అన్నల్లారా! అక్కల్లారా!
మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డల్లారా… నిజాం పాలన పోతే బాధలన్ని పోతయనుకున్నం. మనం గాకపోయినా మన పొల్లగాండ్లయినా తెల్లగ బతుకుతరనుకున్నం. కాని నోరు అందల మెక్కుదామంటే నొసలు కట్టెలు మోపియ్యవట్టె. బతుకు పేనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టాయె. బుదురకిచ్చి పొత్తు గూడుదామనిరి. ఉప్పేసి పొత్తు గూడిరి. మనం వద్దు వద్దన్నా బల్మీటికి బక్తున్ని జేసి పంగ నామాలు వెట్టిరి. తుడుసుకుందామంటే పోయేదా ఇడుసుకుందామంటే వచ్చేదా. ఎవలో ముగ్గురు ఒప్పుకున్నరని మూడు కోట్లమందిని బందీలు జేసిరి. ఇగో.. ఇదే నవంబర్ ఒక్కటిన మన బతుకులు నాశనం జేసిరి. 1948లో మనకు ససంత్ర మచ్చింది. 8 ఏండ్లళ్ల కొద్దిగ ఈకె దేరినమో లేదో తల్లివేరుకు పుల్లవెట్టిరి.
మాయమాటలు జెప్పి 1956లో పొత్తు గలిపిరి. మనిషిని మనిషి ఇంత మోసం జేత్తడని మనం అనుకుంటమా..? సరే వాళ్లకు రాజధాని లేదుగదా, ఆఫీసులు లేవుగదా, పైసలు, నీళ్లు, బొగ్గు ఏదీ లేదు కదా? ఎట్ల బతుకుతరు పాపం. కొంచం కొంచం ఇస్తే పంచనపడి ఉంటరు గదా అనుకుంటిమిగాని నప్పతుగ బొందిగ ఇరుత్తరని, పాపమని పటివెటు గంజివోత్తే కారం లేదని కశీరు ఎక్కుతరని అనుకున్నామా? 1956 నుంచి ఎన్ని పోరాటాలను అనుగదొక్కిరి.. ఎంతమంది పోరగాండ్లను చంపిరి.. అగ్గోలె రాజుకున్న ఉద్యమాల మీద ఎన్నిసార్లు నీళ్లు జల్లిరి.. పట్నం భూములన్ని అమ్ముకొనిరి. కొలువులన్నీ గుంజుకొనిరి. ఇగ ఇట్లగాదని అసలుకే ఎసరు వెట్టిరి.
మన కాయకష్టంతో కట్టుకున్న పట్నాన్ని పొత్తుల జోన్ జేసిరి. ఇంకేం మిగిలింది చెప్పుండ్రి. గోదావరి ఇక్కడ పారుతది- పంటలు అక్కడ పండుతయి. కృష్ణమ్మ మన పక్కనుంచే పోతది- మనకు తాగుదామంటే నీళ్లుండయి. బొగ్గుబాయి ఇక్కడుంటది- కరెంటు బుగ్గ అక్కడ వెలుగుతది. కొలువులు ఇక్కడుంటయి- మనుసులు అక్కడోళ్లుంటరు. భూములు ఇక్కడుంటయి- పట్టాదారులు అక్కడుంటరు. పాలన ఇక్కడుంటది- పాలకులు అక్కడుంటరు. మన ఎమ్మెల్యేలు గూడా సెక్రెటేరియట్ పోవాలంటే జంకుతరు. వాళ్ల వార్డుమెంబర్లు గూడా సెక్రటేరియట్ల చక్రం తిప్పుతరు.. ఎన్నడు ఆంధ్రకు వరదలచ్చినా లేసినోడు లెవ్వనోడు జోలెగట్టి బిచ్చమడుగుతరు. మనకు ఏండ్లకేండ్లు కరువచ్చింది.
అట్టశాపల లెక్కమాడుతున్నాం. నడీ వానకాలంల గూడా తాగేనీళ్లు లేక తండ్లాడుతున్నం. బతుకుదెరువు లేక మస్కట్, దుబాయి బతుకవోయినం. అక్కడ వేలమంది జైలు పాలయ్యిండ్రు. మరి ఒక్కడు నోరెత్తిండా.. మన బతుకు గురించి మాట్లాడుతుండా… దీనంతటికీ కారణం 1956 నవంబర్ 1 నాడు పొత్తుగూడుడే గదా.. ఆ రోజు మన బతుకులను చీకటి చేసిన పీడ దినం గదా.. ఉగాది ఉందనుకో కొత్త యాడాది అని పండుగు జేసుకుంటం. దసుర ఉందనుకో దుర్గమ్మ గెలిచిందని, దీపావళి- నరకాసురుడు జచ్చిండని పండుగు జేసుకుంటం. నవంబర్ 1 ఉందనుకో మన బతుకుల్ని ఆగం జేసిందని నిరసన దెలుపుదాం. బతుకంతా చీకటి చేసి, తెలంగాణనంతా ఆగం చేసిన ఈ రోజును మనం నిరసన దినంగా పాటిద్దాం రాండ్రి. తెలంగాణ మట్టిల పుట్టిన ప్రతి బిడ్డ- వాళ్ల వాళ్ల ఇండ్లలో ఒక్క నిమిషం లైట్లు బందు చేసి నిరసన తెలుపుదాం. నిజాలను లోకమందరికీ చెప్పుదాం. నవంబర్ 1 రాత్రి 7 గంటలకు..
- తెలంగాణ రచయితల వేదిక