చావనైనా చస్తాంగాని భూమినొదిలేది లేదంటున్న ప్రజలకు ఏం చెబుతారు?
- శ్రీరాముల శ్రీనివాస్

‘జీవితాలకు అనుకూలంగా సిద్ధాంతాలు మార్చుకోవాలి’ అంటూ తుమ్మేటి కథను బిఎస్ రాములు సమర్థిస్తూ రవిబాబు, దేవేంద్రాచారి, గీతాంజలి తదితరులు తాము ఇతర వృత్తుల మీద ఆధారపడుతూ రైతులు ఇతర వృత్తుల్లోకి వెళ్లడాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని, సరిగ్గా ఇలాంటివాళ్లనే తీవ్రంగా ఖండిస్తూ ఈ కథ రాయబడింది అన్నారు.
సెజ్లను వ్యతిరేకించవలసిందే అయితే రైతులు కోరుకుంటున్న నూతన జీవితాన్ని కూడా ఆహ్వానించవలసిందే అంటూ వైవిధ్యపూరితమైన విశ్లేషణలకు పూనుకున్నారు. వ్యవసాయం గొంతులోతు సంక్షోభంలో కూరుకపోయింది అన్నది వాస్తవం.
చేతివృత్తులు, కులవృత్తుల పరిస్థితి ఇంతకంటే గంభీరంగా ఉన్నది. ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల పుణ్యమా అంటూ ప్రభుత్వ, సహకార, ప్రైవేట్ పారిశ్రామిక రంగాలలో తామర తెంపరలుగా అవుట్సోర్సింగ్ వచ్చి చేరడం మూలంగా వచ్చిపడిన అదనపు జనాభా పట్టణాలలో నెలకొంటున్న కొత్తకొత్త బస్తీలు, మురికి కాలువల పొంటి పెరుగుతున్న గుడిసెలు పెద్ద నిదర్శనం.
విద్యా, వైద్యాల్లో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం పెరుగుతూ వస్తుంది. అనారోగ్యాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. భాష, సంస్కృతి, మానవ సంబంధాలు ధ్వంసం కాబడుతున్నాయి. వీటికి పరిష్కారమేమిటి? రైతులు కోరుకుంటున్న నూతన జీవితానికి తమ భూములను రియలెస్టేట్, సెజ్లకు తెగనమ్ముకోవడమేనా?
నగరీకరణ పెరగడంతో రియల్ బూమ్లో తమ భూములను అమ్ముకోవడం లేదా బలవంతంగా అమ్ముకొనేలా చేయడం ద్వారా వారి జీవితాలలో వచ్చిన మార్పేమిటి? రాములు కోరుకుంటున్నట్టుగా విద్యా, ఉద్యోగం, ఉపాధిని కూడా పొందలేక భూములను, ఊర్లను కోల్పోయి నానా అగచాట్లు పడుతున్నది కనిపించడం లేదా? కిరాణా షాపులు, ఆటోలు, జీపులు, సెల్ఫోన్ సెంటర్లు, జిరాక్స్లు, హోటళ్లు పెట్టుకోవడం ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది?
షాపింగ్ మాల్స్ వచ్చిన తరువాత కిరాణా షాపుల పరిస్థితి ఏమయ్యింది? బట్టతలకు మోకాలుకు ముడిపెట్టినట్టుగా ఆధునిక అభివృద్ధి, ఆధునిక విద్య, ఉపాధి అందుకోవడం కోసం వందేళ్ల నుండి బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు భూములు అమ్ముకుంటూ ఇతర వృత్తులలో చేరుతున్నారు కాబట్టి ఎకరం, రెండెకరాలు, ఐదు ఎకరాలు ఉన్నవారు ఉన్నకాడికి అమ్ముకొని అరబ్ దేశాలకు, బొగ్గుబాయిల్లోకి వెళ్లినవారికి ఏం జరిగిందో చూడకపోవడం విడ్డూరంగా ఉన్నది.
ఆదిలాబాద్, కరీంనగర్ పోరాటాల తరువాత గ్రామాలలోని భూస్వాములు, పెత్తందార్లు, వ్యాపారస్తులు పట్టణాలకు చేరి వ్యాపారాల్లో చేరడం, విద్యా, వైద్య, ఇంజనీరింగ్ రంగాలలో చేరి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలకు ‘వలస’ వెళ్లారు. అరబ్ దేశాలకు వెళ్లిన వారికి అమెరికా తదితర దేశాలకు వెళ్లినవారికి తేడా ఉండటాన్ని గమనించాలి. నిజానికి రైతాంగం తమ పిల్లలు చదువుకొని లెక్చరర్లు కావాలనుకుంటే భూమి అమ్ముకొని చదువమని చెప్పడం కాదు.
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి. విద్య ప్రైవేటుపరం కావడం ఎందుకు చూడలేకపోతున్నట్టు? బొగ్గుబాయిల్లోకి, అరబ్ దేశాలలోకి వెళ్లినవారి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియంది కాదు. బొగ్గుబాయిల్లోకి పోయిన వేలాది ఉద్యోగులు, వీరిపై ఆధారపడిన కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఆటోలు, జీపుల పరిస్థితి ఎలా అగమ్యగోచరంగా తయారైందో తెలియదా? లక్షమందికి ప్రత్యక్షంగా లక్షలాదిమందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సింగరేణి 120 ఏళ్ల చరిత్ర కలిగిఉన్నది.
నేడు ఓపెన్ కాస్టుల పేర యంత్రాలను ప్రవేశపెట్టారు. 35 వేలమందికి ఉద్యోగుల్ని కుదించారు. ఆ చుట్టుపక్కల వ్యవసాయం 70 శాతానికి తగ్గిపోయింది. ప్రజలు, పశువులు కాలుష్యానికి బలైపోతున్నారు. క్వార్టర్లు ఖాళీ చేయించడంతో 60 వేలమంది నిర్వాసితులుగా మారారు. ఉద్యోగులు, కాంట్రాక్టులు, అధికార్లు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాగా శ్రామికులు తెలంగాణవాళ్లు. ఇలా సింగరేణి ప్రజల పాలిట రక్కసిగా మారింది.
పరిహారం అందక, పునరావాసం కల్పించకపోవడం మూలంగా చావనైనా చస్తాముకాని ఉన్న ఊరును సొంత భూములను విడిచిపెట్టేది లేదు అంటున్న ప్రజలకు బి.ఎస్.రాములు ఏమి జవాబు చెబుతాడు? పాలేర్లు ఐఎఎస్ ఆఫీసర్లు అయ్యారు, బి.ఎస్.రాములు తత్వవేత్త అయినంత మాత్రాన బి.సి.లంతా తత్వవేత్తలైనట్టేనా? పాలేరుగా ఉన్నవారి పిల్లలు ఒక్కరిద్దరు ఐఎఎస్, ఐపిఎస్లు అయితే దళితులంతా అయినట్టేనా?
ఉన్నత విద్యను ప్రైవేట్పరం చేస్తూ విద్య వేలకోట్ల రూపాయల వ్యాపారంగా మారి ఎస్సి, ఎస్టి, బిసి, ఇబిసిలు డ్రాప్అవుట్స్గా మారుతూ విద్యా ఉద్యోగ రంగాలకు దూరమవుతుంటే ప్రశ్నించకుండా ఉచిత హాస్టళ్లు, ఉన్నత విద్య గురించి ఉద్భోదించడం ఎంత అసంబద్ధము.
రైతులు కోరుకుంటున్న నూతన జీవనాన్ని ఆహ్వానించే రాములు తాత్వికతకు అర్థం, రైతులు భూములు అమ్ముకుంటే ఆ భూముల్లో సెజ్లు నెలకొల్పడమంటే పరోక్షంగా రైతులు భూములు కోల్పోవడమేగాక విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతోపాటు వివిధ రకాల హక్కులను కూడా కోల్పోవడమేనా?
సామాజిక అసమానతలు తొలగించడానికి, భాష, సంస్కృతి, విద్య వికాసాలకు, మానవున్ని ఉన్నతుడిగా తీర్చిదిద్దడానికి- జీవితాలకు సంబంధం లేని- బిఎస్ రాములు తాత్వికత పొసగనిది. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నంత మాత్రాన భూములు అమ్మాలా? అమెరికా సబ్ఫ్రైమ్ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపివేస్తుంది. వీటికి కారణాలు తెలుసుకొని పరిష్కారాలు చూడకుండా, ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టుకొమ్మని చెప్పడం రాములుకు తగదు.
కొత్తపల్లి, సుంకోజీ, గీతాంజలి సెజ్లను వ్యతిరేకిస్తూనే భాషా, సంస్కృతి, విద్య, వికాసం, ఉపాధులకోసం ఉన్నతమైన మానవ సంబంధాలకోసం తమ కథల ద్వారా అభివృద్ధి పేర కొనసాగుతున్న విధ్వంసాన్ని వ్యతిరేకించారు. భూములు కోల్పోయి శాశ్వత నిరుద్యోగులు కాకూడదనేదే వారి భావన. లెక్చరర్లు, ప్రొఫెసర్లు అందరు భూములను అమ్ముకొనే కాలేదు. వార్డెన్ల అవినీతి నుండి ప్రతి ఒక్క సమస్యపై పోరాడటం ద్వారానే సాధించారని రాములు గుర్తిస్తే మంచిది.
- మావోయిస్టు రాజకీయ ఖైది
- Also Read : సెజ్: తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘చెప్పిన’ కథ