సాహిత్యపు ఫ్రేమ్లో హైదరాబాద్
నవంబర్ 30th, 2009 by డిస్కవర్ తెలంగాణ
ఓరియంట్లాంగ్మన్ వారు ప్రచురించిన “నాంపల్లిరోడ్ నవల చదవని వారు తప్పక చదవాలి. హైదరాబాదు గతవైభవం, సమకాలీన జీవితం అలా అలవోకగా అందులో గుమ్మరించారు రచయిత్రి మీనా అలెగ్జాండర్”. ప్రముఖ ఇండో ఆంగ్లికన్ కవయిత్రి, రచయిత్రి అయిన మీనా రాసిన తొలి నవల అది! ‘నాంపల్లిరోడ్’ అనే ఇంగ్లీషు నవలలోని కథా నాయకకు ఇంగ్లీషు మహాకవి వర్డ్స్ వర్త్ ఆరాధ్యుడు. తనుకూడా ఈ హైదరాబాదు నగర సౌందర్యానికి స్పందించి, వర్డ్స్ వర్త్ లాగా కవిత్వం రాయాలనుకుంటుంది. నిజాం రాజుల వైభవాన్ని తలుచుకుంటుంది. అప్పటి ప్రకతి రమణీయతను ఊహించు కుంటుంది. తను చదువుకున్న ఆంగ్ల మహాకవుల భావకవిత్వం, శృంగార కవిత్వం, ప్రకతి కవిత్వం అంతా కళ్ళముందు తిరుగుతూ ఉండగా… ఆమె హైదరాబాదులో నడుస్తూ ఉంటుంది. నడుస్తూ ఉన్న ఆమెను మానసికంగా వర్డ్స్ వర్త్ ఆవహించి ఉంటాడు.
తీరా ఒక రోజు సాగర్ టాకీసు ఎదురుగా (బ్యాంక్ స్ట్రీట్ నుండి ఆబీడ్స్ సర్కిల్ వైపు వస్తూ ఉంటే ఒకప్పుడు కుడివైపున ఉండేది) దొమ్మీ, కొట్లాట, హత్య చూస్తుంది. తీవ్రంగా చలించిపోతుంది. మరోరోజు కర్ఫ్యూ బాధ, బంద్ల బెడద తెలుసుకుంటుంది. పోలీసుల జులుం, రేప్లు, కక్షలు, కులాల కుమ్ము లాటలు, రౌడీల అఘా యిత్యాలు అర్థం చేసుకుంటుంది. ఆమెకు అక్కడే ఆ సాగర్ టాకీసు దగ్గరే జ్ఞానోదయమౌతుంది. సాగర్ టాకీసు ఎదురుగానే జ్ఞానోదయం ఎందుకయ్యిందో… ఆరోజుల్లో దానికెదురుగా ఏ మఖ్యమంత్రి ఉండేవారో పాఠకులు సులభంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. బుద్దుడయిన సిద్ధార్దుడికి మల్లే ఈ నవలలోని కథా నాయకికి అనేక అనుభవాలు ఎదురుకావడం ఫలితంగా జ్ఞానోదయ మవడం మనమిక్కడ చూస్తాం.

- మీనా అలెగ్జాండర్
ఒక రకంగా రచయిత్రి మీనా అలెగ్జాండర్ తన స్వీయ అనుభవాల్ని, స్వీయానుభూతుల్ని ‘నాంపల్లిరోడ్’ నవలలో నిక్షిప్తం చేశారనిపిస్తుంది. నవలలోని కథానాయకి కూడా ఇంగ్లీషు సాహిత్యంలో డాక్టరేట్ తీసుకుని, అధ్యాపక వృత్తిలో స్థిరపడుతుంది. రచయిత్రిలాగానే నాటింగ్ హోమ్లో ఇంగ్లీషు సాహిత్యంలో డాక్టరేట్ తీసుకుని, నేరుగా మన హైదరాబాదు చేరుకుని, సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా చేరుతుంది. దుర్గాబాయి గోఖిలే అనే లేడీ డాక్టరు ఇంట్లో ఉంటుంది. గోఖిలే పాత్ర మన దుర్గాబాయి దేశ్ముఖ్ను దృష్టిలో ఉంచుకుని, రాసినదై ఉంటుందని స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది.
రచయిత్రి మీనా అలెజ్ఞాండర్కు హైదరాబాదు నగరంలోని సందులు, గొందులతో సహా..వ్యక్తులు, వారి కృషి, కలుషితమైపోయిన సమకాలీన వాస్తవాలూ బాగా తెలుసు. అందుకే ఆమె సృష్టించిన కథా నాయకికి ఆబిడ్స్ సెంటర్లో తిరుగుగుతూ ఉంటే మనల్ని మనం చూసుకుంటున్న అనుభూతి కలుగుతుంది. ‘నాంపల్లిరోడ్’ నవల నిండా హైదరాబాదులో జరుగుతున్న సంఘటనలు, కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి. ఆబిడ్స్ లోని హెడ్ పోస్టాఫీసు నుండి నాంపల్లి స్టేషన్ దాకా ఉన్న ప్రతి చిన్న వివరమూ నవలలో ఉంది. న్యూ మైసూర్ కేఫ్లో సాంబారు రుచి కథా నాయకికి ఇష్టం. (గోల్డెన్ త్రెఫోల్డ్ ఒకప్పుడు సరోజనీ నాయుడు నివసించిన గృహం. మధ్యలో కొంత కాలం హోటల్. ప్రస్తుతం అది హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ కార్యాలయం) అలాగే దానికి ఎదురుగా జి.యల్.యస్. బుక్ షాప్ ఉండేది. ఆ బుక్ షాప్ ప్రసక్తి కూడా ఉంది. బుక్షాప్ ముందు బాకోడర్మ్తో చర్మమంతా తెల్లబడిన చెప్పులు కుట్టే వృద్ధ మహిళ ప్రసక్తి , ఫుట్పాత్ల పై దొరికే మంచి పుస్తకాల ప్రసక్తి …అన్ని నవలలో ఉన్నాయి. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే సాదాసీదాగా కనిపించే ఈ వివరాలలోంచే గత వైభవాన్ని అంకిత భావంతో కృషి చేసిన మహానీయుల్ని కథా నాయకి ద్వారా రచయిత్రి మీనా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.
మరోవైపు ఇంటి యజమాని డాక్టర్ దుర్గాబాయి గోఖిలే చెప్పే ఆత్మకథకు విపరీతంగా చలించి పోతుంది. కళ్ళుమూసుకుని నిశ్శబ్దంగా దుర్గాబాయి త్యాగాల్ని అంకిత భావాన్ని వింటూ ఉంటుంది. ఆమె గొంతులోని ఒక నిండుతనాన్ని అలా వింటూ ఉండటం ఆమెకు ఎంతో ఇష్టం! ఆ రకంగా గతాన్ని వెలికితెచ్చినట్లవుతుంది. చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే నూటయాభయి పేజీల చిన్న నవల ‘నాంపల్లిరోడ్’ అర్థాంతరంగా ఆగిపోతుంది. నగరంలో పెరిగిపోతున్న బ్లాక్ మనీకి హద్దులేదు. సమస్యలకు పరిష్కారాలు లేవు. రాజకీయాల ఆటలకు ముగింపులేదు. బహుశా అందుకే కాబోలు మీనా అలెగ్జాండర్ నవల ‘నాంపల్లిరోడ్’ కు ముగింపు లేదు. నగర జీవితం ముగింపులేని నవల! అది మూసీనదిలాంటిది. వరదలు రావడం, ఎండిపోవడం, మళ్ళీ వరదలు రావడం.. దీనికి మగింపు ఎక్కడ? నిరంతరం ప్రవహించే కాలం ఒడ్డున రంగులు మారుస్తూ ఉన్న హైదరాబాద్ జీవితం ప్రపంచ పాఠకులకు ఈ విధంగా అందింది.

మీనా అలెగ్జాండర్ స్వంత రాష్ట్రం కేరళ. కాని ఆమె చాలా కాలం హైదరాబాదు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజస్ (CIEFL) లో లెక్చరర్గా పని చేశారు. (ఉస్మానియా విశ్య విద్యాలయాన్ని ఆనుకుని వున్న ఈ సంస్థ ప్రస్తుతం యూనివర్సిటీకి ఎదిగింది). ప్రస్తుతం అమెరికాలో ఉంటుంన్న ఈ రచయిత్రి న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ-హంటర్ కాలేజీల్లో ఇంగ్లీషు - సృజనాత్మక రచనల ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. “స్టోన్ రూట్స్” ఈమె తొలి కవితా సంపుటి. ఈమె రాసిన “మన్ హట్టన్ మ్యూజిక్” నవల కూడా హైదరాబాద్ నేపథ్యం లోనే సాగింది. ఈ నవల్లో మళ్ళీ నాంపల్లి రోడ్ మీదే ఒక వృద్ధుడు కళ్ళద్దాలు కుప్పబోసి అమ్ముతుంటాడు. రంగురంగుల అద్దాల్లోంచి మనుషుల ముఖాల రంగు మారుతున్నట్లు కనిపిస్తుంటుంది. ఇలాంటి సన్నివేశమే నవలలోని ప్రధాన పాత్రకు న్యూయార్క్ నగర వీధుల్లో కూడా కనిపిస్తుంది. ఈ నవలలో ‘సంధ్య అనే గృహిణి పాత్ర హైదరాబాదు నుండి న్యూయార్క్ వెళుతుంది. ఆమె కోణంలోంచి ఆమె అక్కడి జీవితాన్ని పరిశీలిస్తుంది. తన నవలలోని పాత్రలతో రచయిత్రి మీనా అలెగ్జాండర్ నాంపల్లిరోడ్ను ఒక రకంగా హైదరాబాదు జీవితాన్ని న్యూయార్క్ జీవితంతో అనుసంధానం చేశారు.
మూడు దశాబ్దాల పాటు చేసిన నిరంతర సృజనాత్మక కృషి మీనా అలెగ్జాండర్ను అంతర్జాతీయ స్థాయిలో నిలిపింది. ఆమె రచనలు కొన్ని జర్మన్, ఇటాలియన్ భాషల్లోకి అను వందింపబడ్డాయి. ఎక్కడో కేరళలో ఒక మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన మీనా అనే అమ్మాయి రాష్ట్రాల ఎల్లలూ, దేశాల ఎల్లలూ దాటి, భాషా సంస్కృతుల పరిధుల్ని దాటి ఒక అధ్యాపకురాలిగా, ఒక పరిశోధకురాలిగా… రచయిత్రి నిలదొక్కుకోవడం సామాన్య విషయమేమీకాదు. ఆమె ఎక్కడ ఉన్నా తన మూలాల్ని మరవకపోవడం, భారతీయతను పరిరక్షించుకుంటూ ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. మళయాళ భాషలోని మాధుర్యం, సరళత, లయ, వింతైన సొగసులన్నీ ఆమె ఇంగ్లీషు కవిత్వంలో కూడా కనిపించడం విశేషం! మరీముఖ్యంగా తొలి కవితా సంపుటి “స్టోన్ రూట్స్”లో ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈమె నవల్లోని పాత్రలు అమెరికా, ఇతర యూరోప్ దేశాలు తిరిగినా తన స్వీయ అనుభవాలతో అల్లిన కథలతో, ఆమె ఖండాంతర సంబంధాల్ని నెలకొల్పారు.
(30 నవంబర్ 2009 ‘వార్త’ సౌజన్యంతోటి)
-
Meena Alexanders novel ‘Nampally Road’ on Amazon



