- కె.శ్రీనివాస్

అభ్యర్థిత్వాలు కొనుక్కున్నవారు రేపు విధేయతలను అమ్ముకోరని ఎవరు చెప్పగలరు? నిన్న కాంగ్రెస్ అసమ్మతిని రగిలించి, ఫిరాయింపులను సాధించినట్టే, రేపు తెలుగుదేశం మాత్రం చేయదని ఎందుకు అనుకోవాలి? ఇది మహాకూటమి గెలిస్తే సంగతి. అలా కాక, మరోవిధంగా జరిగితే, తెలంగాణవాదం పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం మాత్రం గట్టెక్కి, టిఆర్ఎస్ ఓడిపోతే పరిస్థితి ఏమిటి?
ఏదైనా ఒక సమస్యను చంపేయాలంటే ఉత్తమమైన మార్గం దాన్ని పరిష్కరించడం కావచ్చు. పరిష్కరించకుండా సమస్యను మాయం చేయాలంటే దాన్ని అణచివేయడమో నిషేధించడమో ఒక మార్గం కావచ్చు. కాకపోతే, నిషేధాలు ఒక్కోసారి ప్రతికూల ఫలితాలనిచ్చి సమస్యకు కొత్త జవసత్వాలను ఇవ్వవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యలను సమర్థవంతంగా తుడిచిపెట్టాలంటే, అన్నిటి కంటె ‘సమ్మతి’ ఉత్తమమైన మార్గమని తెలివైనవారికి మాత్రమే తెలిసే సత్యం కావచ్చు. అందరూ కూడబలుక్కున్నారని అనలేము కాని, ప్రత్యేక తెలంగాణ వాదానికి ఇప్పుడు తిరుగులేని సమ్మతి సమకూరింది. అడపాదడపా మార్క్సిస్టు పార్టీ చేసే విధాన ప్రకటనలు మినహాయించి, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నవారెవరూ లేరు.
ఈ సమ్మతి- ఉద్యమానికి ఉన్న ఆకర్షణను తగ్గించిందా? ఐదేళ్ల కిందట తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్రవాదానికి గట్టిగా కట్టుబడి ఉండడమూ అది నాటి అధికారపార్టీ కావడమూ తెలంగాణవాదానికి ప్రతికూల ప్రేరణలుగా పనిచేశాయన్నది నిస్సందేహం. కాంగ్రెస్పార్టీ మాటతప్పిందని, మోసం చేసిందని ఎంతగా విమర్శించగలిగినా- అది సైద్ధాంతికంగా ప్రత్యేకవాదాన్ని వ్యతిరేకిస్తున్నదని చెప్పడం కష్టం.
అందుకే, మహాకూటమి సభ్యురాలిగా టిఆర్ఎస్ పార్టీ వైఎస్ అవినీతి గురించి మాట్లాడినంతగా తెలంగాణ ద్రోహం గురించి మాట్లాడలేకపోతున్నది. శత్రువులేకపోతే ఉద్యమాలు దాదాపు అనాథలయిపోతాయి. ఈ పరిస్థితి ప్రభావం వచ్చే ఎన్నికలలో, ఎన్నికల తరువాతి వాతావరణంలో ఏరకంగా ప్రతిఫలించనున్నది? అయిదేళ్ల కాలంలో టిఆర్ఎస్ పార్టీ సాధించిన ఘనవిజయాలేమీ లేవు. గెలిచిన శాసనసభ్యులలో కొందరు ఫిరాయించి, కంటిలో నలుసులాగా కాలిముల్లులాగా ఇబ్బందిపెట్టినా పార్టీ ఏమీ చేయలేకపోయింది.
ఉత్తర తెలంగాణ దాటి తన సంస్థాగత ప్రభావాన్ని అంగుళం మేర కూడా విస్తరించలేకపోయింది. కాంగ్రెస్తో ఒప్పందంలో ఐదేళ్ల కిందట ఎన్ని అసెంబ్లీ స్థానాలలో పోటీచేసిందో, ఇప్పుడు మహాకూటమిలో భాగస్వామిగా అన్నే స్థానాలను అతికష్టం మీద బేరమాడగలిగింది. లోక్సభ సీట్లు మాత్రం బాగానే పెంచుకోగలిగింది కానీ, విజయావకాశాల రీత్యా అంతిమంగా పొందింది పెద్ద ఎక్కువేమీ కాదు. కుటుంబసభ్యులను, ప్రభావం ఏమాత్రమో తెలియని విజయశాంతినీ మినహా కొత్తగా సమకూర్చుకున్న నాయకత్వశ్రేణీ లేదు. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శిస్తున్న ప్రభుత్వ విధానాలను నాడు ప్రతిఘటించింది లేదు. భూములు అన్యాక్రాంతం అవుతున్నా, సెజ్ల పేరిట రైతులను నిర్వాసితులను చేస్తున్నా, జలయజ్ఞంలో అక్రమాలు జరుగుతున్నా- గొంతెత్తిన పాపాన పోలేదు.
ఇన్ని అపజయాలున్నా- తాము ఢిల్లీలో చేసిన లాబీయింగ్ వల్ల, ఇతర భావప్రచారం వల్ల పార్టీ ప్రభావం పెరిగిందని, తెలంగాణవాదానికి లభిస్తున్న సమ్మతి దాని ఫలితమేనని టిఆర్ఎస్ వాదించవచ్చు. అందులో సత్యం కొంత ఉండవచ్చు. పదవీకాలం ముగుస్తున్నా వై.ఎస్. రాజశేఖరరెడ్డిపై జనంలో వ్యతిరేకత తగినంతగా పెరగకపోవడం, కొత్తగా మూడో పక్షం రాజకీయరంగంలోకి ప్రవేశించడం – ఈ కారణాల వల్ల అదనపు బలగాలను సమీకరించుకోక తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణవాదానికి సమ్మతి తెలపవలసి వచ్చింది. ఆ పార్టీ అవకాశవాదంతో తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకున్నదని చెప్పడం లేదు. తెలంగాణపై పూర్తిగా మనసువిప్పకుండానే గణనీయమైన సంఖ్యలో ఓట్లను ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంపాదించింది.
ఆ పార్టీ తెలంగాణ శ్రేణుల్లో కూడా తెలంగాణ ఆకాంక్ష బలంగానే ఉంది. చిరంజీవి రంగ ప్రవేశం తరువాత, తెలంగాణ ప్రాంతం టిడిపికి ఆయువుపట్టుగా మారడంతో- ఆ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. జనాభిప్రాయాన్ని, సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏ పార్టీ అయినా విధానాలను సర్దుబాటు చేసుకుంటే అది తప్పనిసరిగా ఆహ్వానించదగిందే. కాకపోతే, ఈ విధాననిర్ణయం తెలంగాణ జనం విశ్వాసం పొందవలసిన అగత్యంనుంచి జరిగిందే తప్ప, తెలంగాణ రాష్ట్రసమితి నిర్వహించిన ‘మహోద్యమాల’ ఫలితం కాదు.
గతంలో తెలుగుదేశం అనుసరించిన కఠినమైన వైఖరి, ఆ పార్టీ పాలనలోనే తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించిన చరిత్ర ఇంకా సజీవజ్ఞాపకంగానే ఉన్నందున తెలుగుదేశం- టిఆర్ఎస్ మైత్రి తెలంగాణవాదులకు జీర్ణం కాలేదు. రాజకీయమైన లెక్కలు వేసుకునేవారు మాత్రం ఈ కూటమి గెలుపుకు గ్యారంటీ ఇస్తుందని ఎగిరి గంతేశారు.
వాస్తవానికి- తెలుగుదేశం-టిఆర్ఎస్ కూటమి తెలుగుదేశం పార్టీ అధికారానికి రావడానికి కీలకంకాగా, టిఆర్ఎస్కు మాత్రం ఉనికి నిలుపుకోవడానికే ఆవశ్యకంగా పరిణమించింది. ఇక ఎన్నికల ఘట్టం సమీపించిన తరువాత- టిక్కెట్ల పంపకంలో టిఆర్ఎస్ నాయకత్వం అనుసరించిన పద్ధతులు, చేసిన ఎంపికలు ఆ పార్టీ ప్రతిష్ఠను పూర్తిగా దిగజార్చాయి. కూటమిలో చేరడం దగ్గరనుంచి, టిక్కెట్ల పంపకం దాకా- ఎక్కడా కార్యకర్తలను కానీ, తెలంగాణవాదులను కానీ విశ్వాసంలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ఏం చేసినా సరే, తమకు ఓట్లు వేయడం తప్ప తెలంగాణ ప్రజలకు గత్యంతరం ఏమున్నదన్న అహంభావధోరణి నాయకత్వంలో కొనసాగుతూనే ఉన్నది.
గత్యంతరం లేదని భావించి- జనం ఓట్లు వేస్తే సరే, అలాకాక, ఈ మొత్తం పరిణామాలపై విరక్తో, ఏవగింపో, తెగింపో తెచ్చుకుని తెలంగాణ ఓటరు భిన్నంగా వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత తెలంగాణ ప్రజలకు ఒక బలమైన జ్ఞాపకమే. అయితే, దాన్ని తుడిచివేసి సానుకూలతను సాధించుకోవడానికి ఆ పార్టీ ఎంతో కొంత ప్రయత్నించింది. తన చేతుల్లో ఏమీ ఉండదని తెలిసినా- ప్రత్యేక రాష్ట్రంకోసం కావలసిన రాజకీయ, చట్టపరమైన చర్యలను తీసుకుంటానని మేనిఫెస్టోలో కూడా చెప్పుకుంది. టిఆర్ఎస్కు ఒక మేనిఫెస్టో ఉంటుందో ఉండదో తెలియదు కానీ, అది తనమీద తెలంగాణవాదులలో, తెలంగాణ ఓటర్లలో పెరుగుతూ వస్తున్న అసహనాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నమేమీ లేదు.
ఉద్యమాభిమానులు అయినా కాకున్నా ఇప్పుడు సీట్లు పొందినవారు, రేపు గెలిస్తే, టిఆర్ఎస్తోనే ఉంటారన్న గ్యారంటీ ఏమీ లేదు, ఉద్యమపరమైన అటువంటి ఒత్తిడి ఏదీ టిఆర్ఎస్ సృష్టించలేదు. అభ్యర్థిత్వాలు కొనుక్కున్నవారు రేపు విధేయతలను అమ్ముకోరని ఎవరు చెప్పగలరు? నిన్న కాంగ్రెస్ అసమ్మతిని రగిలించి, ఫిరాయింపులను సాధించినట్టే, రేపు తెలుగుదేశం మాత్రం చేయదని ఎందుకు అనుకోవాలి? ఇది మహాకూటమి గెలిస్తే సంగతి. అలా కాక, మరోవిధంగా జరిగితే, తెలంగాణవాదం పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం మాత్రం గట్టెక్కి, టిఆర్ఎస్ ఓడిపోతే పరిస్థితి ఏమిటి? తెలంగాణ నాయకత్వం మీద నిస్పృహను ఓటర్లు బలంగా వ్యక్తం చేస్తే, తిరిగి ఉద్యమం రాజుకోవడానికి ఎంతకాలం పడుతుంది?
అమెరికానుంచి కొందరు తెలంగాణ ఎన్నారై మిత్రులు టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, తెలంగాణ ఉద్యమం భవిష్యత్తు గురించి ఆందోళన చెందారు. కెసిఆర్ ధోరణి వల్ల టిఆర్ఎస్ ఓడిపోతే, ఉద్యమానికి జరిగే నష్టం గురించి వారిలో కలవరం. జరిగిందేదో జరిగింది, ఈ ఒక్కసారికి బతికించుకోవాలన్న తాపత్రయం. కానీ, ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఆశావహ ఆకాంక్షలు నెరవేరాలని ఏముంది? అల్లంతదూరాన ఉన్న ప్రవాస తెలంగాణీయులు నిస్సహాయంగా ధ్వనించారు. అంత దూరంలో ఉన్నవారికే కాదు, అతి దగ్గరలో ఉన్నవారికి కూడా జరుగుతున్న పరిణామాలలో పాత్రా లేదు, ప్రమేయమూ లేదు. అందరూ ప్రేక్షకప్రాయులే. “ఇంతకీ మీరేమంటారు? టిఆర్ఎస్ గెలవాలా? అక్కరలేదా?- మిత్రులు అడిగారు.” గెలిస్తే మంచిదే. ఉద్యమం ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. గెలవకపోయినా మంచిదే, ఒక గుణపాఠం దొరుకుతుంది.”
April 21st, 2009 at 10:34 am
శ్రీనివాస్ గారు నైరాశ్యంతో ఉన్న తెలంగాణా ఉద్య్మకారులకు మీ వ్యాసం కొంతైనా దారిచూపగలదనుకుంటాను. ఇటువంటివ్యాసాలు మరెన్నో రావాల్సి ఉంది. ఐతే తె-ప్రజల్లో ఎంత చైతన్యమ్ ఇప్పటివరకు వచ్చినా ఇటివల తెరాస తెచింది ఏమీలేదు. కేసీఆర్ హ్చెప్తూ ఉండే ప్రజా స్వామ్య ,శాంతియుత పోరాటాలు కూడా ఏమీ లేకపాయె. తెరాసకు ఓట్లు పడేకాడికి పడ్డట్లుకనుక తెరాసను ప్రక్షాళన చెయ్యడానికి ఎన్ని విమర్శలు చెయ్యాలో అన్నీ చెయ్యాలి. ఐతే తెరాస విమర్శలతో బాగుపడుతుందనే ఆశ కనిపించడంలేదు. ఐతే ఉన్నంతలొ ఎన్నికల యుద్దంలో కేసీఆర్ రాజకీయాలు బాగానే ఆడాడు. ఒక్క సీట్ల పమ్పకంలో మాత్రం తెలంగాణా వాదుల్లో అత్యధికులు సంత్రుప్తి చెందలేదనేది మాత్రమ్ నిజం. ఐనా ఎన్ని విమర్శలు చేసినా తెరాస మారుతుందని అనిపించడం లేదు . ఎంతమందరుముఖ్య నాయకులో తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళిపోయారు,ఐనా కార్యకర్తలు ఎక్కువ మంది బయటికి పోలేదు,అది అనుకున్నంతగా బలహీనపడలేదు.దానికి ప్రధానకారణం పార్టీ పటిష్టమైన నిర్మాణంతో ఉండడం అని నాకు అనిపిస్తుంది. తోటి తెలుగుదేశాన్ని చూసి తెరాస నేర్చుకునే పరిస్థితికూడా కనిపించడంలేదు. అసలు ఈవిమర్శలు సరిపోవు, నూతన పార్టీనో,నూతన నాయకత్వానికొరకు వెతుక్కోవడమే మంచిదనిపిస్తుంది. తెరాసతో విసిగిన తెలంగాణ్ ప్రజలకు విరక్తి,ఏవగింపు,తెగింపు వస్తే/చేస్తే ఎట్లా? అని మీరు వేసిన ప్రశ్న తె-ఉద్యమ్కారులంతా ఆలోచించాలి. అవర్ తెలంగాణ డాట్ కాంలొ(our telangana.com) కూడా కాంగ్రేసు ఈఐదేళ్ళు ఎట్లా తె-ఉద్యమాన్ని అంతం చెయ్యడానికి చూసిందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలన్నీ ఒక ఐక్య ఉద్యమ నిర్మాణానికి దారితీసేట్లు చూడాల్సి ఉంది. తెరాస గెలిచినా మంచిదే,ఓడినా మంచిదే నన్నారు. కాని అది సరికాదు,అనుకుంటా.ఓడితే తెరాస కుక్కిన పేను ఔతుంది.మరి గెలిస్తే తనగొప్పతనమే ననుకుంటుంది,జబ్బలు చరుచుకుంటుంది , అంతా తన నిర్వాకమే ననుకుంటుంది. ఇంతకాలం తనేమీ చెయ్యకుండా ఉన్న విధానమే మంచిదనుకోవచ్చు,పార్టీ నిర్మాణంలేకుండడమే మంచిదనికూడా అనుకోవచ్చు. మరి అటువంటప్పుడు తె-ఉద్యమకారులు ఏం చెయ్యాలె?
May 24th, 2009 at 11:28 am
Your doubt became true… not only yours in my family my father brother and friends all discussed the same and feared about this now it became true .. now waht to do … till 5 years there is no chance to think of telangan a but within 5 years he will sell entire Telangana. Keep crores of debt in our heads.. may seperate Hyd before separating telangana..
we should fight in some or other form
Prem