![]()
హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటులో లోపాలు ఉన్నాయని ‘సిటిజన్ ఫర్ బెటర్ ట్రాన్స్పోర్టు’ ప్రతినిధులు తాజాగా ఆరోపించారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ కన్వీనర్ డాక్టర్ సి.రామచంద్రయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్, ఉమేష్ వర్మలు మాట్లాడుతూ ప్రభుత్వం మేటాస్తో కుదుర్చుకున్న మెట్రో ఒప్పందం ఆ సంస్థకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ఆరోపించారు.
ఈ నెల 25న సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం మెట్రో రైలు కార్యాలయాన్ని సందర్శించి ఈ ఒప్పంద పత్రాలను పరిశీలించినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రభుత్వం మేటాస్కు అనుకూలంగా అనేక అంశాలను ఒప్పందంలో చేర్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. రైల్వే నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యకలాపాలను ఈ ప్రాజెక్టులో భాగంగా చేర్చారని విమర్శించారు.
- ఒప్పందం ప్రకారం స్థలాల అప్పగింత కుదరకపోతే వేరొక ప్రదేశంలో ఆ స్థలాలను కేటాయించాల్సి ఉంటుందని వివరించారు.
- అదేవిధంగా భవిష్యత్తులో అదనంగా భూములు ఇవ్వకూడదన్న నిబంధనలు కానీ ఆంక్షలు కానీ ఏమీ లేవని పేర్కొన్నారు.
- ఈ ప్రాజెక్టు నిర్వాహకులు నిర్మించే నిర్మాణాలపై ఎటువంటి పన్నులు వేయరని వివరించారు.
- ఆస్తి పన్ను, వినోదపు పన్నుల నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
- ఒప్పందం ప్రకారం మెట్రో పనులు ప్రారంభించడానికి కావల్సిన అనుమతులు పొంది ఆ యా కారిడార్లను మేటాస్కు గడువు లోపల అందించని పక్షంలో ప్రభుత్వం ప్రతి రోజూ రూ.24 లక్షలు చొప్పున అపరాద రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఇది గరిష్టంగా రూ.48 కోట్లకు ఉందన్నారు.
- వాస్తవానికి కేంద్రం నుంచి అనుమతులు పొందడంలో ఏ కొంచెం జాప్యం జరిగినా ప్రభుత్వం కోట్ల రూపాయలను అపరాద రుసుంగా మేటాస్కు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
- అదీకాకుండా మెట్రో రైలు ప్రయాణించే మార్గాల్లో ఇతర రవాణ సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదనే షరతు ఉందన్నారు.
- ముఖ్యంగా 25 సంవత్సరాల పాటు ఆర్టీసీ సంస్థ ఇతర బస్సులను ఈ రూట్లలో నడపకూడదనే నిబంధనను ‘సిటిజన్ ఫర్ బెటర్ ట్రాన్స్పోర్టు’ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.
* * *
‘మెట్రో’లొసుగు: స్వతంత్ర ఇంజనీరు ఎంపిక బాధ్యత నాన్ ఇంజనీర్లకు…
హైదరాబాద్, అక్టోబర్ 30 డాక్టరు చేసే పనిని డాక్టరు … యాక్టరు చేసే పనిని యాక్టరు చేయాలి ..! అదే సబబు ..! లెక్కల మాస్టారు లెక్కలు బోధించడం రివాజు ..! అంతే గాని చరిత్ర పాఠాలు చెప్పే మాస్టారిని తీసుకొచ్చి లెక్కలకు సంబంధించిన జవాబు పత్రాలను దిద్దమంటే ఎలా కుదురుతుంది..? ఒక్కసారి ఆలోచించండి ..? కుదరదు అని ఎవరైనా ఠపీమని జవాబు చెబుతారు ..! కానీ సర్కారు ఇటువంటి నియమావళిని పక్కన పెట్టింది. ‘మెట్రో రైలు’ పనులను పర్యవేక్షించడానికి ‘స్వతంత్ర ఇంజనీరు’ను గుర్తించాల్సిందిగా పరిపాలన, గణాంకాల శాఖల్లో విశేష అనుభవం ఉన్న వాళ్లను ‘హైలెవల్ కమిటీ’ సభ్యులుగా నియమించింది.
వీరంతా ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైలు ఏర్పాటుకు అవసరమైన ప్లాన్లు , సాంకేతిక విధివిధానాలు తయారుచేసి, పర్యవేక్షించే అంతర్జాతీయ స్థాయి ‘సివిల్ ఇంజనీరింగ్ సంస్థను’ను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన 13 టెండర్ల నుంచి 6 కన్సార్షియాలను ఈ కమిటీ సభ్యులు ఎంపిక చేసేశారు కూడా. మరో మూడు నెలల్లో ‘స్వతంత్ర ఇంజనీరు’ నియామకం చేపట్టనున్నట్లు పత్రికలకు ప్రకటనలు విడుదల చేశారు.
ఆన్లైన్, సిటీబ్యూరో మెట్రో రైలు ఏర్పాటుకు కావల్సిన స్వతంత్ర ఇంజనీరు ఎంపిక కోసం సర్కారు ముగ్గురు అధికారులను నియమించింది. వీరిలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కాగా ఒకరు ఇండియన్ రైల్వేస్ గణాంకాలకు చెందిన అధికారి. వాటర్బోర్డు ఎండీ అశోక్ కుమార్, ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన ముఖ్యకార్యదర్శి రమేష్బాబులతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. వీరంతా పరిపాలన, గణాంకాల శాఖల్లో ఆరితేరిన వారు. వీరికి సివిల్ ఇంజనీరింగ్ గురించి బొత్తిగా ఏమీ తెలియదంటే నమ్మండి ..! అటువంటిది వీరు ఈ స్వతంత్ర ఇంజనీరును ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న శ్రీధరన్ లాంటి వాళ్ల పర్యవేక్షణలో ఉన్న ఢిల్లీ మెట్రో రైలు రెండవ దశ ఏర్పాటులో ప్రమాదాలు జరుగుతుంటే ఎటువంటి అనుభవం లేని ఈ అధికారులు గుర్తించే ఇంజనీరు వల్ల ‘మెట్రో రైలు’ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందోననే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
స్వతంత్ర ఇంజనీరు ఎందుకంటే …?
సర్కారు – బీవోటీ సంస్థల మధ్య స్వతంత్ర ఇంజనీరు అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. పనుల పర్యవేక్షణ చేసే స్వతం త్ర ఇంజనీరు సంస్థకు నిర్మాణ అంశాల్లో ఆధునిక, సాంకేతి పరిజ్ఞానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటారు. మెట్రో కారిడార్లు, ఇంజన్లు, స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత స్వతంత్ర ఇంజనీరుదే..! మెకానికల్ ఇంజనీరింగ్, సేఫ్టీ సిస్టమ్స్, సిగ్నల్స్, టెలీ కమ్యూనికేషన్ల లాంటి అంశాలపైనా ఈ ఇంజనీరు ప్రత్యేకంగా పని చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వంతో మేటాస్ మెట్రో లిమిటెడ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన సాంకేతిక అంశాలను దేశ రైల్వే చట్టాలకు అనుగుణంగా ఈ ఇంజనీరు రూపొందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్మాణానికి ముందు మేటాస్ సమర్పించే మ్యాపులు, డిజైన్లను క్షుణ్ణంగా వీరే పరిశీలించాల్సి ఉంటుంది. స్వతంత్ర ఇంజనీర్ సంస్థ ఆమోదించిన నిర్వహణ పద్ధతులనే ‘కమిషనర్ రైల్వే భద్రతా విభాగం’ ఆమోద ముద్ర కోసం పంపాల్సి ఉంటుంది.
ఢిల్లీ మెట్రో రైలు తప్పుకోవడంతోనే
వాస్తవానికి స్వతంత్ర ఇంజనీరు స్థానాన్ని భర్తీ చేయడానికి సాంకేతిక అంశాల్లో సహాయపడటానికి ‘ఢిల్లీ మెట్రో ‘ రైలు ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ఈ మధ్యనే మెట్రో గురు, ఢిల్లీ మెట్రో రైలు ఎండీ శ్రీధరన్ హైదరాబాద్ మెట్రో రైలు విధివిధానాలను విమర్శించడంతో పాటు ప్లానింగ్ కమిషన్కు ఉత్తరం రాయడం, అది మీడియాకు చిక్కడంతో తలెత్తిన వివాదాల కారణంగా శ్రీధరన్ హైదరాబాద్ మెట్రోతో తెగతెంపులు చేసుకున్నారు. ఢిల్లీ మెట్రో రైలు స్థానంలో ఎవరినీ నియమించకుండా మెట్రో రైలు అధికారులు తమ ఇష్టానుసారంగా సాంకేతిక అంశాల్లోనూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
టెండర్లకు స్పందించి వచ్చిన 13 కన్సార్షియాల్లో ఆరింటిని ఏ విధివిధానాలను అనుసరించి ఎంపిక చేశారు…? హైలెవల్ కమిటీ సభ్యులకు సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఏ మేరకు అనుభవం ఉంది..? అనే ప్రశ్నలకు జవాబులు లేవు. ఎంతో అనుభవంతో నిర్మించిన ఢిల్లీ మెట్రో రైలు నిర్మాణం, ప్రణాళికలు, విధివిధానాలపై దేశీయంగా ప్రముఖ వార్తా పత్రికల్లో విమర్శలు గుప్పిస్తూ వార్తాకథనాలు వరుసగా ప్రచురితమవుతున్నాయి.
అటువంటిది రేపు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విధివిధానాల్లో లోపాలు వెలుగు చూస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు..? ఎటువంటి ఇంజనీరింగ్ అనుభవం లేని అధికారి నిర్వహణలో సివిల్ ఇంజనీరింగ్పై కనీస పరిజ్ఞానం లేని హైలెవల్ కమిటీ సభ్యుల ఎంపికతో బాధ్యతలు చేపట్టే ‘స్వతంత్ర ఇంజనీరింగ్ సంస్థ’ ప్రమాణాలను ఏ విధంగా విశ్వసించగలం ..? కాగా అనుమతి పొందిన కన్సార్షియంలల్లో ఏకామ్ (హాంకాంగ్), అరవీ అసోసియేట్స్ (ఇండియా), లమేయర్ ఇంటర్నేషనల్ (జర్మనీ) / లూయిస్ బర్గర్ (యూ ఎస్ఏ), రైట్స్ (ఇండియా) లల్లో ఏదో ఒక దానికి బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.