గాయపడిన తెలంగాణ
జూన్ 13th, 2009 by డిస్కవర్ తెలంగాణ
- అల్లం నారాయణ
![]()
నిజమే. తెలంగాణ గుండె గాయపడింది. క్షతగాత్ర తెలంగాణ. మరోసారి నిలువునా మోసపోయిన తెలంగాణ. ఇంటి మనుషులు, పరాయి మనుషులతో రెండందాలా దగాపడింది తెలంగాణ. కకావికలై, ఛిద్రుపలైన గుండె గాయం పాతది. అది మాననిది. ఇప్పుడిక ఏలిక పూర్తి విద్వేషంతో, పూర్తి అసహనంతో, ఏమీ దాచుకోకుండానే ప్రకటించాడు.
అవునూ.. ‘ఏమనుకుంటున్నారు మమ్మల్ని’.. ‘మేము’గా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి దాచుకున్నదేమీ లేదు. ఆయన కోస్తాంధ్ర, రాయలసీమ రియల్టర్ల, పెత్తందార్ల, పెట్టుబడిదారుల ప్రతినిధిగా అహంకారాన్ని ప్రదర్శించడంలో కొత్తలేదు. వింతకూడా లేదు. తెలంగాణ ఆత్మమీద చివరాఖరి దెబ్బకొట్టడంలో ఏలిక విపరీతమైన ప్రాంతీయ దురభిమానమూ ప్రకటించడంలో ఆశ్చర్యమూలేదు. అంతా ఖుల్లమ్ఖుల్లా. ఉన్నదున్నట్టే. దాచుకున్నదీ లేదు. మరుగునపరిచిందీ లేదు. ఆ మాట కొస్తే ఏ మాటలు చెప్పి అయిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చారో? ఆ మాటలు మింగాల్సిన పనికూడా లేదు.
తెలంగాణ ఆత్మాభిమానం గురించీ, తెలంగాణకు దక్కనివాటి గురించి, దక్కాల్సిన వాటి గురించి, తెలంగాణకు తరతరాలుగా అంతర్గత వలస ఆధిపత్యం వల్ల జరుగుతున్న అన్యాయాల గురించీ, సహేతుకంగా, స్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతున్న, మాట్లాడాలనుకుంటున్న, వీధులకు ఎక్కాలనుకుంటున్న, ఉద్యమించాలనుకుంటున్న అచ్చ తెలంగాణవాదులందరికీ శాసనసభ సాక్షిగా వై.ఎస్ రాజశేఖర్రెడ్డి ఒక స్పష్టమైన, సూటిగా ఉన్న సందేశం పంపించారు.
బహుశా అది తెలంగాణవాదులకు ఒక హెచ్చరిక. భయం పుట్టడానికి అది ఒక ముందు సూచిక. ఇక ముందు తెలంగాణ, గిలంగాణ జాన్తానై. నేనే తెలంగాణ. తెలంగాణ నావెంట ఉంది అన్నారు వై.ఎస్ అదీ విషాదం. ఎవరైతే తెలంగాణను మాయజేసి, మోసంజేసి అయిదేండ్ల కిందట అధికారంలోకి రావడానికి ఒక పావుగా వాడుకున్నారో? ఎవరైతే మలి తెలంగాణ పోరాటానికి తుది పరిష్కారంగా తెలంగాణ కనుచూపుమేరలో కనబడ్తుందన్న ఆశలు రేపారో? ఎవరైతే తెలంగాణ మాటను అనీ అనకుండా, కనీ కనపడకుండా, వినీవినపడకుండా ఉచ్ఛరించి, తెలంగాణ ఓట్లతో అధికారంలోకి వచ్చారో ఆయన.
ఆ తర్వాత అదే తెలంగాణ ఆకాంక్షలపై అడుగులేసి తొక్కుకుంటూ, తోసుకుంటూ ఉల్టా బనాయించారో ఆయన ఇవ్వాల్టి తెలంగాణకు పెద్దదిక్కు కావడం మరీ విషాదం. ఎందువల్ల? తెలంగాణ ఆకాంక్షలను, ఉవ్వెత్తున లేచినిలబడిన ఆశల మోసులను అణగార్చిందెవరు? తెలంగాణను మళ్లీ ఒకసారి అంగడి సరుకుగా అమ్ముకుని త్యాగాల పునాదుల మీద స్వార్థాల బిల్డింగులు కట్టుకున్నదెవరు? జీవన్మరణ సమస్యలను, ఉద్వేగాలను, త్యాగాల వారసత్వాన్ని, నెత్తురునూ, కలికలి మనసులు పడిన దుఃఖపు కన్నీళ్లను అమ్ముకున్నదెవరు? వై.ఎస్. రాజశేఖర్రెడ్డి అట్లా ఉండకుంటే ఆశ్చర్యపోవాలి. అయినా కొత్తేమీ లేదు.
సిగ్గులేకుండా, కించిత్ ఆత్మాభిమానం లేకుండా చెప్పుకింద నలిగిన వాళ్లలాగా, బానిసల్లాగా, వెన్నెముకలు లేని వానపాములలాగా కనీస అభిజాత్యం లేని, కనీసం స్పృహలేని ఒక వై.ఎస్ రాజశేఖర్రెడ్డి అనుచర మంద గురించీ, మంత్రుల గురించీ, ఎమ్మెల్యేల గురించీ మాట్లాడడం లేదు. కానీ,.. వై.ఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణ పట్ల ద్వేషం వెళ్లగక్కడం, తెలంగాణకు అడ్డంపొడుగూ నిలబడి అడ్డుకోవడం, కాలికేస్తే మెడకేయడం, రక్తాలు పారిస్తానని చెప్పించడం, ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగి ‘మేము ఎట్లా కనపడ్తున్నా’మనడంలో కొత్తేమీ లేదు.
నిజానికి వై.ఎస్. అట్లా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ.. ఉధృతంగా, ఉవ్వెత్తున లేచిన తెలంగాణ మలిపోరాటాన్ని ఇంతటి క్షతగాత్ర చేసిందెవరు? మూడువందలా డెబ్భైమంది ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగాల ఫలితాన్ని అలనాడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి బంగారు పళ్లెంలో పెట్టి ఇందిరాగాంధీ పాదాల చెంతపెట్టాడు. నిజమే చెన్నారెడ్డి స్వయంగా తెలంగాణ ద్రోహిగా బదనామ్ అయ్యారు. అది ఆయనకే పరిమితమయింది.
కానీ, మోసాలు చవిచూసీ చూసీ, ఒక్క ఒప్పందమూ అమలుగాక, రాసుకున్న ఒక్క సూత్రమూ పాటించక, తెలంగాణ వనరుల దోపిడి ఒక్కటీ ఆగక, ఉల్టా ఉనికికి, సంస్కృతికీ, భాషకు, యాసకు కూడా గడ్డురోజులొచ్చిన వివక్షారూపాల పరాకాష్ట నుంచి బుద్ధి జీవుల శ్రమ నుంచి లేచి నిలబడింది మలి తెలంగాణ. చీమలు పుట్టలు పెట్టాయి. రెండో ఉద్యమంలో పామెట్లా చొరబారింది. ఆ రెండు తలల పాము తెలంగాణ మలి ఉద్యమాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేసింది.
అది తన స్వార్థ ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం, దొర పోకడల కోసం, తన చిత్త చాపల్యాల కోసం, నోటితో నిప్పులు కక్కే మాటలు చెబుతూ, నొసటితో తెలంగాణ ప్రజల భవిష్యత్తును వెక్కిరిస్తూ… తెలంగాణ ఉద్యమంమీద ఒక బలహీనతను చిమ్మింది. అదీ తేడా. రెండో విడత మోసకారి ఇప్పటికీ ఒక ఉద్యమకారుడు. ఇప్పటికీ అతను తలదీసి మొలేసే మొనగాడు.
ఇప్పటికీ అతను తెలంగాణ మంత్రాలు వల్లించే మాయల మరాఠీ మంత్రకాడు. ఇప్పుడు మోసగాడు మరోరూపంలో తెలంగాణ గుండెకు గాయం చేసినాడు. ఏ మోసాల వల్ల తెలంగాణ అలనాడు క్షతగాత్ర అయిందో? అదే మోసం వల్ల ఇవ్వాళ్ల తెలంగాణ నడివీధిలో విద్వేషాలను, తిట్లనూ, దూషణలను భరిస్తూ దీనయై నిలుచున్నది. ఎవరిచ్చారీ సావకాశం.
నలభై ఏండ్ల తర్వాత చరిత్ర విషాదాంతంగానూ, వైఫల్యంగానూ ఎందుకు నిలబడింది. ఇప్పుడిక మొత్తం తెలంగాణను తాకట్టుపెట్టి ఇలాంటి అచేతన స్థితికి తెచ్చిన ఒక నాయకుడి గురించి మాట్లాడండి. శషభిషలు వద్దు. తెలంగాణ అంటే అతనికొచ్చిన పది సీట్లేనా? తెలంగాణ అంటే అతను వాగే నాలుగు మాటలేనా? తెలంగాణ అంటే అతను, అతను ప్రోది చేసిన అచేతన, అడుగు కదలని సిద్ధాంతాలేనా?
తెలంగాణ అంటే కాళ్లూపుకుంటూ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటూ, మైకుల ముందు వీరాలాపనలు, ప్రేలాపనలు చేస్తూ, బేరాలాడుతూ, సుఖభోగాలు, లాలసలు, అనుభవిస్తూ, కుటుంబాన్ని పెంచి పోషిస్తూ, ఇంత ఉద్వేగపూరితమైన అంశాన్ని తాకట్టుపెట్టిన ఆ నేత కాదా కారణం. ఇప్పుడిక తెలంగాణవాదాన్ని అమ్మి, అచేతనం చేసిన ఆ నేతను చరిత్ర చెత్తబుట్టలోకి విసరండి.
నిజమే తెలంగాణ గుండె గాయపడింది. అయితే అది రెండు విధాలుగా కోస్తాంధ్ర, రాయలసీమ పెత్తందారుల ప్రతినిధిగా ‘మేము’ అని ప్రకటించుకున్న ఒక ముఖ్యమంత్రి అందరి అసెంబ్లీలో మాట్లాడిన మాటల వల్ల ఆయనకు గొడుగు పడ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్లనూ మరోవైపు తెలంగాణను అమ్ముకుంటున్న ఒక నయవంచన నాయకత్వం వల్లనూ… అవును తెలంగాణ గుండెగాయపడింది.
ఇది ఇంతటితో ముగుస్తుంది? కానీ తెలంగాణ గుండెకయిన గాయం మాటో? అది ఎట్లా రేగుతుందో? ఎవరు చెప్పగలరు. మిస్టర్ చీఫ్ మినిస్టర్… మీరు మాకు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అవునా? కాదా? ఇది ఒక తీరని సందేహం.




మమ్ములను ఏమనుకొంటున్నారు అంటూ, ఓ ముఖ్యమంత్రిగా శామ్యుల్ రెడ్డి మాట్లాడటం తప్పే. అందుకు తెలంగాణా వాళ్లె కాదు, ఆ అహంకారిని ఆ సీట్లో కూర్చోపెట్టిన ప్రతి ఒక్కరూ బాధపడాల్సిందే.
ఇక, చీమల పుట్టలో ఓ పామో, దొరో చేరింది అని నెత్తి నోరు బాదుకోవటమే నాకు నవ్వు తెప్పిస్తుంది. ఆ దొరకు కళ్లేలు ఇచ్చినప్పుడు తెలియలేదా, అతను కేవలం తనక మంత్రి పదవి రాక, ఈ పొగ పెడుతున్నాడు అని.
ఎంతో చదువుకొన్న, విదేశాలలో ఉన్న తెలంగాణా జనాలు, ఈ తాగుబోతు కంటే ఇంకెవరూ దొరకనట్లు, విరాళాలు వసూలు చేసి ఇచ్చినప్పుడు తెలంగాణా వాళ్ల తెలివితేటలు, ఒక సారి దెబ్బతిన్న అనుభవం ఏమయ్యింది?
ఇప్పుడు శామ్యుల్ రెడ్డి వాచాలత చూసి గుండెలు బాదుకొంటన్నవాళ్లెవరూ, ఆ దొర ఇంతకంటే దరిద్రమైన వాచాలత చూపినప్పుడు కనీసం, ఇలా వాగుతున్నాడేమిటి అని కనీసం గొణగనైన గొణిగినట్ట్లు ఎక్కడా గుర్తుకు రావటం లేదే!!
సోనియమ్మను తెలంగాణా దేవత అన్నప్పుడెమీ, మరి మన సమ్మక్క సారెక్కలను ఏమి చెద్దాం అని ప్రశ్నించిన తెలంగాణా మేధావులు ఎవరైనా ఉన్నరా?
అంతెందుకు, నిజాం దురాగతాలకు బలీయిన వాళ్లు ఇంకా మన మధ్యే ఉండగా, పోరాడి రక్తం చిందించిన వీరులు అక్కడక్కడ ఇంకా బ్రతికే ఉండగా, నిజాం ను కీర్తించినప్పుడు, రక్తం సలసలా కాగే తెలంగాణా వీరులు ఎక్కడ దాకున్నరబ్బా?
ఇప్పుడు మీరు విమర్శించాల్సింది ఆ దొరనా, లేక మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్న తెలంగాణా జనాలనా? తెలంగాణా జనాలు గోదావరి ఈదటానికి కుక్క తోక పట్టుకోవటమే మార్గం అనుకొన్నంత కాలం, మీ గాయాలకు తెలంగాణా బకరా/జనాలే కారణం అని మీ బాణాలు వాళ్ల మీద ఎక్కుపెట్టక, ఈ దొర మీదో, శామ్యెల్ రెడ్డి మీదో ఎక్కు పెట్టటం మాత్రం పెద్ద ఉపయోగం లేని పనేమో అలోచించండి.
సార్ ,
మనకు ప్రత్యెక తెలంగాన అవసరమా? , మన దేశం చాల సమశ్య ల్లో ఉన్నది కదా. కూడు గుడ్డా పెట్టని ఆత్మాభిమానము లాంటి మటలు ఎందుకు ? విడిపోతె కొత్తగా వచ్చె లాభం్ ఏమిటి? ఈ వుద్యమము రాజకీయ నిరుద్యోగులకు తప్ప ఎవరికయినా మేలు చేస్తుందా? కె.సి.ఆర్ ఏమయినా విడీపొయిన రాష్త్రాన్ని అద్భుతంగా అభివ్రుద్ది చెస్తాడా, లేక ఇంక ఎవరయినా చేస్తారా? అసలు ఎందుకు విదిపోవలి, చరిత్ర వద్దు. చేతనయితే మన ప్రాంతాన్ని మనకు వీలయినంత బాగు చేద్దాం. విరాళాలు సేకరించి తగుబోతులకు కకుండా మంచి పనులకు ఇద్దం…..
క్షమించండి , ఇది నాకు తెలిసిన విషయ పరిజ్నానాన్ని బట్టీ నా అభిప్రాయం