీల కాలంనాటి ఫౌంటెన్‌ను నేటికీ విక్టోరియా మెమోరియల్‌ ఆసుపత్రిలో చూడవచ్చు. ఇలాంటి కట్టడాలు రూపుదిద్దుకునే క్రమంలో సిఐబి కొన్ని పొరపాట్లు కూడా చేసింది. కొంతమంది ఉన్నతాధికారుల అవగాహన లేమి కారణంగా చారిత్రక ప్రాధాన్యం గల ఎన్నో భవనాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని కమాన్‌లు (గేట్‌ పోర్షన్‌లు) పూర్తిగా తొలగించారు. అలాంటివాటిని నివారించాల్సిన అవసరం ఉంది.

62 ఏళ్ల తర్వాత…
ఎన్నో విపత్తులు ప్రకృతి కారణంగా కాకుండా మానవ తప్పిదాల వల్లే చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటిని ప్రకృతి విపత్తులు అనడం కూడా తప్పే. 1970లో నగరాన్ని ముంచెత్తిన వరదలు కూడా అలాంటివే. చెరువుల పరిరక్షణ బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వహించి ఉంటే ఆ వరదలు వచ్చేవే కావు. అప్పుడు కూడా భారీ వర్షాల కారణంగా చెరువులు నిండిపోయాయి. ఒకదాని తరువాత ఒకటిగా కట్టలు తెగుతూ చెరువుల నీరంతా ఉస్మాన్‌సాగర్‌ను చేరుకోసాగింది. అందులోకి వస్తున్న నీరు ఎంత, బయటకు వదలాల్సిన నీరు ఎంత అనే విషయాలను పట్టించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఆ చెరువు పూర్తిగా నిండిపోయింది. చెరువు ఒకటికి మించిన సంస్థల పర్యవేక్షణలో ఉండడం కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఫలితంగా ఉస్మాన్‌సాగర్‌ చెరువుకట్టకు ముప్పు ఉందని భావించిన అధికారులు హడావిడిగా గేట్లు తెరిచారు. ఫలితంగా వరద నీరు నగరాన్ని ముంచెత్తింది. అప్పుడు కూడా ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అధికారుల హడావిడి ప్రచారం కూడా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించింది.

2000లో…
ఇది ప్రధానంగా మూసీ ప్రత్యక్ష వరద కానప్పటికీ పట్టణ వరదలకు సంబంధించిన సమస్యే. హుసేన్‌సాగర్‌ నిండిపోవడంతో ట్యాంక్‌బండ్‌ పరిరక్షణకు అన్నట్లుగా కొద్ది మొత్తంలో నీటిని బయటకు వదలాలని అధికారులు భావించారు. మత్తడిని కొంతమేర తొలగించడంతో గాంధీనగర్‌, అశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, నల్లకుంట లాంటి దిగువ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇక్కడ కూడా మానవ తప్పిదాలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది. మూసీ మార్గం ఇరుకు కావడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేకపోవడం లాంటివన్నీ వరద ముంపునకు కారణాలయ్యాయి.

నిజానికి మూసీ నది హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతిలో విడదీయలేని భాగం. మూసీ లేనిదే హైదరాబాద్‌ లేదనుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడలా కాదు. నగరం మధ్యలో మూసీ మురికి కాలువ ఎందుకు ఉన్నదా అని ఆలోచిస్తున్నారు. ఇదీ మన అ’భాగ్యనగరం.’

ఓ చెట్టు కథ

092808_aj4.jpg
చరిత్రలో ప్రత్యేకించి ఓ చెట్టుకు విశిష్ట స్థానం లభించడం ఎంతో అరుదు. అలాంటి అరుదైన ఘనతను పొందింది మూసీకి ఉత్తరాన ఉన్న ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లోని ఓ పెద్ద చింత చెట్టు. పాత ఇన్‌పేషెంట్‌ బ్లాక్‌లో ఇది ఉంది. నిజానికి ఒకప్పుడు ఈ బ్లాక్‌ ఉన్న స్థలమంతా కూడా ఓ ఉద్యానవనంగా ఉండేది. ఆసుపత్రికి స్థలం అవసరమైన కారణంగా ఆ పార్కును కూడా ఆసుపత్రి స్థలంలో కలిపేశారు. 1908 మూసీ వరదల్లో సుమారు 150 మంది దానిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నట్లు చెబుతుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర చెట్లను ఆశ్రయించిన వారు, కూకటివేళ్లతో సహా ఆ చెట్లు కూలిపోయి వరదకు బలైపోయినా, ఈ చెట్టు ఎక్కినవారు మాత్రం సురక్షితంగా ఉండగలిగారు. రెండు రోజుల పాటు వారు తిండీ తిప్పలు లేకుండా అలా చెట్టుపైనే ఉండిపోయారని చెబుతారు. అది సుమారు 400 ఏళ్ళ క్రితం నాటిదని భావిస్తున్నారు. అది నేటికీ సజీవంగా ఉంది. అంతే కాదు. చెట్టు చేసిన మహోపకారాన్ని ప్రస్తుతిస్తూ ఓ ఫలకాన్ని కూడా దానికి అమర్చారు. దానికి ‘వారసత్వ’ హోదా ఇప్పించే ప్రయత్నాలూ జరిగాయి. సాధారణంగా అలాంటి హోదా కట్టడాలకు మాత్రమే దక్కుతుంది. ఓ ‘సజీవ’ ఉనికి ఇలాంటి గుర్తింపును పొందడం అత్యంత అరుదు. ఆ చెట్టు ప్రాధాన్యం దృష్ట్యా దానికి ఇలాంటి గుర్తింపును హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ కమిటీ (హెచ్‌సీసీ) ఇస్తుంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అఫ్జల్‌గంజ్‌ ఆసుపత్రి ఉండేది. 1908 మూసీ వరదల్లో అది దెబ్బ తినడంతో 1924లో ఏడో నిజాం అక్కడ ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ను నిర్మించారు. ఆ చెట్టు గొప్పదనాన్ని గౌరవిస్తూ ఏటా నవంబర్‌ 30న హాస్పిటల్‌ డేను ఆసుపత్రి సిబ్బంది అక్కడే నిర్వహిస్తుంటారు. 2002లో ప్రముఖ కవి రావూరి భరద్వాజ ఆ చెట్టును ‘ప్రాణధాత్రి’గా అభివర్ణించారు.

నదీమ తల్లిని ప్రార్థించిన నిజాం
1908 మూసీ వరద నేపథ్యంలో హిందూ పూజారుల సూచన మేరకు నిజాం మహబూబ్‌ అలీ ఖాన్‌ మూసీ తీరానికి వెళ్లి పూజలు చేశారని, విలువైన కానుకలు, ఆభరణాలు, చీర అర్పించారని చెబుతారు.

(రచయిత పట్టణ ప్రణాళిక వ్యవహారాల నిపుణులు )

One Response to “1908-2008 వరద మూసీకి వందేళ్ళు”

  1. 1
    krishnasai Says:

    మంచి వ్యాసం…మూసీ నది హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతిలో విడదీయలేని భాగం. మూసి నది చరిత్రను, దాని ప్రాముఖ్యతను గురించి చాల చక్కగా వివరించారు. శతాబ్దం గడిచి పొయిన, ఇప్పటి వరకు..పాలకులు నగర అభివృద్ధిని నిర్లక్ష్యం వహించారనడం చారిత్రాక వాస్తవం. ఈ విషయాన్ని వ్యాస రచయిత చాల చక్కగా వివరించారు.
    — క్రిష్ణ సాయి (జర్నలిస్ట్ )

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com