సలాం హైద్రాబాద్ : పదిహేనో భాగం
ఫిబ్రవరి 8th, 2010 by డిస్కవర్ తెలంగాణ
15
1969 జూన్ 27న ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామ చేసినాడు. ఆ రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్కు పంపకుండ ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్పకు పంపినాడు. అదీ ఆయన కుటిల నీతి.
ఆరు నెలల సుదీర్ఘ తెలంగాణా ఉద్యమ పోరాట ఫలితమే ముఖ్యమంత్రి రాజీనామా. ఇది తెలంగాణ ప్రజల నైతిక విజయం. రాజీనామా వార్త తెలిసిన ప్రజల ఆనందం హద్దులు దాటింది. ఆ మధ్యాహ్నం నిషేధాజ్ఞలు ధిక్కరించి నగరంల ఊరేగింపులు తీసినారు. ఈసారి సికింద్రాబాదు రక్తపుటేరులల్ల మునిగిపోయింది. తెలంగాణా ప్రజలకు ప్రతి రోజూ ఏదో ఒక చోట తమ రక్తాన్ని, ప్రాణాల్ని ‘సాకబోయటమే’ తమ పవిత్ర ధర్మంగ మారిపోయింది.
ముఖ్యమంత్రి రాజీనామా వార్త వినంగానే ఆనందపరవశులైన ప్రజలు నాట్యాలు చేసుకుంట కనిపించిన వాహనాలల్ల, లారీలల్ల ఎక్కి వీధులల్ల ఊరేగింపులు తీసినారు. ఆ ఉత్సాహంతో పోలీసులకు ప్రజలకు మధ్య ఘర్షణలు జరిగినై. సికింద్రాబాదుల అన్ని వీధులు యుద్ధభూములైనై. పోలీసుల లాఠీచార్జిలకు, టియర్ గ్యాస్లకు జవాబుగ ప్రజలు దహనకాండ సాగించినారు. చాలా చోట్ల పోలీసు కాల్పులు జరిగినై. ఆ కాల్పులల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారమే 20 మందికి తీవ్రగాయాలై ప్రాణాపాయ స్థితిల గాంధీ ఆసుపత్రికి చేరుకున్నరు. కాల్పుల్ని లెక్క చేయకుండా ప్రజలు గెరిల్లా పద్ధతిల పోలీసులతోటి దాగుడుమూతలాడుకున్నరు. ఎన్నిసార్లు చెదరగొట్టినా చిన్న చిన్న గల్లీలల్ల నుండి మెరుపు తీగల్లాగ మళ్లీ ఇవతలికి వచ్చి పోలీసులతోటి కొట్లాటలకు దిగినారు. దాడులు చేసి మాయమైనారు.
సికింద్రాబాదు హెడ్ పోస్టాఫీసును దహనం చేసినారు. రాష్ట్రపతి రోడ్డు, మహంకాళీ మార్కెట్టు రోడ్డుల దుకాణాల ఫర్నీచర్ను రోడ్డు మీదికి లాగి దహనం చేసినారు. ఒక్క రాష్ట్రపతి రోడ్డుల జరిగిన కాల్పులల్ల 14 మంది గాయపడినారు. జాఫర్ అనే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ గుంజుకొని ఆయనను చితకగొట్టినారు. మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు వస్తే వాటిని సైతం దహనం చేసినారు. సి.ఆర్.పి. దళం ఉన్న లారీని ప్రజా సమూహాలు మనోహర్ టాకీసు వద్ద నాలుగు మూలల్నుండి ముట్టడించి దిగ్బంధనం చేసి దాడులకు దిగినారు. వారు మెషిన్ గన్లతో కాల్పులు చేస్తూ గంట తర్వాత ఇవతలికి వచ్చినారు. నిజానికి అదొక యుద్ధ బీభత్స భయానక దృశ్యం. రోడ్లు రణరంగాలై ప్రజలు శివతాండవం చేసినారు. ఆ ప్రజాశక్తి పత్రికల వారిని కూడా అబ్బుర పరిచింది. వీధులల్ల పక్కనున్న ఎలక్ట్రిక్, టెలిఫోను స్తంభాల్ని అవలీలగ పీకేసి రోడ్లకు అడ్డంగ పడేసినారు. ఫలితంగ ఆ రోజు రాత్రంత జంటనగరాలల్ల కరెంటు లేదు. రోడ్ల మీద రాళ్లురప్పలతో బారికేడ్లు కట్టినారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకుపోవడం చాలా కష్టమయ్యింది. ఆ గొడవల వలన జంటనగరాలల్ల మళ్లీ 24 గంటల కర్ఫ్యూ విధించినారు. నగరంల జనజీవనం ఒక జైలుగ మారిపోయింది.
ఢిల్లీల కాంగ్రెసు వర్కింగు కమిటీ సమావేశమై ముఖ్యమంత్రి రాజీనామా లేఖపై తీసుకునే నిర్ణయాన్ని నిరవధికంగ వాయిదా వేసింది. ఒక వైపు తెలంగాణా అగ్నిగుండంగ మారుతున్నా కేంద్రానికి కొంతైనా కనికరం లేదన్న సంగతి తెలంగాణా ప్రజలకు తెలిసిపోయింది. అయినా ప్రజా ఉద్యమం కొనసాగుతనే ఉంది. సత్యాగ్రహాలు, పికెటింగులు, అరెస్టులు, పోలీసు కాల్పులు, లాఠీచార్జీలు నిత్యకృత్యంగ మారిపోయినై. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశంల ముఖ్యమంత్రి పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ శాంతియుత పరిస్థితులు ఏర్పడేవరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని తీర్మానం జరిగింది. 25 మంది తెలంగాణా శాసనసభ్యులు ఆ సమావేశాన్ని బహిష్కరించినారు. ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణా వాళ్ళకే ఆ పదవి ఇస్తానని కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రకటించినాడు. కేవలం నాయకత్వ మార్పు సరిపోదని ప్రత్యేక రాష్ట్రమే తమ లక్ష్యమని తెలంగాణా ప్రజా సమితి ప్రకటించింది. కానీ లోలోపల తెలంగాణా ఉద్యమాన్ని నడిపిస్తున్న కాంగ్రెసు నాయకులల్ల పదవి పట్ల మోజు మొదలయ్యింది. బ్రహ్మానందరెడ్డి కుటిల నీతి ఫలించటం ప్రారంభమయ్యింది. ఉద్యమం ప్రజలను వదిలి ‘కుర్చీ’ చుట్టూ తిరగడం మొదలయ్యింది.
37 రోజులుగ నడుస్తున్న తెలంగాణా ఉద్యోగుల సమ్మెల విభేదాలు సృష్టించి చీలికను తెచ్చినారు. తెలంగాణా ఉద్యోగుల సంఘంల అభిప్రాయ భేదాల వలన ఆ సంఘం అధ్యక్షుడు అమోస్ తన పదవికి రాజీనామా చేసినాడు. ఫలితంగ సమ్మె విరమించబడింది. రెండు నెలలుగ జీతాలులేని ఉద్యోగులు చేసే రాజకీయ పోరాటాలకు పరిమితులు ఉంటవని తెలిసిపోయింది. కొంత మంది నాయకులు లొంగిపోయినారు. తాత్కాలిక ఉద్యోగులందరినీ ప్రభుత్వం ఉద్యోగాల నుండి తొలగించగ వారు బలిపశువులైనారు. తర్వాత కొద్ది రోజులకు ఉస్మానియా యూనివర్శిటీ ఉద్యోగులు కూడ సమ్మెను విరమించి విధులల్ల చేరినారు.
మరో వైపు ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఉద్యమం విరమించనిదే, శాంతి నెలకొనందే తను జోక్యం చేసుకోనని తెగేసి చెప్పింది. ఉద్యమాన్ని విరమిస్తేనే కేంద్ర సాయుధ బలగాలను వెనుకకు తీసుకుంటనని మొండికేసింది. ఇక రాష్ట్రపతి పాలన ప్రసక్తే లేదు. బెంగుళూరుల జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలల్ల ప్రత్యేక తెలంగాణా ఉద్యమం గురించి కనీసం చర్చ అయినా జరుగలేదు. సుప్రీంకోర్టు జోక్యం వలన ఆగస్టు నెలల రాజమండ్రి జైలు నుండి చెన్నారెడ్డి, మల్లికార్జున్లతో పాటు అగ్రనాయకులందరినీ విడుదల చేసినారు.
సెప్టెంబరు నెల హైద్రాబాదుకు అచ్చిరాదని ఏదో ఒక కీడు జరుగుతుందని పాత కాలంనాటి పెద్ద మనుషులు భయపడుతున్నరు. 1908ల హైద్రాబాదుల మూసీ నదికి వరదలొచ్చి పురానాపూల్ వంతెన కూలిపోయి సగం నగరం నాశనమయ్యింది ఈ సెప్టెంబరు నెలలనే. 1954 సెప్టెంబరు నెలలనే వసంత వాగు పొంగి ఆలేరు దగ్గరి రైలు బ్రిడ్జి కూలిపోయిన రైలు ప్రమాదంల అనేక మంది చనిపోయినారు. చివరికి ఉవ్వెత్తున ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వెనకడుగు వేసి చల్లారటం ప్రారంభమైందీ నెలనే. ఉద్యమ నాయకులు పోరాటాన్ని అసెంబ్లీకి పరిమితం చేసి విద్యార్థులను క్లాసులకు హాజరు కమ్మని సలహా ఇచ్చినారు. అప్పటికే ఉద్యోగులు సమ్మె విరమించినారు. ఉద్యమ తిరుగుముఖం ఒక ప్రణాళిక ప్రకారం నెమ్మదిగ జరిగింది. కళాశాలలు పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్నని స్వయంగ చెన్నారెడ్డి, మల్లికార్జున్లు ప్రకటన చేసినారు. త్వరలో జరగబోయే ఎన్నికలల్ల బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేసినారు. మరో వైపు ముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణా కాంగ్రెసు అగ్ర నాయకులల్ల పోటీ మొదలయ్యింది. ఉద్యోగులు, విద్యార్థుల సమ్మె విరమణతో ఉద్యమం పట్టును కోల్పోయింది.
నవంబర్ 27న ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన చెన్నారెడ్డి విద్యార్థులు పరీక్షలల్ల, గ్రామీణులు వ్యవసాయపు పనులల్ల నిమగ్నమై ఉన్నందున ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించినాడు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో 360 మంది చనిపోయినారు. ఎంత మంది వికలాంగులైనారో లెక్కలు తెలియవు.
ఒక సంవత్సర కాలం అగ్నిగుండంగ మారిన తెలంగాణా, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి వీరోచిత త్యాగాల చరిత్రను సృష్టించిన తెలంగాణా, రక్త తర్పణలతో, అశ్రు అభిషేకాలతో, బలిదానాలతో కొనసాగిన తెలంగాణా ఉద్యమం సంవత్సరం చివరల నాయకుల విద్రోహానికి గురై నిలువెల్ల గాయాలతో నిలిచిపోయింది. ‘మౌన వీణ’గ మూగబోయింది.
… తరువాత భాగం ఒచ్చే వారం



