- సిలివేరు హరినాథ్
![]()
కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, వందలాది మంది విద్యార్థి అమర వీరుల త్యాగాల స్ఫూర్తి తెలంగాణ. ఇప్పుడది రాజకీయ చదరంగంలో పరాజయం అంచులో ఉంది. మహాకూటమి, కాంగ్రెస్, పీఆర్పీల పందేరంలో తెలంగాణ నిస్పహాయురాలై ఉంది. తెలంగాణ ప్రజలు నమ్మిన వారి చేతిలో మోసపోతూనే ఉన్నారు. చరిత్ర ఎన్నో సార్లు దీన్ని నిరూపించింది.
ఆధిప త్యం, వలసవాదం, దోపిడి వంటి రూపాలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తులన్నీ చివరికి అవే రూపాలలో అంతర్లీనమై చరిత్రను పునరావృతం చేస్తున్నా యి. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడిన వారు అంతిమంగా ఆ వ్యవస్థలో అంతర్భాగమైపోయారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడిన వారు అదే ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన దాఖలాలున్నాయి.
నిన్నటి దాకా కమ్యూనిస్టులమని విర్రవీగిన వారు కాంగ్రెస్వాదులై ముఖ్యమంత్రి సమక్షంలో జై కాంగ్రెస్ అంటున్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన వారు అదే సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న మాదిగ దండోరా ఉద్యమాన్ని అంగీకరించడం లేదు. తెలంగాణ కోసం ప్రాణమిస్తామని ప్రతినబూనినవారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయారు.
రాజ్యం తనకు వ్యతిరేకమైన వాటిని చాలా ఓపికగా, ఒడుపుగా తనలో అంతర్భాగం చేసుకుంటుంది. తెలంగాణ విషయంలోనూ అదే జరిగింది. తెలంగాణ ప్రజలెదుర్కొంటున్న వివక్ష, అనుభవిస్తున్న పీడన, దోపిడీలకు నిరసనగా నినదించి ఉద్యమిస్తే మర్రి చెన్నారెడ్డి దాన్ని సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పాదాల చెంత తాకట్టు పెట్టారు. కాంగ్రెస్ వలసవాద స్వభావాన్ని వంటబట్టించుకున్న అనేక మంది నాయకులు తెలంగాణ గురించి గొంతు చించుకొని అరచి, చివరకి మంత్రి వదవిస్తే నోరుమెదపడం లేదు. చిన్నారెడ్డి అందుకు నిదర్శనం.
తెలంగాణ నినాదంతో ప్రజల ముందుకొచ్చిన పి.ఇంద్రారెడ్డి, ఆలే నరేంద్రలు చివరికి తెలంగాణ వ్యతిరేకి అయిన కాంగ్రెస్ లో చేరారు. దేవేందర్గౌడ్ ‘సామాజిక తెలంగాణ’ అని నినాదమిచ్చి, కొద్ది రోజులకే పిఆర్పీలో చేరిపోయారు. ఏ కాంగ్రెస్ ఇంతకాలం తెలంగాణ వెనుకబాటుకు కారణమని నిరసించారో దానిలోనే విలీనం కావడం పెద్ద రాజకీయ విరోధాభాస.
వాస్తవానికి స్వభావరీత్యా తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకి. రైతాంగ సాయుధ పోరులో పట్టణం పారిపోయిన దొరలను తిరిగి తెలంగాణ పల్లెకు తీసుకొచ్చింది కాంగ్రెస్. వలసవాదం వికృత రూపం దాల్చిందీ కాంగ్రెస్ పాలనలోనే. కనీస తాగునీరు, సాగునీరు, కూడు, గూడు, గుడ్డకు లేనివాళ్లని చేసిందీ ఆ పార్టే. స్వాతంత్య్ర సమరవీరులను అవమానించిందీ, వృద్ధులకు కనీస భద్రత లేకుండా చేసిందీ అదే పార్టీ. ఎన్నోసార్లు తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాన్ని నీరుగార్చి కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసింది.
మాటమార్చిన సోనియాగాంధీ, తెలంగాణ ఉద్యమాన్ని ఏమార్చిన రాజశేఖరరెడ్డి ప్రజల ముందు దోషులుగా నిల్చున్న ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ చర్చనీయాంశం కాలేకపోతున్నది. రోజువారీ వార్తా విశేషమే తప్ప తెలంగాణ ఒక పోరాట రూపమన్న స్పృహ అందరూ క్రమంగా కోల్పోతున్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును, దేశ రాజకీయాలను శాసించేదీ తెలంగాణ ఉద్యమమే అన్నది గుర్తించడానికి నిరాకరిస్తున్నారు.
నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచార సమరం ఏనాడో మొదలైంది. కానీ, మధ్యలో తెలంగాణ లొల్లి గల్లంతైంది. మహాకూటమిలో టీఆర్ఎస్ చేరుతుందా? చేరదా? అన్న సంశయం నివృత్తి కావడానికే ఎన్నో రోజులు గడిచాయి. సీట్ల సంఖ్య తేలడానికి మరో పక్షం రోజులు గడిచిపోయాయి. మహా కూటమిలోని వివాదాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కానీ టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీ ప్రచార వ్యూహంలో తెలంగాణ కనిపించకుండాపోయింది.
ప్రతిరోజు టీవీల్లో కనిపిస్తున్న ప్రకటనల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణ గురించి కనిపించడం లేదు. టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజల మీద అపారమైన నమ్మకం. కేసీఆర్కు అతి విశ్వాసం మరీ ఎక్కువ. అందుకే, ఆ పార్టీ ఇప్పటికీ కనీసం ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. వైఎస్ చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో మాయం చేయాలని చూశారు.
తెలంగాణ నడిబొడ్డున నిలబడి సోనియా గాంధీ ‘జై ఆంధ్రప్రదేశ్’ అని నినదించిన నాడే ఈ ఎన్నికలు తెలంగాణవాద అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరుగబోతున్నవని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు, వృద్ధాప్య పింఛన్లు, కాంగ్రెస్ను కాపాడుతాయని వైఎస్ ధీమా. ఆయన మొహంలో అతి విశ్వాసం వ్యక్తమవుతున్నది. కాని, యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజలకు ఇల్లు లేకుండా చేసింది.
బక్కజీవులకు బతుకు లేకుండా చేసింది. బీడుపొలాలకు నీళ్లు లేకుండా చేసింది. రైతులను ఆత్మహత్యల పాలు చేసింది. అనేక పౌర, మానవ హక్కులు కోల్పోయేలా చేసింది. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకొంటున్న కార్యక్రమాలన్నీ తెలంగాణ ప్రజల పౌరహక్కులు. వాటిని కాంగ్రెస్ గొప్పతనమనీ, ఔదార్యమనీ, ప్రజలపై ప్రేమనీ అనుకోరు. ఇంతకాలం కనీస వసతులు లేకుండా చేసిన ఆ పార్టీ మీద ప్రజలు పట్టరాని ఆగ్రహంతో ఉన్నారని తెలుసుకోవాలి.
టీఆర్ఎస్ను రాజకీయ జూదంలో బలి చేయాలని ప్రయత్నించిన ప్రతిసారీ అనూహ్యమైన రీతిలో ఎదురుదాడి చేస్తుంటుంది. ప్రతి ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల నుంచి టీఆర్ఎస్పై విపరీతమైన దాడి జరుగుతుంటుంది. బలహీనమైన అభ్యర్థులనీ, కేసీఆర్ ప్రభావం తగ్గిందని వాదనలు వస్తాయి. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని విశ్వసించడం లేదంటారు.
అంతర్గత కలహాలున్నాయనీ, టిక్కెట్లు రానివారంతా అలకబూనారనీ, కాంగ్రెస్కు చేరువవుతున్నారనీ వాదిస్తారు. కానీ, గత ఎన్నికలు చూసిన వారెవ్వరూ ఆ మాటలు నమ్మరు. ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభావం కనిపిస్తూనే ఉన్నది. అయితే మహాకూటమి వల్ల తెలంగాణ ప్రాంతంలో తీవ్రస్థాయిలో టీడీపీ ప్రచారం చేసేందుకు సిద్ధంగా లేదు. ఎక్కువ సీట్లు టీఆర్ఎస్కు కేటాయించినా టీడీపీ దాని ఓటమికి కూడా కృషి చేయవచ్చనే అనుమానాలు ఉన్నాయి.
టీఆర్ఎస్ స్థానాల్లో ఓటు బదిలీ జరగకపోవచ్చుననే అనుమానం కూడా కలుగుతున్నది. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ప్రభావం లేదని నిరూపించే ప్రయత్నం జరగవచ్చు. అందువల్ల టీఆర్ఎస్ తాను పోటీ చేస్తున్న స్థానాలలో ఓడిపోకుండా చూసుకోవాల్సింది ప్రజలే. లేకపోతే దేశ రాజకీయ చిత్రపటం మీద నుంచి తెలంగాణ తెరమరుగవుతుంది. మరి, తెలంగాణ సోయిని ఏట్లె గలుపుదామా? కాపాడుకుందామా?
(సెంటర్ ఫర్ దళిత్ అకడమిక్స్ అండ్ రీసెర్చ్)
(03 ఎప్రిల్ 2009, ఆంధ్రజ్యోతి సంపాదకీయం సౌజన్యంతోటి)
* ఈ వ్యాసంల ఉన్న బావాలు రచయితవి మాత్రమే, ‘డిస్కవర్ తెలంగాణ’వి కావు.
April 3rd, 2009 at 11:49 pm
ఈ వ్యాసకర్త లాంటి వాళ్ళు ఉన్నంత కాలం తెలంగాణా రాదు. ఎందుకంటారా? ఈ రోజు తెలంగాణా ఉద్యమాన్ని సర్వనాశనం చేసిన/చేస్తున్న వ్యక్తి కేసీయార్. తెలంగాణా ఆత్మగౌరవాన్ని వేరే నాయకుల కాళ్ళ దగ్గర పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నాడు. ముందు అలాంటివాళ్ళను తరిమికొట్టాలి. తెలంగాణా నాయకుల్లో చిత్తశుద్ది ఉందా? ఆ సంగతి చెప్పకుండా వేరే వాళ్ళను ఆడిపోసుకొనే అంత కాలం ఇలా ఏడుస్తూనే ఉండాలి, చేతకానితనం ఒప్పుకోలేక.
April 28th, 2009 at 5:24 am
ఈవ్యాసం ఓటింగ్ జరగక ముందే చూసివుంటే మరింత వివరంగా నా అభిప్రాయమం రాసి ఉండేవాణ్ని. వ్యాసంలోని అభిప్రాయాల్లో చాలవరకు సరిగానె ఉన్నాయి.కాని కేసీఆర్ తెరాస
పార్టిని నడపడంలో అనుసరిస్తున్న విధానాలు హర్షించ దగినవిగాలేవు. తెరాసలో ఎమ్ఎల్ఏ అయ్యేందుకు కావలసిన యోగ్యతలున్న మహిళలు,విధ్యావంతులు,కళాకారులు తెలంగాణాలో లేరా?
పాలిటిక్స్ బాగానే ప్లే చేస్తున్నా పార్టిని పటిష్టంగా నిర్మించనందుకు ,తగిన విధంగా ప్రత్యర్ధులను అంటే తెలంగాణ వ్యతిరేకులను ఎట్లంటే అట్ల ఎదుర్కునేందుకు తగిన నాయకులను పార్టీలో తయారు అయ్యే అవకాశాలు కలిగించనందుకు కేసీఆర్ ను తప్పుపట్టటమే సరైనపద్దతి అనుకుంటాను.
ఏదేమైనా తెలంగాణను తెరాస తేగలిగితే చాలు , ఆపార్టీ,దాని అధినేత కేసీఆర్ అనుసరించిన అన్ని పద్దతులు,వ్యుహాలు సరైనవేనని నేనే కాదు తెలంగాణవాదులంతా అనుకుంటారు.
October 3rd, 2010 at 4:20 am
జై…తెలంగాన
జై….కె.సి.ర్