నవంబర్ 1న తెలంగాణ విద్రోహదినాన్ని పాటించిన ప్రవాసులు
నవంబర్ 3rd, 2008 by డిస్కవర్ తెలంగాణ
వాషింగ్టన్, నవంబర్ 3 : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి వ్యతిరేకంగా తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ అమెరికాలో తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించింది. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం ముందు నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ చరిత్రలో ఒక చీకటి అద్యాయమని ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ వాదులు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ సభ్యులతో పాటు మసాచుసెట్స్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వర్జీనియా, నార్త్ కరోలినా నుండి కార్యకర్తలు తరలివచ్చి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 40 మంది, తెలంగాణ నినాదాలతో ఎంబసీ ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ ఛైర్మన్ రవి మేరెడ్డి, భారత రాయబారి కర్యాలయానికి వినతిపత్రం అందజేశారు.
యుపిఎ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదని, తక్షణమే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని మేరెడ్డి వినతిపత్రంలో డిమాండ్ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో, సభ్యులు ప్రత్యేక తెలంగాణ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ శక్తులన్నీ ఏకం కావాలని కార్యకర్తలు అభిలషించారు.
(Courtesy : AndhraJyothy 3 Nov 2008)
- Visit Picasa for more Photos of TeNA Protest on November 1st 2008, Telangana Black Day at Washington D.C





