గిర్గ్లానీ.. ఈ పదం గత పదేళ్లుగా తెలంగాణ ఉద్యోగులకు ఉద్యమకారులకు తారకమంత్రమయ్యింది. 610 జీవో అమలులో జరిగిన అవకతవకలను, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలను అధ్యయనం చేసి సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించమని నిర్దేశిస్తూ 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకసభ్య సంఘాన్ని నియమించారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా గిర్గ్లానీ తెలంగాణ ప్రజలకు ఎరుకలోకి వచ్చారు. 1984 ప్రభుత్వ సర్వీసు నుండి ఐ.ఎ.ఎస్. అధికారిగా పదవీ విరమణ చేసినా ప్రభుత్వం ప్రతిభావంతుడైన గిర్గ్లానీ సేవలను వినియోగించుకుంటూ ఉన్నది. నిజాయితీపరుడిగా, నిష్పక్షపాతిగా ఉండే అధికారిగా గిర్గ్లానీ ప్రభుత్వవర్గాలలో పేరుగడించారు.
ప్రభుత్వం గిర్గ్లానీ ఏకసభ్య సంఘాన్ని అయితే ప్రకటించింది కాని చాలా కాలంపాటు ఆయనకు ఆఫీసును, సిబ్బందిని కేటాయించలేదు. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల సహాయ నిరాకరణ.. ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని నోటీసులు జారీ చేసినా అనేక ప్రభుత్వ శాఖలు ఆయనకు సమాచారాన్ని అందించలేదు. తనకు లభ్యమైన పరిమిత సమాచారం ఆధారంగానే ఆయన సవివరమైన, తక్షణ దీర్ఘకాలిక సిఫారసులతో కూడిన నివేదికను సెప్టెంబర్ 2004లో ప్రభుత్వానికి సమర్పించారు. నివేదిక అందుకొని 5 నెలలు గడిచినా ప్రభుత్వం దానిని బహిర్గత పరచలేదు.
పేలుడు పదార్థాలు దట్టించిన ఫిరంగిగుండులాంటి గిర్గ్లానీ కమీషన్ నివేదికను బహిర్గత పరచడానికి ప్రభుత్వం సాహసించలేదు. చివరికి తెలంగాణ ఉద్యోగ సంఘాల, తెలంగాణ రాజకీయ పక్షాల ఒత్తిడికి తలొగ్గి మార్చి 2005 బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీ ముందుంచింది. గిర్గ్లానీ నివేదికను యధాతథంగా ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులు ఏయే రూపాలలో ఉల్లంఘించబడ్డాయో గిర్గ్లానీ వివరంగా చర్చించారు. తక్షణ దీర్ఘకాలిక సిఫారసులు చేశారు. అవన్నీ బుట్టదాఖలై నేటికీ 610 జీవో అమలుకు నోచుకోకపోవడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ.
గిర్గ్లానీ సెప్టెంబర్ 8న తనువు చాలించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఇప్పటి పాకిస్తాన్లోని కరాచీలో సింధీ కుటుంబంలో 21.9.1928న ఆయన జన్మించారు. దేశ విభజనతో గిర్గ్లానీ కుటుంబం పాకిస్తాన్ వదలి భారత్ తరలివచ్చి హైదరాబాద్ రాష్ట్రంలో స్థిరపడింది. అనేక జాతుల ప్రజలని అక్కున చేర్చుకున్న హైదరాబాద్ నగరం గిర్గ్లానీ సింధీ కుటుం బాన్ని కూడా ప్రేమతో ఆదరించింది. గిర్గ్లానీ కుటుంబం ఇప్పుడు హైదరాబాదీ సింధీలుగా హైదరాబాద్ సమ్మిళిత సంస్కృతిలో భాగమైనారు. గిర్గ్లానీ మరణవార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రోశయ్య నివాళి అర్పించడానికి ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాన్ని ఉంచారు.
గిర్గ్లానికి నిజమైన నివాళి ఆయన సిఫారసులను అమలు పర్చడమే. అలాగే తెలంగాణ ఉద్యోగులుగా మనం ఆయన సిఫారసుల అమలుకోసం ఉద్యమించడమే గిర్గ్లానీకి సమర్పించే నిజమైన నివాళి అవుతుంది. గిర్గ్లానీ సంతాప సభ 15.09.2009న సా.5గం.లకు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరుగుతుంది. సభాధ్యక్షులుగా కె.స్వామిగౌడ్, వక్తలుగా జయశంకర్, గద్దర్, కోదండరాం, పాశం యాదగిరి, రాజేంద్ర గిర్గ్లానీ (గిర్గ్లానీ కుమారులు), ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొంటారు.
-తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ