తెలంగాణ కథావేదిక ‘దస్కత్’ ఆవిర్భావం
జూన్ 7th, 2009 by డిస్కవర్ తెలంగాణ
- పసునూరి రవీందర్
ఉద్యమాల పురుటిగడ్డ మీద కథాసాహిత్య ప్రక్రియను మరింత విస్తరించేందుకు తెలంగాణ నవ కథకుల ఆధ్వర్యంలో తెలంగాణ కథా వేదిక ‘దస్కత్’ ఆవిర్భవించింది. తెలంగాణ నేలమీద జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో సాహిత్యం తనవంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది. అక్షరాలు దారి చూపే వెలుగు దీపాలైనయ్. ఈ క్రమంలో జీవితాన్ని సమగ్రంగా ప్రతిబింబించే కథా ప్రక్రియను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఈ ప్రాంత నవతరం గుర్తించింది.
కథాసాహిత్య చరిత్రలో తెలంగాణను సమీక్షించుకోడం కోసం 31.5.09 ఆదివారం, కరీంనగర్ జిల్లా శనిగరంలోని చారిత్రక ప్రాముఖ్యం కలిగిన మోయతుమ్మెద వాగు ఒడ్డున 1914లో నిజాం నిర్మించిన అతిథిగృహం వేదికగా కథకుల సదస్సు జరిగింది. సదస్సుకు వేముగంటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ‘ప్రపంచానికి మొట్టమొదటి కథను అందించిన గుణాఢ్యుడు ఈ గడ్డమీద పుట్టినవాడే.. యువతరం కథకులు తమ జీవిత మూలాలను వెతుకుతున్న తరుణమిది. వందేళ్ల తెలుగు కథ అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి తదితరులు లేకుండా పరిపూర్ణం కాలేదు. అయినా నేటి విమర్శకులనుకునేవారు తెలంగాణ కథపట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. శిల్పపరమైన రాద్దాంతాలు ముందుకు తెచ్చి తమది పైచేయి అనుకుంటున్నారు. ఈ దాడిని తిప్పికొట్టడం యువ కథకుల బాధ్యత. దళిత బహుజన, ముస్లిం, గిరిజన వర్గాలనుండి విస్తృతంగా కథలు రావాలి. కథను మెరుగుపరుచుకోవడంతోపాటు, అభిప్రాయాలు పంచుకొని కథావిస్తరణకు తోడ్పడాలి’ అంటూ సదస్సు ఉద్దేశాన్ని తెలిపారు. సాహిత్య చరిత్రకారులు సంగిశెట్టి శ్రీనివాస్ ‘తెలంగాణ కథా చరిత్ర’ను వివరించారు. ఆధునిక కథ మొదలైంది తెలంగాణ నుండే అయినప్పటికి తెలంగాణకు కథ లేదనే విమర్శ ఉంది. అది సరైంది కాదు అంటూ నాటి పత్రికల్లో కథలకు ఆదరణ లభించని వైనం, రికార్డు కాకుండా కాలగర్భంలో కలిసిపోయిన తీరు, వాటికి తెలంగాణ తొలితరం కథల సంపుటాలు నిదర్శనమని వివరించారు.
‘తెలంగాణ కథ-జీవిత చిత్రణ’ అంశంమీద నందిని సిధారెడ్డి ప్రసంగించారు. సామాజికోద్యమాల ప్రతిబింబంగా తెలంగాణ కథ నడిచిందని, 90ల తరువాత తెలంగాణ కథ అనేక సమూహాలకు అస్తిత్వోద్యమ స్పృహను అందించగలిగిందని సిధారెడ్డి వివరించారు. చివరగా ‘తెలంగాణ కథారచన సంవిధానా’న్ని గురించి ఎ.కె.ప్రభాకర్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యమే జీవితాన్ని నడిపిస్తుందని, జీవితమే వస్తువు, శిల్పాన్ని నిర్దేశిస్తుంది, ఏం చెప్పారన్నది వస్తువైతే, ఎందుకు చెప్పారన్నది దృక్పథం, ఎలా చెప్పారన్నది శిల్పమవుతుంది, ఉద్యమాలు బలంగా ఉన్నచోటే సాహిత్యం బలంగా ఉంటుందని తెలంగాణ సాహిత్యం నిరూపించిందన్నారు.
‘దస్కత్’ కన్వీనర్గా పసునూరి రవీందర్ను, కో-ఆర్డినేటర్గా వేముగంటి మురళీకృష్ణను ఎన్నుకొన్నారు. సదస్సులో బివిఎన్ స్వామి, పూడూరి రాజిరెడ్డి, ఓదెల వెంకటేశ్వర్లు, కాంచనపల్లి గోవర్ధన్, వఝల శివకుమార్, అన్వర్, తైదల అంజయ్య, షాజహానా, పొన్నాల బాలయ్య, దేశపతి శ్రీనివాస్, వెల్దండ శ్రీధర్, సిద్దెంకి యాదగిరి, స్కైబాబ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలవారీగా సంకలనాలు ప్రచురించాలని, కథకుల ప్రోత్సాహానికి ప్రత్యేక పత్రిక అవసరమని, ఉపాధ్యాయ, అధ్యాపకుల సహకారంతో కథను విస్తరించాలని సదస్సు తీర్మానించింది.
-పసునూరి రవీందర్, కన్వీనర్,
‘దస్కత్’ తెలంగాణ కథావేదిక



