- రావి ప్రేమలత

స్త్రీ చైతన్యంపై ఉత్తమ పరిశోధన
తెలంగాణ ఉద్యమంలోని స్త్రీల చైతన్యాన్ని నవలలు చిత్రించినట్లు మరే సాహిత్య ప్రక్రియ చిత్రించలేదు. తెలంగాణ పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకున్న నవలలు 21 వరకున్నాయి. వాటిలో 10 నవలలను డా. దేవకి “తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం” అనే అంశాన్ని పరిశోధించడానికి ఎంచుకున్నారు. ఉత్తమ పరిశోధనకు గాను తెలుగు విశ్వవిద్యాలయం నుండి స్వర్ణ పతకాన్ని కూడా అందుకున్నారు.
డా. దేవకి తెలంగాణ పోరాటంలో పాల్గొన్న స్త్రీల వీరత్వాన్ని వివరించి, తెలంగాణ విమోచనోద్యమ నవలల్లోని స్త్రీ పాత్రలతో పోల్చి, బింబ ప్రతిబంబాలవలె ఉన్నాయని నిరూపించారు. మొత్తం మూడు పరిశోధనాంశాలను ప్రకటించారు. వీటిని డా. దేవకి ఉపజ్ఞకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.
అందులో మొదటి అంశం- నవలల్లోని స్త్రీల పాత్రలకంటె వాస్తవ జీవితంలోని ఉద్యమకారిణులే శక్తివంతులని నిరూపించారు. ఉద్యమంలో భర్తతో పాటు పాల్గొన్న కమలమ్మ, పార్టీ ఆదేశం ప్రకారం కన్నబిడ్డలనిద్దరినీ త్యాగం చేసింది. ఈనాటికీ ఆమెకు తన బిడ్డల జాడ తెలియదు. అచ్చమాంబ అనే మరొక ఉద్యమకారిణి పార్టీ కార్యకర్తగా, కొరియర్గా, వైద్య సేవకురాలిగా పనిచేసింది. ఒకసారి పోలీసులు డెన్ను ముట్టడించినపుడు జ్వరంతో బాధపడుతున్న దళాధిపతి మోహన్రావును, మరొక గాయపడిన వ్యక్తిని రెండు భుజాలపైన వేసుకుని కొన్ని మైళ్ళదూరం క్రూరమృగాలుండే అడవిలో ప్రయాణం చేసింది. ఇంతటి శక్తివంతమైన పాత్రను ఏ రచయితా చిత్రించలేదని డా. దేవకి అన్నారు. ఉద్యమంలో కొరియర్లుగా పనిచేసిన స్త్రీల చాతుర్యం, కార్యదీక్ష నవలల్లో కన్పించదని, ఉదాహరణ పూర్వకంగా విశదీకరించారు. “మనువును వదిలినా మునుమును వదలకూడదు” అనే సామెతకనుగుణంగానే భర్తలు లేకున్నా ఐలమ్మ, కుమ్మరి మట్టయ్య భార్య, లంబాడీ స్త్రీలు తమ పొలాల కొరకు ప్రాణాలొడ్డి పోరాడారు. వారి పోరాట పటిమ నవలాగత పాత్రలో కన్పించదన్నారు రచయిత్రి.
డా. దేవకి వెల్లడించిన రెండవ అంశం- నవలా రచయితలు స్త్రీ పాత్రలను ఉద్యమానికి సహాయకారులు, సానుభూతిపరులుగా చిత్రించినవారే కాని వారి చైతన్య స్ఫూర్తిని శక్తివంతంగా చిత్రించలేదు. ఇటు పార్టీ కానీ, అటు నవలా రచయితలు కానీ స్త్రీ భావోద్వేగాలనూ, సమస్యలనూ అర్థం చేసుకోలేదని, దానిక్కారణం పితృస్వామ్య సంప్రదాయపు భావాలేనని రచయిత్రి నిర్ధారించారు.
దేవకి వెల్లడించిన మూడవ అంశం- ఉద్యమానంతరం సమాజంలోకి తిరిగి వచ్చిన స్త్రీలను గురించి పార్టీ కాని, నవలా రచయితలు కానీ పట్టించుకోలేదు. ఉద్యమం కొరకు తమను కన్నవారిని, తాము కన్నవారిని త్యాగం చేసి మరల వారిని చేరలేక తపించిపోతున్నవారు కొందరు, అవివాహితులుగా మిగిలిపోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నవారు కొందరు, కుటుంబసభ్యుల వెలికి గురైనవారు కొందరు. పోరాటానికి ముందు స్త్రీలు వంటింటికి, కుటుంబానికి పరిమితమై ఉంటే పోరాటం తర్వాత కూడా వారి స్థితి అదేవిధంగా ఉందని రచయిత్రి తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఉద్యమంలో పాల్గొన్న స్త్రీల చరిత్రను వారి మాటల్లోనే “మనకు తెలియని మన చరిత్ర” పుస్తకం వెల్లడించింది. చరిత్రలోనూ, సాహిత్యంలోనూ పోరాటంలో పాలు పంచుకున్న స్త్రీల చైతన్యాన్ని విశ్లేషించిన డా. దేవకి రచన ద్వితీయమైనా అద్వితీయం.
తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం
రచయిత్రి: తిరునగరి దేవకీదేవి వెల: రూ. 100 పుటలు: 374
ప్రతులకు: రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
(Courtesy: 28 December 2008, AndhraJyothy)