ఇంగ్లీషు సాహిత్య ప్రపంచంలో తెలుగు సాంస్కృతిక రాయబారి
జూన్ 1st, 2009 by డిస్కవర్ తెలంగాణ
- బి. రామానాయుడు, లండన్

ఇంగ్లండ్లో తెలుగువారి అస్తిత్వానికి సాహిత్యరంగంలో ప్రతీకగా ఆవిర్భవించిన మాచెర్ల హేమ వరంగల్ జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందినవారు. రిచర్డ్ అండ్ జూడీ అనే జంట నిర్వహించిన (2007) నవలల పోటీలో పాల్గొన్న 44,000 ఎంట్రీలలో వడపోయగా మిగిలిన 26 నవలలలో హేమ ‘బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర‘ ఒకటిగా నిలిచింది. ఇంగ్లాండ్ వచ్చాక ఇంగ్లీషు భాష మీద పట్టు సాధించిన ఒక సామాన్య మహిళ సాధించిన అసామాన్య విజయం ఇది. ఇంగ్లాండ్ వచ్చాక 1980-90 ల మధ్య రాసిన దాదాపు 25 కథలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, స్వాతి, యువలలో ప్రచురితయ్యాయి.
ఆర్.కె. నారాయణ్, చిత్రా దివాకరుని, ఎమిలీ బ్రాంటే, నికోలస్ స్పార్క్స్, శాంటా మోంటిఫియమోర్లను తన అభిమాన రచయితలుగా చెప్పుకొంటారు. తన తల్లి కాట్రేపల్లి లలిత ప్రభావం తనలో సాహిత్యాభిలాషను కలిగించిందంటారు. తండ్రి సుబ్బరామశాస్త్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. భర్త డాక్టర్ రాధామనోహర్ ప్రోత్సాహం తనని ఈ సాహసానికి సిద్ధం చేసిందని చెబుతారు. వంశీ, స్మిత వారి సంతానం. అక్టోబర్ 2008లో ఈటా, తాళ్, బ్రిటన్లో ఉన్న ఇతర తెలుగు సంస్థలు నిర్వహించిన దసరా ఉత్సవాల సందర్భంగా హేమను సత్కరించడం జరిగింది.
ఇటీవలే ‘నేషనల్ ఇయర్ ఆఫ్ హీరోస్’ అవార్డు పొంది, గోర్డన్ బ్రౌన్ చేత 10, డౌనింగ్ స్ట్రీట్లో సత్కరించబడ్డారు. ఈ విజయం, ప్రోత్సాహాలతో ఆమె రెండో నవల రాయడానికి సిద్ధమవుతున్నారు. ‘బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర‘ను ఎడిన్బరో కేంద్రంగా ఉన్న లినెన్ ప్రెస్ ప్రచురించింది. అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలలోను, వెబ్ అమ్మక కేంద్రాలలోను ఈ నవల అందుబాటులో ఉంది. (www.linenpressbooks.co.uk)

ఇంగ్లీష్ నవలా సాహిత్యంలో తెలుగు రచయితల పేరు వినిపించని లోటును భర్తీ చేస్తూ వచ్చిన ఉత్తమ నవల ‘బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర.’ ఉత్తమ నవలకుండాల్సిన లక్షణాలు ఈ నవలకు ఉన్నాయని పాఠకుడిగా నేను అభిప్రాయపడుతున్నాను. నవలా సమీక్ష చేసే అర్హతలు లేవని తెలిసినా, మంచి పుస్తకాన్ని పరిచయం చేయడం అవసరం అని భావించి ఈ ప్రయత్నానికి పూనుకున్నాను. మంచిని, మానవత్వాన్ని, ధైర్యాన్ని పెంచేదే ఉత్తమ సాహిత్యంగా చెప్పుకోవచ్చు, అటువంటి సాహిత్యమే నాలుగు కాలాల పాటు నిలబడుతుంది.
వంద సంవత్సరాలు దాటినా గురజాడ ‘కన్యాశుల్కం’, ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ ఇంకా పునర్ముద్రితమవుతూనే ఉన్నాయంటే వాటిలో చిత్రితమైన జీవిత వాస్తవికత, కళాత్మకత, భవిష్యత్ దర్శన లక్షణాలే కారణం. ఇంగ్లీషు సమాజం కూడా షేక్స్ పియర్, డికెన్స్ గురించి కలవరించి, పలవరిస్తూ ఉంటుంది. క్లాసిక్స్గా చెప్పుకునే ఈ మహారచయితల రచనలలో ప్రతిపాదించిన మానవీయ విలువలు, సృష్టించిన ఉదాత్త పాత్రలు, రచనా శిల్పం తొక్కిన కొత్త పుంతలు ప్రతి తరాన్నీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. సమాజంలోని అన్యాయాల్ని, అక్రమాల్ని చీల్చి చెండాడి ఒక నూతన మానవుడిని సృష్టించాయి. ఆ నూతన మానవులు మాట్లాడిన విషయాలు ఆదర్శనీయాలవుతాయి. ఆ రచనలు మన అంతరంగాన్ని తట్టిలేపి, మానసిక సంఘర్షణను ప్రేరేపించి సమాజాన్ని ఆదర్శాల వైపు నడిపిస్తాయి.
తోటి మనిషి మీద నమ్మకాన్ని, ప్రపంచమంతా బాగుపడాలనే ఆకాంక్షని, ఇతరులకు సహాయపడాలనే సహజ మానవీయ విలువల్ని పెంచడంలో కళల పాత్ర అద్వితీయమైది. అందులోను నవలా ప్రక్రియ పుట్టినప్పటి నుండి వచ్చిన గొప్ప సాహిత్య ప్రభావం వెలకట్టలేనిది, కొలవలేనిది. ప్రపంచ కల్పనా సంస్కృతికి పెట్టుబడిదారీ నాగరికత ఇచ్చిన గొప్ప బహుమతి నవలా ప్రక్రియ అంటాడు రాల్ఫ్ఫాక్స్. 1930ల నాటి ఇంగ్లీషు నవలా సాహిత్యాన్ని సమీక్షిస్తూ తమ కళ్ళతో, కంఠస్వరాలతో, సర్వేంద్రియాలతో మానవ జీవితాన్ని చూసి ప్రతిస్పందిస్తున్న రచయితల సంఖ్య పెరుగుతుందంటాడు.
ఆయనే వ్యక్తి సమాజంతో, ప్రకృతితో జరిపే పోరాటాన్ని చిత్రించిన మహా కావ్యమే నవల అంటాడు (రాల్ఫ్ఫాక్స్ ‘The Novel and The People’ అన్న గ్రంధానికి తెలుగు అనువాదం ‘నవల-ప్రజలు’. అనువాదకులు: వల్లపాటి వెంకటసుబ్బయ్య). బ్రీజ్ ఫ్రమ్ ది మంజీన’ నవల ఈ రకమైన లక్షణాలను కలిగిన వాస్తవికతావాద రచనగా చెప్పవచ్చు. ఇందులోని పాత్రలు మనకు నిత్యజీవితంలో ఎదురవుతూనే ఉంటాయి.
ప్రధాన పాత్ర ‘నీల’ ఒకసారి ‘అన్నా కెరెనినా’గా, మరొకసారి ‘పూర్ణమ్మ’గా, అనేకసార్లు చలం సాహిత్యంలో అపవాదుకు గురై ‘లేచిపోయిన’ మనిషిగా మనకు తారసపడుతూనే ఉంటుంది. మీరు నమ్మకపోవచ్చుగాని నేను నీలను చూశాను, మాట్లాడాను. ఇది అతిశయోక్తి కోసమో, మీకు ఆసక్తి కలిగించడం కోసమో చెప్పడంలేదు. నేను ఇండియన్ ఎంబసీలో పనిచేసే రోజుల్లో (2004) ఒకరోజు మధ్యాహ్నం కాన్సులర్ సెక్షన్లో పనిచేస్తున్న తెలుగు ఆఫీసర్, మరో బెంగాలి ఆఫీసర్ రిసెప్షన్ దగ్గరకు రమ్మని పిలిచారు, అక్కడ చూసాను- అత్తమామలు, భర్త చేత ఇంట్లో నుండి గెంటివేయబడిన నిజమైన నీలను. తెలుగు సహోద్యోగులందరూ సహకరించడంతో ఆ అమ్మాయి దృఢంగా నిలబడి కేసు వేసి కోర్టు కెళ్ళడం తరువాత కథ. రచయిత్రి హేమ సృష్టించిన ‘నీల’ ఆరోజు నాకు ఎదురైన నీలకు ప్రతిసృష్టి అనిపించి ఆశ్యర్యపడుతున్నాను.
ఈ వ్యాసకర్త అడిగిన ప్రశ్నకు సమా«ధానం ఇస్తూ నీల పాత్ర ఏదో ఒక వ్యక్తి అనుభవం నుండి రూపొందింది కాదని, అనేక అనుభవాల రూపకల్పన అని అన్నారు, పాత్ర రూపకల్పనలో రచయితకున్న ఈ సృజనాత్మకతే నీల పాత్రను సార్వజనీనం చేసింది. తద్వారా నీల అనుభవం సామూహిక అనుభవంగా రూపొందుతుంది, ఇదే రచయిత నిపుణతను పట్టి ఇచ్చే ప్రక్రియ. నీల పాత్రలో తమను చూసుకొనే మహిళలు ఏ దీశంలోనైనా వుండొచ్చు. పురుషాధిక్య సమాజం, కుటుంబం, మతం కలగలిసి చుట్టుముట్టిన పరిస్థితులున్నంత వరకు ‘నీల’ లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మంజీర నది ఒడ్డున ఉన్న గంగాపూర్ గ్రామంలో పుట్టిన నీల జీవితంలో 1985 నుంచి 1995 వరకు జరిగిన సంఘటనలను నవల చిత్రిస్తుంది. మంజీర తెలంగాణ ప్రాంతంలో ప్రవహించే నది.
నవలలో ఉన్న 42 పాత్రలూ నీల చుట్టూ అల్లిన ఫ్లాట్లో తిరుగుతుంటాయి. కథ నీల దృష్టి కోణం నుంచి నడుస్తుంది. ప్రతి పాత్రను అత్యంత సహజంగా రూపు దిద్దడంలో హేమగారు విజయవంతమయ్యారు. విదేశీ సంబంధం ద్వారా తమ కూతురు సుఖపడుతుందని లండన్ నుంచి వచ్చిన అజయ్ పట్వారీతో నీల పెళ్ళి జరిపిస్తారు. దారి తప్పిన కొడుకు పెళ్ళయితే బాగుపడతాడనే ఆశ అజయ్ తల్లిది. అందుకోసం కొడుకు గురించిన నిజాలు దాచిపెడుతుంది. ఈ రెండు అసంబద్ధమైన ఆశల మధ్య, అబద్ధాల మధ్య నీల బలయిపోయింది. కొడుకుల గురించి తాపత్రయపడుతూ, వాళ్ళ బలహీనతను నలుగురికి తెలియకుండా దాయాలనే వెర్రిప్రయత్నం చేసే (వాస్తవంలో ఇంట్లో వాళ్ల బలహీనతలు బయటి వాళ్ళకే ముందు తెలుస్తాయి) ‘మంచితల్లి’ ‘మానవత్వం లేని అత్త’ కలగలిసిన దుర్గాదేవిదీ విషాదమే.
తన ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కాలం ఎందుకు కలిసిరావడంలేదో అర్థంకాని, అర్థం చేసుకోలేని గతకాలపు ప్రతినిధి దుర్గాదేవి. పెద్దకోడలు యామిని మీద, చిన్నకోడలు నీల మీద దుర్గాదేవి వేసే కేకలు నిస్సహాయమైనవిగా, వారిని అదుపుచేయాలనే ప్రయత్నాలు వృధా ప్రయాసతో కూడుకున్నవిగా అర్థమవుతున్నప్పుడు పాఠకుడికి దుర్గాదేవి మీద కూడా జాలి కలుగుతుంది. ఉగాండా నుండి కట్టుబట్టలతో వచ్చి జీవితాన్ని నిర్మించుకున్న దుర్గాదేవికి అర్థంకాని విషయం యామిని, నీల, అనితలు నూతన తరానికి ప్రతినిధులని. అన్నా కెరినినా లాగా, పూర్ణమ్మ లాగా నీలది విషాదాంత జీవితం కాదు. మరోరకంగా చెప్పాలంటే విషాదనాయిక కావడానికి అవకాశం లేదు. ప్రపంచానికి ఇప్పుడు కావలసింది విషాద వర్ణనలు కాదు, జీవిత విషాదాన్ని ఎదుర్కొనే దారి. అన్నా కెరినినా, పూర్ణమ్మ పాత్రలు జీవించిన చారిత్రక పరిస్థితులు వేరు, నీల జీవిస్తున్న పరిస్థితులు వేరు.
సమాజంతో, అత్తతో, భర్తతో పోరాడడానికి కావలసిన పరిస్థితులు నీల చుట్టూ ఉన్నాయి. నీల స్నేహితురాలు అనిత, మానవత్వంతో ఆలోచించే జిల్, రోజ్, తనని పనిమనిషిగా కాకుండా వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చూసుకున్న డాక్టర్ వికాస్ కుటుంబం, అలెక్స్ కుటుంబం నీల చుట్టూ నిలబడి వున్నాయి. హీరో లేని ప్రోటగనిస్ట్ పద్ధతిలో నడిచిన ఈ నవలలో ప్రతి పాత్ర పాఠకుడికి గుర్తుండిపోయేలా రూపుదిద్దుకుంది. లండన్లో నివసించే భారతీయ సంతతి వర్కింగ్ క్లాస్ జీవితాలను హేమ నిజాయితీగా చిత్రించారు. సరళమైన ఇంగ్లీషులో పొదుపైన వాక్య నిర్మాణంతో సంభాషణలు, వర్ణనలు, సన్నివేశ చిత్రణ సాగింది. భాష, శైలి నవలకు ప్రాణప్రదమైనవి.
ఇంగ్లీషు నవలలు రాసిన తొలితరం భారతీయ రచయితలలో అగ్రగణ్యుడైన ముల్కరాజ్ ఆనంద్ (1905-2004) తొలి నవల ‘ది అన్టచబుల్’ వ్రాత ప్రతిని చదివిన గాంధీ, ‘పెద్ద పెద్ద సంక్లిష్టమైన పదాలను వాడవద్దని, నిరాడంబరమైన భాషను వాడమని, హరిజనులు మాట్లాడే భాషను వ్రాయమని’ సలహా ఇచ్చారు. ప్రజలు నిత్యం వాడే భాషను, నుడికారాన్ని వాడడం పాత్రకు జీవం పోస్తుంది. పాఠకుడు కథాంశాన్ని నమ్మదగినదిగా భావించడానికి తోడ్పడే రచనా ప్రక్రియలో సన్నివేశ కల్పనకు, నాటకీయతకు, కథా సంవిధానానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో భాషకు అంతే ప్రాధాన్యం ఉంటుంది.
జీవితకాల పరిధి తక్కువైనా పాపులర్ నవలలు పై లక్షణాల వలనే పాఠకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. హేమ భాషా, శైలి గురించి మాట్లాడుతూ, ‘The writing is vivid and evocative’ అంటారు సారా టర్నర్. పాపులర్, క్లాసికల్ శైలి శిల్పాలు సమర్థవంతంగా మిళితమై పాఠకుల్ని నవల ఏకబిగిన చదివిస్తుంది. అందుకే మాగీ హామండ్ ‘There are plenty of twists to keep the reader hooked’ అంటారు. ఈ నవలను మీరందరూ చదవండి. ఈ దేశంలో భాగమైపోయిన జీవితాల తీరుతెన్నులు అర్థం చేసుకోవడానికి, రెండు దేశాల్లో మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడానికి ఈ నవల ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇంగ్లండ్లో తెలుగువారి అస్తిత్వానికి సాహిత్యరంగంలో ప్రతీకగా ఆవిర్భవించిన మాచెర్ల హేమ వరంగల్ జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందినవారు. రిచర్డ్ అండ్ జూడీ అనే జంట నిర్వహించిన (2007) నవలల పోటీలో పాల్గొన్న 44,000 ఎంట్రీలలో వడపోయగా మిగిలిన 26 నవలలలో హేమ ‘బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర’ ఒకటిగా నిలిచింది.
(01 జూన్ 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి)




హేమ గారికి అభినందనలు
డిస్కవరికి శర్నార్థులు
- పసునూరి రవీందర్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్